
ఎస్సెస్సీ మెరిట్ విద్యార్థులకు ఫీజు రాయితీ
నిజామాబాద్అర్బన్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కాకతీయ ఐఐటి, మెడికల్ అకాడమిలో ఫీజు రాయితీ ఇవ్వనున్నట్లు కాకతీయ ఐఐటీ మెడికల్ అకాడమీ చైర్పర్సన్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాసంస్థ స్థాపించబడి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫీజు రాయితీ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. మెరిట్ విద్యార్థులకు ఇంటర్ విద్యతోపాటు ఐఐటీ, మెడికల్ కోచింగ్లో ఫీజు రాయితీ ఇవ్వనున్నుట్లు తెలిపారు. ప్రతీ తరగతిలో ఐదుగురికి మాత్రమే ఈ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. 575కు పైగా మార్కులు వచ్చిన వారికి 100 శాతం ఫీజు రాయితీ, 565కు పైగా మార్కులు వచ్చిన వారికి 75 శాతం, 555కు పైగా మార్కులు వచ్చిన వారికి 60 శాతం, 545కు పైగా మార్కులు వచ్చిన వారికి 50 శాతం, 535కు పైగా మా ర్కులు వచ్చిన వారికి 45 శాతం, 525కు పైగా మార్కులు వచ్చిన వారికి 40 శాతం, 500లకు పైగా మార్కులు వచ్చిన వారికి 30 శాతం ఫీజు రాయితీ కల్పించనున్నట్లు తెలిపారు. మెరిట్ ప్రోత్సాహకాలు రెండు సంవత్సరాలకు వర్తిస్తుందని ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు 91820 29525, 91775 56270 నెంబర్లను సంప్రదించాలని ఆమె అన్నారు.
అంబేడ్కర్ జయంతి బ్రోచర్ ఆవిష్కరణ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెయూ వీసీ యాదగిరిరావు అన్నారు. ఈమేరకు మంగళవారం తెయూలో కార్యక్రమ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. కార్యక్రమంలో కీలకోపన్యాసం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ లింబాద్రి హాజరవుతున్నారని తెలిపారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఇంటిని కూల్చిన కేసులో నలుగురి రిమాండ్
వేల్పూర్: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గత నెలలో బచ్చు గంగాధర్ అనే వ్యక్తి ఇంటిని అక్రమంగా కూల్చిన కేసులో మంగళవారం నలుగురు గ్రామస్తులను రిమాండ్కు పంపినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. మచ్చర్ల నర్సారెడ్డి, ఏనుగు మోహన్రెడ్డి, రిక్క రాజేశ్వర్, ఏనుగు నర్సారెడ్డి లను రిమాండ్కు తరలించామన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిజామాబాద్ జైల్లో కొందరు రిమాండ్లో ఉండగా, మరికొంత మంది పరారీలో ఉన్నారని వెల్లడించారు.
వృద్ధుడి అదృశ్యం
మాచారెడ్డి: ఎల్లంపేట గ్రామానికి చెందిన మాలోత్ రాజ్య(60) అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు ఎస్సై అనిల్ మంగళవారం తెలిపారు. మార్చి 31న మహారాష్ట్రలోని పౌరాదేవి దర్శనం కోసం వెళ్లిన రాజ్య ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ఎస్సెస్సీ మెరిట్ విద్యార్థులకు ఫీజు రాయితీ