15 శాతం వృద్ధిరేటే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

15 శాతం వృద్ధిరేటే లక్ష్యం

Apr 4 2025 1:10 AM | Updated on Apr 4 2025 1:10 AM

15 శాతం వృద్ధిరేటే లక్ష్యం

15 శాతం వృద్ధిరేటే లక్ష్యం

జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు

నరసరావుపేట: జిల్లాలో 2025–26 ఆర్థిక ఏడాదిలో 15 శాతం వృద్ధి లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. ప్రధానంగా ఉద్యాన పంటలు, పశు పోషణ, పర్యాటక రంగాలలో అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారిస్తామన్నారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా అభివృద్ధి, ఉపాధి హామీ ప్రణాళికపై మాట్లాడారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణం 20వేలు హెక్టార్లకు పెంచనున్నామన్నారు.

పంచ ప్రాధాన్యత కార్యక్రమాలు..

అన్ని అనుమతులు పొంది వివిధ కారణాల చేత నిలిచిపోయిన పరిశ్రమలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవటం ద్వారా ఉపాధి అవకాశాలతో పాటూ పారిశ్రామిక వృద్ధి సాధించగలమన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక నూతన హోటల్‌ ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నామన్నారు. వేసవిలో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఉపాధిహామీ పథకంలో పంచ ప్రాధాన్యతా కార్యక్రమాలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. అన్ని చెరువులలో కనీస అవసరాలకు తగ్గట్టు నీరు నింపడం, కాల్వల పూడికతీత పనులు చేపడతామన్నారు. మొత్తం 6500 ఫామ్‌ పాండ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే, డీఆర్వో మురళి, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి పాల్గొన్నారు.

రెండు హాస్పిటళ్లకు జరిమానా..

డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవలపై రోగుల నుంచి డబ్బులు వసూలుచేసిన రెండు హాస్పిటళ్లకు జరిమానా విధించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అధ్యక్షతన జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు సుమారు 30 ఫిర్యాదులను పరిశీలించారు. రోగులకు నగదు రహిత వైద్యసేవలు అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.రవి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ బీవీ రంగారావు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా సవరణకు దరఖాస్తులు..

నరసరావుపేట: జిల్లాలో ఈ ఏడాది జనవరి ఆరు నుంచి ఏప్రిల్‌ మూడవ తేదీవరకు నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అన్ని రకాల ఫారాల క్లెయిములు 2995 ఉన్నాయని, అందులో నూతన ఓటర్లు 296 మంది, తొలగింపులు 2280 ఉండగా, మార్పులుకు 416 అందాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. గురువారం ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కలెక్టర్‌ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం చేపడుతున్న పలు విధానాలను ఎప్పటికప్పుడు తెలియచేసే విధంగా ప్రతి నెల సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరంగా జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement