
ఇంటర్ అడ్మిషన్లు చేపట్టండి
నరసరావుపేట ఈస్ట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఇంటర్మీడియెట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలను చేపట్టాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సోమవారం తెలిపారు. ఈమేరకు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు తెలియచేసినట్టు వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల కళాశాలలతోపాటు మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, గిరిజన సంక్షేమ కళాశాలలు తదితర ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థుల ప్రవేశాలను పెంచేలా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలను విద్యార్థుల దృష్టికి తీసుకవెళ్లాలన్నారు. ఇప్పటికే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేపట్టినట్టు వివరించారు. కాగా, ఇంటర్ ఫలితాలను రెండవ వారంలో విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తుందని తెలిపారు.
ముప్పాళ్లలో భారీ వర్షం
ముప్పాళ్ళ: ముప్పాళ్లలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమవడంతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండవేడితో అల్లాడిన ప్రజలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ ఈదురుగాలులతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కళ్లాల్లో ఉన్న మొక్కజొన్న, మిరప, పసుపు పంట దిగుబడులు తడవకుండా కాపాడుకునేందుకు పట్టలు కప్పేందుకు పరుగులు పెట్టారు. ఇప్పటికే పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని, తడిస్తే కొనేవారు ఉండరని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సాయి కల్యాణ చక్రవర్తి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బి.సాయి కల్యాణ్చక్రవర్తి నియమితులయ్యారు. రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న కొందరికి పదోన్నతి, మరికొందరికి స్థాన చలనం కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న బి సాయి కళ్యాణ్ చక్రవర్తిని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న వై.వి.ఎస్.బి.జి.పార్థసారథిని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా నియమించారు.
గుంటూరు నగరంలో పర్యటించిన ఐజీ
పట్నంబజారు: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం గుటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పాతగుంటూరు పోలీసు స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో ఆనందపేటలో జరిగిన వృద్ధురాలు పఠాన్ ఖాజాబీ హత్య, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన దాడి నేపథ్యంలో సంబంధిత కేసు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని, నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకోవాలని స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అనంతరం ఆనందపేట 2వలైనులో హత్య జరిగిన ప్రాంతాన్ని కూడా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ఐజీ వెంట ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్య, పాతగుంటూరు పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ వై.వీరసోమయ్య తదితరులు ఉన్నారు.
యార్డుకు 1,53,787
మిర్చి బస్తాలు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,53,787 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,37,288 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 64,276 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

ఇంటర్ అడ్మిషన్లు చేపట్టండి