
కంప్యూటరీకరణ విప్లవాత్మక మార్పు
నరసరావుపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కంప్యూటరైజేషన్ అనేది ఒక సాంకేతిక మార్పు మాత్రమే కాదని, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన పురోగతి అని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా స్థానిక ప్రకాష్నగర్లోని సహకార బ్యాంకు ఆవరణలో గురువారం పీఏసీఎస్లో కంప్యూటరీకరణ అనే అంశంపై పీఏసీఎస్ సీఇవోలు, బాంక్ మేనేజర్లు, సూపర్వైజర్లు, ఆడిటర్లకు నిర్వహించిన జిల్లా స్థాయి సెమినార్కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో గ్రామీణ రైతుల ఆర్థిక జీవన విధానానికి బలమైన మద్దతుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిలుస్తున్నాయని చెప్పారు. ఇవి రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణాలు, ఇతర సదుపాయాలు అందించే విధంగా పనిచేస్తున్నాయని అన్నారు. భారత ప్రభుత్వం సహకార రంగ అభివృద్దికి రూ.2,516కోట్ల నిధులు కేటాయించి 63,000 పీఏసీలను కంప్యూటరైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం, నెట్వర్కింగ్ ద్వారా రాష్ట్ర, జాతీయ బ్యాంకులతో అనుసంధానం కల్పించడం జరుగుతాయని అన్నారు. జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ మాట్లాడుతూ కంప్యూటరీకరణ వారికి మేలు చేస్తుందన్నారు. గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు జీఎం అజయ్కిషోర్, జిల్లా ఆడిట్ అధికారి డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.