
కార్యకర్తలకు కొండంత అండగా వైఎస్ జగన్
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
పెద్దారవీడు: వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, మనందరికీ కొండంత అండగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. మండలంలోని గుండంచర్ల గ్రామం సమీపంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం వేనూతల కాటమరాజుస్వామి, గంగాభవానీ అమ్మవార్లకు ఎమ్మెల్యేతో పాటు కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యేతో పాటు నారాయణ యాదవ్, నాగార్జున్ యాదవ్లు బొల్లావును నెత్తిన పెట్టుకొని కొద్దిసేపు ఆడించారు. వారిని పూలమాల, శాలువలతో ఆలయ కమిటీ సభ్యులు, యాదవులు ఘనంగా సన్మానించారు. అనంతరం వైఎస్సార్ సీపీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, రాబోయే కాలంలో మనందరి ప్రభుత్వం వస్తుందని అప్పుడు మన సత్తా ఏమిటో చూపిద్దామని ధైర్యాన్ని ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమాలు, ప్రలోభాలకు గురి చేసినా ఉప ఎన్నికల్లో అంతిమ విజయంలో వైఎస్సార్ సీపీ సత్తాచాటిందని చెప్పారు. యాదవులకు ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, ఎప్పుడూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. యాదవులు, పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తిరునాళ్ల సందర్భంగా కాటమరాజుస్వామి, గంగాభవాని తల్లి పుష్కలంగా వర్షాలు కురిపించి పశుసంపద, పాడి పంటలతో తులతూగేలా భక్తులను ఆశీర్వదించి చల్లగా చూసి కాపాడాలని వేడుకుంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారని గుర్తు చేశారు. ఆలయం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు చర్యలు చేపడతానని అన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి, నేరుగా ఆయనతోనే పనులకు శంకుస్థాపన చేసేందుకు తీసుకుని వస్తానని చెప్పడంతో యాదవులు ఈలలు, కేరింతలతో స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చే సింగిల్ రహదారిని డబుల్ రహదారిగా వేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దద్దాల నారాయణ యాదవ్, నాగార్జున యాదవ్లు మాట్లాడుతూ బీసీలంటే వైఎస్ జగన్మోహనరెడ్డికి అమితమైన ఆప్యాయత ఉంది కాబట్టే కాటమరాజుస్వామి తిరునాళ్ల గురించి తెలుసుకొని ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనిని బట్టి జగన్మోహన్రెడ్డికి యాదవులంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. యదవులంతా ఐక్యంగా ఉండి రాబోవు ఎన్నికల్లో ఆయన్ను మళ్లీ సీఎంగా చేసుకునేందుకు మనందరం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభపై పాటకచ్చేరి ఏర్పాటు చేశారు. తిలకించేందుకు పశ్చిమ ప్రాంతం నుంచి యాదవులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

కార్యకర్తలకు కొండంత అండగా వైఎస్ జగన్