పెద్దల గెట్టు తాకని భూసేకరణ | - | Sakshi
Sakshi News home page

పెద్దల గెట్టు తాకని భూసేకరణ

Apr 3 2025 7:53 PM | Updated on Apr 3 2025 7:53 PM

పెద్ద

పెద్దల గెట్టు తాకని భూసేకరణ

పెద్దల జోలికి వెళ్లని అధికారులు

ఇండస్ట్రియల్‌ పార్కు కోసం సేకరించే భూములు పెద్ద గెట్టు తాకకుండా పేదల భూములనే సేకరించడం విశేషం. తోటపల్లి శివారులో రోడ్డుకు రెండు వైపుల భూములు ఉన్నప్పటికీ పెద్దలవి వదిలేసి పేదల వ్యవసాయ భూములు, రోడ్డు పక్కనే 11 మంది నివాస స్థలాలు 22 గుంటలను కూడా సేకరణలో నమో దు చేశారు. ఒక్కొక్క ప్లాటుకు రూ.7 లక్షలకు కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమల సాకుతో పేదల భూములకు ఎసరు

వైఎస్సార్‌ రుణమాఫీతో పేదలకు భూమి హక్కులు

బోర్లు వేసుకొని పంటలు సాగు

ఇండస్ట్రియల్‌ పార్కుతో పేదల ఆందోళన

వదిలేయాలని బాధితుల డిమాండ్‌

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ డివిజన్‌లో పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి, టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేయడానికి భూమి కావాలని రెవెన్యూ అధికారులను కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు కనీసం 105 ఎకరాల వరకు అవసరం ఉంటుందని చెప్పారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో 312 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి 83.36 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు సూచించారు. ఇదే మండలం జనగామ శివారులో 15.20 ఎకరాలను సేకరణకు రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. అలాగే, హుస్నాబాద్‌ మండలం తోటపల్లి శివారులో 25.20 ఎకరాల భూమిని సేకరించడానికి అధికారులు సర్వే చేశారు. మొత్తం 124 ఎకరాల 36 గుంటలకు భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసి 15 రోజుల కిందట మొదటి దఫా గ్రామ సభ చౌటపల్లిలో ఏర్పాటు చేశారు. రైతులు మా భూములు ఇయ్యమని వ్యతిరేకించడంతో మరోసారి గ్రామ సభ ఏర్పాటు చేయొచ్చని అధికారులు వెళ్లిపోయారు.

పరిశ్రమల సాకుతో పేదల భూమికి ఎసరు..

చౌటపల్లి సర్వే నంబరు 312లో 83.36 ఎకరాల అసైన్డ్‌ భూముల సమస్యల రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. పట్టాలు ఒకరికి ఉంటే మోకాపై మరొకరు ఉండటంతో రికార్డుల ప్రక్షాళన సమస్య జటిలంగా మారింది. ఈ భూములను ప్రభుత్వం తిరిగి తీసుకొంటే సమస్యకు ముగింపు పలుకొచ్చని అధికారుల ఆలోచనకు కొందరు గ్రామస్తులు మద్దతు ఇవ్వడంతో భూసేకరణ జరుగుతుంది. 1995లో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పేదలకు భూ కొనుగోలుకు రుణాలు ఇవ్వడంతో తోటపల్లి శివారులోని 12 మందికి 24 ఎకరాల భూమిని కొని ఇచ్చారు. పంటలు సాగు చేసుకుంటూ రుణాలను చెల్లిస్తూ వచ్చిన పేదలకు 2005లో వైఎస్సార్‌ సీఎం అయిన తర్వాత రుణమాఫీ చేయడంతో పేదలకు రుణ విముక్తి కలిగి భూముల పై హక్కుల వచ్చాయి. భూములు మావే అనే భరోసాతో బతుకుతున్న దళితులకు చెందిన 14 ఎకరాలను ఇండస్ట్రియల్‌ పార్కు కోసం తీసుకుంటున్నామని అధికారులు చెప్పగానే దళిత కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.

ఈ ఫొటోలో కనిపించే రైతు పేరు వైనాల రాకేశ్‌. ఇతడి తండ్రి అశోక్‌కి 1995లో దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా భూమి కొనుగోలుకు రుణం ఇచ్చింది. అశోక్‌కు 2 ఎకరాల భూమి ఇయ్యడంతో అందులో బోరు వేసుకొని పంటలు సాగు చేసి జీవిస్తున్నాడు. 15 ఏళ్ల కిందటనే అశోక్‌ మరణించడంతో ఈ భూమిలోనే వ్యవసాయం చేసుకొని తల్లి, కొడుకు బతుకుతున్నారు. ప్రభుత్వం ఇండస్ట్రియల్‌కు వారి భూమి తీసుకుంటుందని తెలువడంతో పేద కుటుంబం ఆందోళన చెందుతుంది. తోటపల్లి శివారులోని మా భూమి వదిలేయాలని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు.

గ్రామం ఎకరాలు రైతులు

చౌటపల్లి 83.36 120

జనగామ 15.20 08

తోటపల్లి 25.20 31

మొత్తం 124.36 159

పెద్దల గెట్టు తాకని భూసేకరణ1
1/1

పెద్దల గెట్టు తాకని భూసేకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement