ప్రశాంతి నిలయం: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జిల్లాలో పక్కాగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం అమలుపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటి వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులు.. పరిష్కరించిన కేసుల వివరాలను సంబంధిత శాఖల అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ... ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరానికి మానిటరీ రిలీఫ్ రూ.4.35 కోట్లు మంజూరైందని, ఇప్పటివరకు రూ.2.41 కోట్లు బాధితుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని వారం రోజుల్లో బాధితుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. భూతగాదాలు పరిష్కరించేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. అనంతరం పోలీస్, డీఆర్డీఏ, రెవెన్యూ శాఖల అధికారులు తమ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పురోగతి, బాధితులకు అందించిన పరిహారం వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల ఘటనలను వివరించారు. సమావేశంలో పుట్టపర్తి, పెనుకొండ ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్, పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగప్రసాద్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి పద్మమ్మ, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వీరనారాయణ, శ్రీనివాస్ నాయక్, ఉమాశంకర్, కృష్టమూర్తి, రామాంజినప్ప తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో స్కావెంజర్ పనితీరుపై త్రైమాసిక జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులకు గ్లౌజులు, మాస్కులు వంటి అత్యవసర సామగ్రి తప్పక అందించాలన్నారు. పారిశుధ్య కార్మికులకు క్రమం తప్పకుండా అరోగ్య పరీక్షలు చేయించేందుకు జిల్లా పంచాయతీ, మున్సిపల్ కమిషనర్లు కృషి చేయాలన్నారు. పారిశుధ్య కార్మికుల నూతన జాబితాను రూపొందించి అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎల్డీఎం రమణకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాధిక, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్రావు, మున్సిపల్ కమిషనర్లు ప్రహ్లాద్, శ్రీనివాసులు, రంగస్వామి, కిరణ్కుమార్, ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు జాయింట్ కలెక్టర్
అభిషేక్ కుమార్ ఆదేశం


