పేదోడి రైలు.. రైల్వేకు అలుసు
గుంతకల్లు: డివిజన్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న డెమో ప్యాసింజర్ రైళ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గుంతకల్లు–హిందూపురం (77213/14), గుంతకల్లు–రాయచూర్ (77201/02), గుంతకల్లు–డోన్ (77203/04), డోన్–గుత్తి (77205/06), నంద్యాల–రేణిగుంట (77212/11), కర్నూలు సిటీ–నంద్యాల (77209/10) మధ్య నడుస్తున్న డెమో ప్యాసింజర్ రైళ్లలో రాయలసీమ జిల్లా వాసులు తక్కువ ధరతో ప్రయాణం చేయాడానికి ఎంతో అనువుగా ఉన్నాయి. దీంతో మధ్య తరగతి, గ్రామీణ ప్రాంతా ప్రయాణికులు ఈ రైళ్ల వైపు మెగ్గు చూపారు. మౌలిక వసతులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
వసతులు కరువు..
హైదరాబాదు, బెంగుళూరు తదితర నగరాల్లో నడుతుపున్న ఎంఎంటీఎస్ రైళ్ల (డెమో)ను రైల్వేశాఖ సాధారణ ప్రయాణికుల కోసం గుంతకల్లు డివిజన్లోపి పలు ప్రాంతాల నుంచి నడుపుతోంది. ట్రాఫిక్ సమస్య తలెత్తకపోవడంతో పాటు సమయానికి నిర్దేశించిన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీంతో సిటీ ప్రజలు ఎక్కువగా ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ వెళ్లడానికి 5 నిమిషాల సమయం కూడ పట్టదు. 700ల మంది కూర్చొని, మరో వెయ్యి మందికి పైగా నిల్చోని ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది. దీంతో ఈ రైళ్లలోని బోగీల్లో టాయిలెట్లు, నీటి వసతి అనేవి ఉండవు. గుంతకల్లు–హిందూపురం మధ్య నడస్తున్న డెమో ప్యాసింజర్ రైలు దాదాపు 200 కి.మీ.లు ప్రయాణించాల్సి ఉంది. గుంతకల్లు నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన రైలు హిందూపురానికి రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులు టాయిలెట్కు వెళ్లాలంటే వీలుపడదు. బోగీల్లో టాయిలెట్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో గంటల తరబడి వృద్దులు, మహిళలు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో నిలబడిన వెంటనే రైలు దిగి టాయిలెట్ల వైపు పరుగు తీస్తున్నారు. ఈ లోపు రైలు వెళ్లిపోవడంతో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైలు మిస్ అయిన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్లతో గొడవకు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ప్యాసింజర్లు అంటే చులకన...
పేదోడి రైళ్లు (ప్యాసింజర్) అంటే రైల్వేశాఖకు చులకనై పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడ్స్ రైళ్లపై ఉన్న శ్రధ్ద ప్యాసింజర్ రైళ్లపై లేదని విమర్శిస్తున్నారు. గుంతకల్లు–గుత్తి. గుత్తి–ధర్మవరం మధ్య డబుల్లైన్ పూర్తయింది. ఈ మార్గంలో ఒకేసారి రెండు రైళ్ల పరుగులు పెడుతాయి. అయితే గూడ్స్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్న సమయంలో డెమో రైళ్లను ఎక్కడ పడితే అక్కడ నిలిపి వేస్తున్నారు. దీంతో ఈ రైళ్లు సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవి ఎండలకు రైళ్లలో ఉక్కపోతకు చిన్నారులు, వృద్దులు తాళలేకపోతున్నారు.
పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అనుగుణంగా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్
(ఎంఎంటీఎస్ – డెమో ప్యాసింజర్) రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. వీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే డెమో రైళ్లలో ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
డెమో ప్యాసింజర్ రైళ్లతో
ప్రయాణికుల బేజారు
మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేక
ఇబ్బందులు
జనరల్ బోగీలతో నడపాలని
ప్రయాణికుల డిమాండ్
సాధారణ బోగీలతో నడపాలి
డివిజన్ వ్యాప్తంగా నడుపుతున్న డెమో రైళ్ల స్థానంలో సాధారణ బోగీలతో ఉన్న ప్యాసింజర్ రైళ్లను నడపాలి. ఈ సాధారణ బోగీల్లో టాయిలెట్లు, నీటి సౌకర్యం ఉంటుంది. డెమో రైళ్లతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను రైల్వేశాఖ గుర్తించాలి. డెమో రైళ్లను సిటీలకే పరిమితం చేయాలి.
– అనంత శేషారెడ్డి, గుంతకల్లు
పేదోడి రైలు.. రైల్వేకు అలుసు


