మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు

Apr 3 2025 2:44 PM | Updated on Apr 3 2025 2:44 PM

మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు

మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు

శ్రీకాకుళం క్రైమ్‌ :

త విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని టౌన్‌ హాల్‌ రోడ్డులోని ఆర్‌సీఎం సెయింట్‌ థామస్‌, చినబజారు రోడ్డులో ఉన్న చర్చి రక్షణ గోడలపై అన్యమత రాతలు రాసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని గూనపాలెం మేదరవీధికి చెందిన నర్రు దుర్గాప్రసాద్‌ (25) అలియాస్‌ ప్రసాద్‌ ఓ ఫుడ్‌ డెలివరీ సంస్థలో బాయ్‌గా, అదే వీధికి చెందిన గ్రంధి సోమశేఖర్‌ (23) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 9:30 ప్రాంతంలో ఇద్దరూ స్కూటీపై వచ్చి సెయింట్‌ ఽథామస్‌ చర్చి రక్షణ గోడపై అన్యమత రాతలు రాశారు. అనంతరం తెలుగు బాప్టిస్ట్‌ చర్చి వద్దకు చేరుకున్నారు. సోమశేఖర్‌ ఎలక్ట్రీషియన్‌ కావడంతో అక్కడ విద్యుత్‌ను నిలుపుదల చేసి ఇద్దరూ రక్షణ గోడ, లోపల అన్యమత రాతలు రాసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి డీఎస్పీ వివేకానందకు ఆదేశాలు జారీ చేయడంతో ఒకటి, రెండో పట్టణ సీఐలను ఘటనాస్థలికి పంపించారు. అక్కడి స్థానికులను విచారించి సీసీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం నిందితులిద్దరినీ గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అరసవల్లి మామిడి తోట వద్ద సీఐ పైడపునాయుడు బృందం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఫేమస్‌ అవుదామనే..

జిల్లాలో ఇటీవల జలుమూరులో జరిగిన అన్యమత రాతల ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారిగా ఫేమస్‌ అవుదామనే ఇద్దరు యువకులు ఇలా రాతలకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలిందన్నారు. కేసును డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో చాకచక్యంగా ఛేదించిన సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐలు హరికృష్ణ, జనార్ధన, ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు

ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా మందిరాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలను ఎస్పీ వివరించారు. కుల, మత, రాజకీయ వర్గాల మధ్య మతపరమైన అవాస్తవాలు ప్రచారం చేస్తూ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. సోషల్‌ మీడియాలో పోస్టులను పెట్టినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మందిరాల నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, స్థానికులతో యూత్‌ కమిటీ, శాంతి కమిటీలను ఏర్పాటుచేయాలని సూచించారు. రాత్రి పూట ఇద్దరేసి కమిటీ సభ్యులు ఉండాలన్నారు. హుండీలకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement