
చెట్టు నుంచి జారిపడి విశ్రాంత జవాన్ మృతి
నరసన్నపేట: మండలంలోని లుకలాంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి బొత్స శ్రీరాములు (50) ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 9 గంటలకు చింత చెట్టు బొట్టలు దులిపేందుకు శ్రీరాములు వెళ్లారు. సూరోడమ్మ ఇంటి పనులు ముగించుకొని చెట్టు వద్దకు వెళ్లేసరికి శ్రీరాములు చెట్టు కింద పడి కనిపించారు. కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి స్థానికుల సహకారంతో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. చెట్టు పైనుంచి పడిపోయే సమయంలో ఎవరూ లేకపోవడంతో మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. శ్రీరాములుకు ఇద్దరు కుమార్తెలు. నరసన్నపేట పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. భార్య సూరోడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టు నుంచి జారిపడి విశ్రాంత జవాన్ మృతి