భయాన్ని తొలగిస్తూ.. ఉత్సాహం నింపుతూ.. | - | Sakshi

భయాన్ని తొలగిస్తూ.. ఉత్సాహం నింపుతూ..

Mar 18 2025 9:10 AM | Updated on Mar 18 2025 9:05 AM

తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువు పూర్తి చేసుకుని ఉన్నత పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లో భయం తొలగించి పైతరగతులు చదవాలనే ఆసక్తి పెంచుతూ వారిలో నూతనోత్సాహాన్ని నింపేలా రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్త బడి వాతావరణానికి అలవాటు పడడానికి ‘ట్వీనింగ్‌ ఆఫ్‌ స్కూల్స్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకు దగ్గరలోని ఉన్నత, ఆదర్శ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలను సందర్శించి పరిశీలించేలా కార్యాచరణ రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా 74 పాఠశాలల్లో అమలు చేస్తోంది.

పరిశీలన, అవగాహన..

ఉన్నత పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అక్కడి తరగతి గదులు, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌లు, డిజిటల్‌ విద్యాబోధన, లైబ్రరీ, విద్యా శాఖ కార్యక్రమాల అమలు, క్రీడలు, క్రమశిక్షణ తదితరాలపై అవగాహన కల్పించనున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాలను పరిశీలించనున్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు చేరే పాఠశాలలను సందర్శించడంతో అక్కడి స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు.

బోధన విని.. భోజనం చేసి..

ప్రారంభం నుంచి ఒకే బడిలో చదివి మరో పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థుల్లో ఒక రకమైన భయం ఉంటుంది. వారిలో భయం పోగొట్టి ఉన్నత పాఠశాలల్లో వసతులు, బోధనపై ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలకు తీసుకెళ్లి ఒకరోజు మొత్తం అక్కడే ఉంచుతున్నారు. ఉపాధ్యాయులు బోధిస్తుండగా విద్యార్థులు ప్రత్యక్షంగా వింటున్నారు. అక్కడే మధ్యాహ్న భోజన వసతిని కల్పిస్తున్నారు. గతేడాది నుంచి అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కొనసాగిస్తున్నారు.

అవగాహన పెరుగుతుంది

పాఠశాలలను క్షేత్ర స్థాయిలో సందర్శించడం వల్ల ఆయా పాఠశాలల్లో విద్యాబోధన, మౌలిక వసతులు, వాతావరణ పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుంది. ఉపాధ్యాయులపై నమ్మకం కలగడంతో అడ్మిషన్లు పెరగనున్నాయి. తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి.

– మురళి, హెచ్‌ఎం, తొండ ప్రాథమిక పాఠశాల

హైస్కూళ్ల సందర్శనకు పీఎస్‌, యూపీఎస్‌ విద్యార్థులకు అవకాశం

చదువబోయే బడుల స్థితిగతులపై అవగాహన కల్పించేందుకు..

‘ట్వీనింగ్‌ ఆఫ్‌ స్కూల్స్‌’ పేరుతో

విద్యాశాఖ కొత్త కార్యక్రమం

74 పాఠశాలల గుర్తింపు

ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లా వ్యాప్తంగా 74 పాఠశాలలను గుర్తించారు. ఇందులో ప్రాథమిక స్థాయి తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత పాఠశాలలకు వెళ్లి పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రూ.50 చొప్పున రవాణా చార్జీలు విడుదల చేసింది. దీంతోపాటు విద్యార్థులు సందర్శించనున్న పాఠశాలల్లో చిత్రాలు, బ్యానర్‌ డాక్యుమెంటేషన్‌ కోసం రూ.500 చొప్పున సమగ్ర శిక్ష అభియాన్‌ నుంచి నిధులు సమకూరాయి.

భయాన్ని తొలగిస్తూ.. ఉత్సాహం నింపుతూ..1
1/1

భయాన్ని తొలగిస్తూ.. ఉత్సాహం నింపుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement