భానుపురి (సూర్యాపేట): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రజలు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం నుంచి వారి సమస్యలు చెప్పడానికి ప్రజావాణికి వస్తున్నారని తెలిపారు. ప్రతి అర్జీని పరిశీలించి కచ్చితమైన సమాధానం తెలుపుతూ పరిష్కరించాలని సూచించారు. హైదరాబాద్లోని మహాత్మాజ్యోతి రావుపూలే భవనంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణిలో జిల్లాకు చెందిన 36 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, అలాగే జిల్లాస్థాయిలో ఉన్న 630 అర్జీలను సత్వరమే పరిష్కంచాలన్నారు.
అదనపు కలెక్టర్ రాంబాబు
సకాలంలో హాజరు నమోదు చేసుకోవాలి
కలెక్టరేట్ సిబ్బంది పేస్ రికగ్నైజేషన్ (బయోమెట్రిక్) ద్వారా తప్పనిసరిగా ప్రతిరోజూ ఉదయం పదిన్నర లోపు, సాయంత్రం 5గంటల తర్వాత ప్రతిఒక్కరూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్నందున అధికారులు తమ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు మున్సిపల్, గ్రామ పంచాయతీలకు ప్రాపర్టీ టాక్స్ చెల్లించాలన్నారు. మార్చి 21 నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు ఉన్నందున స్క్వాడ్స్ను నియమించామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ.అప్పారావు, డీఎంహెచ్ఓ కోటాచలం, డీఈఓ అశోక్, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీటీడీఓ శంకర్, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.