
తుంగతుర్తి సీఐపై వేటు
నూతనకల్: నూతనకల్ మండలం మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసుతో పాటు గ్రామంలో జరిగిన వివిధ సంఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన తుంగతుర్తి సీఐ శ్రీనివాస్ నాయక్పై మంగళవారం బదిలీ వేటు పడింది. రాష్ట్ర మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. హత్యకేసు విషయాన్ని పసిగట్టలేకపోవడంతో స్థానిక డీఎస్పీ రవి, ఎస్ఐ మహేంద్రనాథ్లకు మెమోలు జారీ చేశారు.
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
అర్వపల్లి: నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ రాంబాబు పేర్కొన్నారు. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన వాటర్షెడ్ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల ఎదుట మొక్కలు నాటారు. రుణాలపై మహిళలు పొందిన కుట్టుమిషన్లు పరిశీలించారు. వాటర్షెడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అధికారులు, రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ అప్పారావు, వాటర్షెడ్ ప్రాజెక్టు అధికారి వినయ్భార్గవ్, ఎంపీడీఓ టి.గోపి, ఎంఈఓ బి.బాలునాయక్, ఏపీఓ ఉపేందర్, ఏపీఎం మల్లేష్, వాటర్షెడ్ మండల ఇన్చార్జి డి.రవీందర్, ఈసీ నగేష్, గిర్దావర్ వెంకట్రెడ్డి, సీసీ నగేష్, హెచ్ఎంలు కుంభం ప్రభాకర్, జి.చంద్రారెడ్డి, వాటర్షెడ్ కమిటీ సభ్యులు కందుల తిరుమలరావు, పెద్దరాములు, జీడి పద్మ, నాగమ్మ పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్ ముట్టడి
సూర్యాపేటఅర్బన్ : ప్రజా, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ను ముట్టడించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వ పరిధిలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
విధుల నిర్వహణలో అలసత్వం వహించొద్దు
నాగారం : పంచాయతీ కార్యదర్శులు విధుల నిర్వహణలో అలసత్వం వహించవద్దని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి ఆదేశించారు. నాగారం మండలంలోని నాగారంబంగ్లా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో ఈనెలాఖరులోగా వందశాతం ఇంటి పన్ను వసూలు చేయాలని సూచించారు. వేసవిలో వన నర్సరీలను సంరక్షించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచుతూ, పనిలో నాణ్యతను పాటించాలన్నారు. జాబ్కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి పనులు కల్పించాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని వన నర్సరీ, ఉపాధి పనులు, శ్మశాన వాటికను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ కె.మారయ్య, పంచాయతీ కార్యదర్శి అరుణ్ ఉన్నారు.
గోదావరి జలాలు నిలిపివేత
అర్వపల్లి: యాసంగి సీజన్కుగాను జిల్లాకు వారబందీ విధానంలో విడుదల చేస్తున్న గోదావరి జలాలను మంగళవారం మధ్యాహ్నం నిలిపివేశారు. ఈ సీజన్కుగాను జనవరి 1 నుంచి జిల్లాకు నీటిని పునరుద్ధరించారు. వారబందీ విధానంలో ఇప్పటి వరకు నీటిని వదిలారు. మొత్తం ఈసీజన్లో ఆరు విడతల్లో నీటిని వదిలారు. చివరి విడతగా ఈనెల 17 నుంచి నీటిని ఇచ్చారు. కాగా వరి పొలాలు మరో 15 రోజుల్లో చేతికందనున్నాయని అప్పటి వరకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

తుంగతుర్తి సీఐపై వేటు