పొలాల వద్దకు ‘ఉపాధి’ బాటలు | - | Sakshi
Sakshi News home page

పొలాల వద్దకు ‘ఉపాధి’ బాటలు

Apr 3 2025 1:49 AM | Updated on Apr 3 2025 1:49 AM

పొలాల

పొలాల వద్దకు ‘ఉపాధి’ బాటలు

నాగారం: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తమ పంట పొలాలకు వద్దకు వెళ్లేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మట్టి రోడ్లు నిర్మిస్తున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో 1,786 రోడ్లు మంజూరుకాగా, ప్రస్తుతం 627 రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. ఆయా పనులకు రూ.119 కోట్లు మంజూరు కాగా ఇందులో రూ.48.60 కోట్ల పనులు పూర్తి చేశారు. మిగతా పనులు మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంది. కానీ పనుల్లో జాప్యం వల్ల పూర్తికాని పనులను రీ షెడ్యూల్‌ చేసి ఏప్రిల్‌ నెలాఖరులోగా పూర్తి చేసేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు.

తీరనున్న అవస్థలు

వర్షాకాలంలో రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి మండలంలో కనీసం 2 కి.మీ. నుంచి 5 కి.మీ. దూరం మట్టి రోడ్డు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనుల్లో కూలీలకు 60 శాతం, 40 శాతం మెటీరియల్‌కు ఖర్చు చేస్తున్నారు. కిలోమీటర్‌ దూరం రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.2 లక్షలు కూలీలకు, రూ.1.10 లక్షలు మెటీరియల్‌ కింద వ్యయం చేసే అవకాశముంది. కూలీలు కందకాలు తవ్వి రోడ్డుపై మట్టి పోస్తుండగా, గుంతలు నింపేందుకు ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి మొరాన్ని తరలించి చదును చేయనున్నారు.

ఊపందుకున్న ఉపాధి పనులు..

జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకుంటున్నాయి. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే ఉపాధిహామీ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 2.62లక్షల జాబ్‌కార్డులు ఉండగా, వీటి పరిధిలో 5.70 లక్షల మంది కూలీలుగా నమోదై ఉన్నారు. కాగా వీరిలో ప్రస్తుతం పనులకు వెళ్తున్న కూలీలు 37,775గా ఉన్నారు. వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రస్తుతం ఇంకుడు గుంతలు, పశువుల షెడ్ల నిర్మాణం, కోళ్ల షెడ్లు, నీటి తొట్లు, నీటి నిల్వ వసతులు, నర్సరీల ఏర్పాటు, చెక్‌ డ్యామ్‌లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పంట పొలాలకు రోడ్ల అనుసంధానం, నీటికుంటల నిర్మాణం, వనమహోత్సవంలో పండ్ల తోటల పెంపకం, నర్సరీల్లో మొక్కల సంరక్షణ పనులు చేపడుతున్నారు.

2 నుంచి 5 కిలోమీటర్ల వరకు

మట్టి రోడ్లు నిర్మించేలా చర్యలు

పురోగతిలో 627 రోడ్ల పనులు

మిగిలిన పనులు ఏప్రిల్‌లోగా

పూర్తిచేసేందుకు ప్రణాళిక

రైతులకు ప్రయోజనకరం

ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల వద్దకు వెళ్లేందుకు నిర్మిస్తున్న మట్టి రోడ్లతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. కూలీలకు కూడా ఉపాధి లభిస్తుంది. పనుల కోసం కేటాయించిన నిధుల్లో 60 శాతం కూలీలకు, 40 శాతం మెటీరియల్‌ కింద ఖర్చు చేయనున్నాం.

– వీవీ.అప్పారావు, డీఆర్‌డీఓ, సూర్యాపేట

పొలాల వద్దకు ‘ఉపాధి’ బాటలు1
1/1

పొలాల వద్దకు ‘ఉపాధి’ బాటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement