
జో చిత్ర దర్శకుడితో హిప్ హాప్ ఆది
తమిళసినిమా: సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హిప్ హాప్ ఆది ఆ తరువాత కథానాయకుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఈ రెండు రంగాల్లోనూ రాణిస్తున్నారు. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం కడైసీ ఉలగ పోర్. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే ఆ తరువాత పలువురు దర్శకులు కథలు చెప్పినా నచ్చక పోవడంతో ఏ దర్శకుడికి పచ్చజెండా ఊపలేదు. అలాంటిది తాజాగా దర్శకుడు హరిహరన్ రామ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈయన ఇంతకు ముందు జో వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. హరిహరన్ రామ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే నటించడానికి సమ్మతించారట. కాగా ప్రమోద్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. చిత్ర షూటింగ్ ను జూన్ నెలలో ప్రారంభించనున్నట్లు ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. కాగా ఇందులో హిప్ హాప్ ఆదికి జంటగా ఒక ప్రముఖ కథానాయికితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం మూక్కుత్తి అమ్మన్– 2 చిత్రానికి సంగీతాన్ని అందించే పనిలో బిజీగా ఉన్న హిప్ హాప్ ఆది ఈ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది.ఈ చిత్రం అయినా మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
తమిళసినిమా: పుష్ప – 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్. ఇండియన్ సినిమా చరిత్రలోనే కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టిన చిత్రం పుష్ప 2. దీంతో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం మామూలుగా ఉండకూడదు. అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యే ఉండాలి. దీంతో నటుడు అల్లు అర్జున్ అలాంటి చిత్రం వైపే నడుస్తున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ యువ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. రాజారాణి చిత్రంతో దర్శకుడిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీ. తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత నటుడు విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరి చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి నటుడు షారుఖ్ ఖాన్ కథానాయకుడుగా జవాన్ చిత్రాన్ని చేశారు. నయనతార దీపిక పడుకొనే హీరోయిన్గా నటించిన అందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్గా పరిచయం చేయడం విశేషం. అంతే కాకుండా జవాన్ చిత్రాన్ని స్వయంగా నటుడు షారుక్ ఖాన్ నిర్మించడం మరో విశేషం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగించింది. అలా అట్లీ దర్శకత్వం వహించిన చిత్రాలు ఒకదాని మించి ఒకటి విజయం సాధించాయి. అలాంటి దర్శకుడు తాజాగా అల్లు అర్జున్ కథానాయకుడుగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడకపోయినా వీరి సంచలన కాంబో షురూ అయిందంటున్నారు. సినీ వర్గాలు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందిన చిత్రంలో కథానాయకిగా మరో పాన్ వరల్డ్ నటి ప్రియాంక చోప్రాను నాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం నటించడానికి ఆమె రూ.30 నుంచి 40 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు గాని ఆమె గనుక నటిస్తే ఈ చిత్రం వేరే లెవల్ కు వెళుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటుడు అల్లుఅర్జున్, దర్శకుడు అట్లీ

జో చిత్ర దర్శకుడితో హిప్ హాప్ ఆది