
రాజ్యసభ అభ్యర్థులకు మద్దతు
● 20 మంది చొప్పున ఎమ్మెల్యే సంతకాలు ●మదురై నుంచి పళణి టూర్
సాక్షి, చైన్నె : తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న రాజ్యసభ అభ్యర్థులకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. వీరి నామినేషన్లను ప్రతిపాదిస్తూ 20 మంది చొప్పున ఎమ్మెల్యేలు బుధవారం సంతకాలు చేశారు. రాజ్యసభ నామినేషన్ల పర్వం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నికల వీరుడు పద్మరాజన్, సామాజిక కార్యకర్త అగ్ని ఆళ్వార్లు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వీరికి ఎమ్మెల్యేల మద్దతు లేని దృష్ట్యా, తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇక డీఎంకే తరఫున విల్సన్, సల్మా, ఎస్ఆర్ శివలింగం అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ఈ కూటమి తరపున నటుడు కమల్కు అవకాశం కల్పించారు. వీరంతా నామినేషన్లు దాఖలు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. గురువారం వీరు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్న సమాచారం వెలువడింది. అదే సమయంలో అన్నాడీఎంకే తరఫున న్యాయవాది, మాజీ ఎమ్మెల్యే ఇన్బదురై, మాజీ ఎమ్మెల్యేఽ ఎం ధనపాల్ ఎంపిక అయ్యారు. వీరికి ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తూ నామినేషన్ పత్రంలో ప్రతిపాదన సంతకాలు బుధవారం చేశారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఉదయం ఎమ్మెల్యేలతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సమావేశమయ్యారు. అభ్యర్థులకు మద్దతుగా 20 మంది చొప్పున ఎమ్మెల్యే సంకతాలు చేశారు. ఇన్బదురై, ధనపాల్ అభ్యర్థిత్వానికి తమ మద్దతుతో ప్రతిపాదించారు. ఈ ఇద్దరు కూడా గురువారం నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఎమ్మెల్యేల సమావేశంలో పళణి స్వామి రాష్ట్ర పర్యటన గురించి చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జూలై మొదటి వారం నుంచి పళణి స్వామి నియోజకవర్గాల వారీగా పర్యటించనున్నట్టు, ఇందుకు సంబంధించిన రూట్మ్యాప్ సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యేలతో పళనిస్వామి చర్చించి పలు సూచనలు చేసినట్టు చెబుతున్నారు. తొలుత కోయంబత్తూరు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినా, తాజాగా మదురై నుంచి తన పర్యటనకు పళణి రూట్మ్యాప్ను సిద్ధం చేసుకున్నట్టు ఓ నేత పేర్కొన్నారు. ఎమ్మెల్యేలందరూ స్థానిక సమస్యలపై పట్టు సాధించాలని, ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని పళణి స్వామి ఆదేశించినట్టు తెలిసింది.