
8న మదురైకు అమిత్షా
● ఏర్పాట్లలో బీజేపీ వర్గాలు ● సంప్రదింపులకు నేతల ముందస్తు ప్రయత్నాలు
సాక్షి, చైన్నె: కేంద్ర హోంమంత్రి అమిత్షా ఈనెల 8న మదురై రానున్నారు. ఒత్తకడైలో జరిగే బీజేపీ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో అమిత్షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో కోయంబత్తూరులోనూ, మార్చిలో అరక్కోణంలోనూ జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఏప్రిల్లో ఆయన చైన్నెలో రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టి అన్నాడీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ఏర్పాటు ప్రకటన చేసి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో నెల రోజుల విరామం తర్వాత ఈనెల 8న అమిత్షా మళ్లీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మదురై ఒత్తకడైలో బీజేపీ నేతృత్వంలో కార్యక్రమం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు అమిత్షా రానున్నారు. మదురైలో ఈనెల 22వ తేదీ మురుగన్ భక్తుల మహానాడుకు బీజేపీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరగనున్న కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్షాతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి భేటీకి అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అదేసమయంలో తాము ఎన్డీఏ కూటమిలో ఉన్నామని అన్నాడీఎంకే బహిష్కృత నేతలు మాజీ సీఎం పన్నీరుసెల్వం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నేతలతో పాటు కూటమిపై దృష్టి పెట్టే దిశగా ఉన్న మరికొన్ని పార్టీల నేతలు అమిత్షాను కలిసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. అదేసమయంలో అమిత్షా రానున్న నేపథ్యంలో తమ కూటమిలోకి చేరేందుకు పార్టీలు ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ పిలుపునివ్వడం గమనార్హం. ప్రధానంగా డీఎండీకే, పీఎంకేలతోపాటు మరికొన్ని పార్టీలను ఆయన ఆహ్వానించారు.
రెండు ఇగువానాలు స్వాధీనం
అన్నానగర్: కౌలాలంపూర్ నుంచి అరుదైన ఇగువానాలను(పెద్దబల్లులు) అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్న్స్ యూనిట్ అధికారులకు సమాచారం అందింది. మంగళవారం రాత్రి కౌలాలంపూర్ నుంచి ‘బాటిక్ ఎయిర్‘ విమానం తిరుచ్చికి వచ్చి చేరింది. కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను, వస్తువులను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఒక ప్రయాణికుడి సూట్కేస్లో నల్లటి సంచుల్లో రెండు ఇగువానాలు ఉన్నట్టు గుర్తించారు. వాటి నోళ్లు, కాళ్లు టేప్తో చుట్టిఉన్నాయి. కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని, ప్రయాణికుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్లను అప్రమత్తం చేసే ఏఐ
సాక్షి, చైన్నె : రాత్రి వేళలో బస్సులు నడిపే సమయంలో నిద్ర మత్తులోకి జారుకునే డ్రైవర్లను అప్రమత్తం చేసే దిశగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అత్యాధునిక విధానాన్ని అనుసరించేందుకు రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.2 కోట్లతో 500 బస్సులో కెమెరాలు, స్కానర్, అలర్ట్ అలారంతో కూడిన ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు చైన్నె నుంచి సుదూర ప్రాంతాలకు రాత్రివేళలో అఽత్యధికంగా వెళుతుంటాయి. డ్రైవర్ల నిద్ర మత్తులోకి జారుకున్న పక్షంలో ప్రమాదాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రవాణా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రైవర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టేందుకు రెడీ అయ్యింది. తొలిదశలో 500 సుదూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ ఆధునిక పరికరాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు బస్సులో నాలుగు కెమెరాలను ఆమర్చనున్నారు. రెండు కెమెరాలు ప్రయాణికుల కోసం, మరో కెమెరా డ్రైవర్ కోసం, ఇంకో కెమెరా రోడ్డును సూచించేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలకు ఏఐ టెక్నాలజీ ఆధారంగా ప్రత్యేక స్కానర్ను పొందు పరచనున్నారు. డ్రైవర్ సీటుకు సమీపంలో ఉండే ఈ స్కానర్ డ్రైవర్ అతడి ముఖ కవళికలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంటుంది. నిద్రమత్తులోకి జారిన, ఆవులించినా లేదా, అలసటతో ఉన్నట్టు తేలినా తక్షణం అప్రమత్తం చేసేలా అలారంతో కూడిన హెచ్చరికలను ఏఐ టెక్నాలజీ చేస్తుంది. అదే సమయంలో ఎవరైనా మద్యం సేవించి డ్రైవర్ బస్సు నడిపినా, ఈ టెక్నాలజీ ఇట్టే పసిగట్టేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులలో ఈ విధానం అమలులోకి రాబోతున్నట్టు రవాణా సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.