సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ | DSC recruitment process from September | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ

Published Thu, Aug 15 2024 4:51 AM | Last Updated on Thu, Aug 15 2024 4:51 AM

DSC recruitment process from September

అక్టోబర్‌ చివరి నాటికి ముగింపు

ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు జిల్లా కమిటీకి 

రాష్ట్ర స్థాయిలోనే జాబితా రూపకల్పన

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్‌ ఆఖరి వారం నుంచి మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసింది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరుకు తుది కీ విడుదల చేసే వీలుంది. 

మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు, డీఎస్సీ పరీక్ష రాసిన వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు. రోస్టర్‌ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి పెట్టారు. పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించడం వల్ల ఫలితాలను తేలికగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు. 

ఫైనల్‌ కీ విడుదల చేసిన రోజు.. లేదా మర్నాడు ఫలితాలను వెల్లడించే వీలుంది. ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితాను రూపొందించే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 3,29,897 మంది దరఖాస్తు చేస్తే, 2,79,957 మంది పరీక్ష రాశారు. 

కేంద్రీకృత ప్రక్రియ
రోస్టర్‌ విధానం, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా, ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్‌ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ టీచర్‌ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్‌ పద్ధతిన ఎంపిక చేసి, ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలు పంపాలని భావిస్తున్నారు. 

ఈ ప్రక్రియను సెప్టెంబర్‌ మూడోవారంలో ముగించి, జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగోవారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఒక వేళ ఇది ఆలస్యమైతే అక్టోబర్‌ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని ఓ అధికారి తెలిపారు. ఏదేమైనప్పటికీ అక్టోబర్‌ చివరి నాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

ఉప వర్గీకరణ అంశంపై సందేహాలు..
కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూ ల్డ్‌ కులాల ఉప వర్గీకరణను అమలు చేస్తామని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల శాసనసభలో తెలిపా రు. అవసరమైతే ఆర్డినెన్స్‌ కూడా తెస్తామన్నారు. అ యితే, డీఎస్సీ నోటిఫికేషన్‌ను వర్గీకర ణపై తీర్పు రాక ముందే ఇచ్చారు. 

కాబట్టి ఈ నియామకాలకు వర్గీకర ణ అంశం చేరిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయ ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అ యితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ వర్గీకరణ అంశం ముందుకొస్తే అనుకున్న తేదీల్లో ఉపాధ్యాయ నియామకాలు కష్టమేనని అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement