కరువుదీరా వానలు.. | Telangana Has Received Heavy Rainfall During This Season. | Sakshi
Sakshi News home page

కరువుదీరా వానలు..

Published Mon, Aug 31 2020 2:02 AM | Last Updated on Mon, Aug 31 2020 9:48 AM

Telangana Has Received Heavy Rainfall During This Season. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఈ సీజన్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు 44 శాతం ఎక్కువ వర్షాలు కురిసినట్టు గణాంకాలు చెబుతు న్నాయి.  ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 575.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 44 శాతం అధికంగా 826.9 మిల్లీమీటర్లు కురిసింది. గతేడాది ఇప్పటి వరకు నమోదైన వర్షపాతంతో పోలిస్తే ఇది 57 శాతం ఎక్కువ. జిల్లాల వారీగా పరిశీలిస్తే 25 చోట్ల అధికంగా వర్షాలు కురవగా, 8 చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 17.11 శాతం చొప్పున తక్కువ వర్షం కురిసింది. అయితే సాధారణం కంటే 19 శాతం వరకు తక్కువ నమోదైనా వాతా వరణ శాఖ లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతంగానే గుర్తిస్తారు. దీంతో ఈ ఏడాది వానా కాలంలో ఏ జిల్లా లోనూ లోటు వర్షపాతం నమోదు కాలేదు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని నాలుగు ప్రస్తుత జిల్లాల్లో సాధారణం కంటే దాదాపు 100 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి.

మరో రెండ్రోజులు తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలి పింది. పశ్చిమ మధ్యప్రదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు రాజస్తాన్‌ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో వర్షాలు పడతాయని వివరించింది. 

సాధారణంతో పోలిస్తే తక్కువ వర్షాలు (మి.మీ.) కురిసిన 5 జిల్లాలు:
జిల్లా        సాధారణం    కురిసింది    తేడా (%)
నిర్మల్‌        771.5        640.7        –17
ఆదిలాబాద్‌    837.8        747        –11
నిజామాబాద్‌    699.4     701.8        0
జగిత్యాల        705       707             0
కొమురంభీం    846.3      866.3        2  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement