
వేములవాడ/కథలాపూర్: అత్త మరణవార్త విని అల్లుడు మృతి చెందాడు. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ సంఘటన వివరాలివి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మార్కండేయనగర్కు చెందిన అలువాల లక్ష్మి (82) శుక్రవారం అనారోగ్యంతో మరణించింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురిని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్కు చెందిన గుంటుక పర్శరాం (58)కు ఇచ్చి పెళ్లి చేశారు. కరోనా సమయంలో పెద్దకూతురు మరణించింది.
శుక్రవారం ఉదయం అత్త అలువాల లక్ష్మి మరణించిందని.. అల్లుడు పర్శరాంకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. అయితే దైవదర్శనానికి విజయవాడకు వెళ్లిన పర్శరాం అక్కడే గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. ఒకేరోజు అత్త వేములవాడలో, అల్లుడు విజయవాడలో మరణించడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. పర్శరాం ముంబైలో స్థిరపడ్డాడు. పర్శరాంకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. మృతదేహాన్ని గంభీర్పూర్కు తీసుకొస్తున్నారు.