
స్టీల్ప్లాంట్లో భారీగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింప
● ఇప్పటి వరకు 1,503 మంది నిలుపుదల ● కార్మిక సంఘాల ఆగ్రహం.. నిరవధిక సమ్మె హెచ్చరిక
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు విషయంలో యాజమాన్యం వెనక్కి తగ్గడం లేదు. స్టీల్ప్లాంట్లో అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని చెబుతున్న యాజమాన్యం.. రోజురోజుకూ వారిని తొలగిస్తోంది. సోమవారం రాత్రి విడుదల చేసిన జాబితా ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 1,503 మందిని నిలుపుదల చేశారు. ఈ అంశంపై కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్లోని కొన్ని విభాగాల్లో టెండర్ పూర్తయిన కాంట్రాక్ట్ సంస్థకు మళ్లీ పునరుద్ధరణ జరగకపోవడంతో ఇప్పటికే సుమారు 440 మంది కార్మికులు బయట ఉండిపోయారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై రీజినల్ లేబర్ కమిషనర్ వద్ద చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల డిప్యూటీ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల్లో కార్మికుల తొలగింపునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, తొలగించిన కార్మికుల కోసం ఒక పూల్ ఏర్పాటు చేయాలని, తిరిగి పని దొరికితే వారికే ఉపాధి కల్పించాలని యాజమాన్యానికి సూచించారు. అయితే ఉక్కు మంత్రిత్వశాఖ నుంచి యాజమాన్యంపై రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడి కారణంగా.. ప్రతి రోజూ వందల మంది కార్మికులు బయోమెట్రిక్ హాజరుకు దూరమవుతున్నారు. మొదట్లో మెడికల్ ఫిట్నెస్ లేనివారు, సక్రమంగా విధులకు హాజరు కాని వారు, 55 ఏళ్లు పైబడిన వారిని తొలగించాలని యాజమాన్యం కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చింది. వారు తొలగించడానికి నిరాకరించడంతో యాజమాన్యమే ఆ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఎక్కువ మంది 54 ఏళ్లు పైబడిన వారు, విధులకు సక్రమంగా హాజరుకాని వారు, అన్ఫిట్ కార్మికులే ఉన్నారని సమాచారం. మళ్లీ ఇలాంటి జాబితాలు ఎన్ని ఉంటాయో అని అటు కార్మికులు, ఇటు కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఒక వైపు ఆర్ఎల్సీతో 7న సమావేశం ఉండగా, యాజమాన్యం ఇలా తొలగింపు చర్యలు చేపట్టడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ఎల్సీ సమావేశం తర్వాత తమకు న్యాయం జరగకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని కార్మిక నాయకులు హెచ్చరిస్తున్నారు.