
భూ సమస్యలపై నిశిత పరిశీలన అవసరం
విశాఖ సిటీ: ప్రజాదర్బార్కు వచ్చే భూ సంబంధిత సమస్యలపై నిశిత పరిశీలన అవసరమని, న్యాయబద్ధంగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని వీఎంఆర్డీఏ చైర్పర్సన్ ఎంవీ ప్రణవ్గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్కు 22 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల సమస్యలు స్వయంగా తెలుసుకొని ఆయా అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న వినతులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఒక సమస్యపై ఫిర్యాదుదారుడు కార్యాలయం చుట్టూ తిరగకూడదని తేల్చి చెప్పారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా కాలం క్రితం నాటి భూసేకరణకు సంబంధించిన ఫిర్యాదులు ప్రస్తుతం వస్తున్నాయని, వాటికి సంబంధించిన అన్ని అంశాలు లోతుగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె.రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ఎస్టేట్ అధికారి దయానిధి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.