
కేజీహెచ్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మహారాణిపేట: కేజీహెచ్లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం తన కార్యాలయానికి వచ్చే క్రమంలో ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఓపీ కౌంటర్ల ద్వారా అందుతున్న సేవలను పరిశీలించారు. హెల్ప్ డెస్కు పనితీరు, కౌంటర్ల వద్ద సదుపాయాల స్థితిగతులను గమనించారు. అభ యాప్ ద్వారా ఓపీ టికెట్ తీసుకునే విధానం, రోగులకు వైద్యులు, సిబ్బంది నుంచి అందుతున్న సహకారంపై ఆరా తీశారు. వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన పలువురు రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఓపీ తీసుకునేందుకు ఎంత సేపు నిరీక్షిస్తున్నారు.. హెల్ప్ డెస్కులో ఉన్నవారు పూర్తి సహకారం అందిస్తున్నారా? వైద్య సేవల గురించి ఆరా తీశారు. సిబ్బంది వ్యవహార శైలి, సదుపాయాలు, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.శివానంద, ఆర్ఎంవో డాక్టర్ మెహర్కుమార్ ఉన్నారు.