కొల్లాపూర్/ నాగర్కర్నూల్: ‘అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి చెంచులను తీసుకువచ్చారు. వారికి అన్ని రకాల వసతులు కల్పించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారికి ఇచ్చిన భూములను బలవంతంగా ఇతరులు లాక్కుంటున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసుల ఉదాసీనతే ఇందుకు కారణం. చెంచులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అధికారులను ఆదేశించారు. చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన దాడి ఘటనపై విచారించేందుకు గాను ఆదివారం కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ఆయన పర్యటించారు. ఈశ్వరమ్మ నివసించే గుడారం, కూలిపోయిన ఇల్లు, దాడి జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఆమె కుటుంబీకులు, చెంచులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన సంధ్యమ్మ, నాగమ్మ, సాంబ, బండి శివుడిని పోలీసులు అరెస్టు చేయలేదని చెంచులు ఆయనకు వివరించారు. దీనిపై తహసీల్దార్ శ్రీకాంత్ ఇచ్చిన వివరణపై హుస్సేన్ నాయక్ అసహనం వ్యక్తం చేశారు. ఈశ్వరమ్మపై దాడితోపాటు ఆమె చిన్నమామ నాగన్నను బండి వెంకటేష్ కుటుంబీకులు హత్యచేసి ఉంటారని ఆరోపించారు. ఇదంతా చెంచుల భూమిని లాక్కునేందుకే అని అన్నారు. ఈశ్వరమ్మపై దాడికి పాల్పడిన వారందరినీ ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. వీటన్నింటిపై పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment