వనపర్తి: ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యమిచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని అర్జీదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు 97 అర్జీలు దాఖలు కాగా.. కలెక్టర్, అదనపు కలెక్టర్లు పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాస్థాయి అధికారులు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి విధిగా హాజరుకావాలని, పరిష్కరించిన విషయాన్ని అర్జీదారుతో పాటు తనకు నివేదికగా ఇవ్వాలన్నారు. ఈ–ఆఫీస్ విధానం మరో వారం రోజుల్లో అమలులోకి రావాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇక ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ–ఆఫీస్ విధానంలోనే జరగాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం.నగేష్, జిల్లా అధికారులు.. వివిధ మండలాల తహసీల్దార్లు వీడియో కాన్ఫరెన్స్లో హాజరయ్యారు.
ధరణి అర్జీలు పరిష్కరించాలి..
పెండింగ్ ధరణి అర్జీలను త్వరితిగతిన పరిష్కరించాలని, సక్సెషన్ యాక్ట్ గురించి పూర్తిగా చదివి అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో సమావేశమై ధరణి అర్జీలు, భూముల మార్కెట్ విలువ పెంపు, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాకి భూ సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. భూ దస్త్రాల పరిరక్షణ, ధరణి దరఖాస్తుల పరిష్కారంపై అవగాహన కల్పించారు. హిందూ సక్సెషన్ యాక్ట్, భూ రికార్డుల యాక్టులను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. భూ బదలాయింపు ఎన్ని రకాలు ఉంటాయి.. వాటిని ఏ విధంగా నిర్ధారించుకోవాలనే విషయంపై అవగాహన ఉండాలని కోరారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని.. పెండింగ్ మ్యుటేషన్, సక్సెషన్, కరెక్షన్ తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తహసీల్దార్లు, ఆర్డీఓ తమ లాగిన్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. భూమి మార్కెట్ విలువల నిర్ధారణ అంశంపై కమిటీలోని అధికారులు చర్చించాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయాలని కోరారు. ఎఫ్సీఐకి సీఎంఆర్ అప్పగింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైస్మిల్లర్లు మిల్లు సామర్థ్యం మేరకు మిల్లింగ్ చేసి ధాన్యాన్ని అప్పగించడం లేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దార్లు తమ పరిధిలోని రైస్మిల్లర్లపై ఒత్తిడి పెంచాలని, సకాలంలో ధాన్యం అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సబ్స్టేషన్ల ఏర్పాటుకుగాను భూ సమస్యలను పరిష్కరించి విద్యుత్ అధికారులకు అప్పగించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం.నగేష్, ఆర్డీఓ పద్మావతి, ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ సురభి
Comments
Please login to add a commentAdd a comment