Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

America Attack On Iran Donald trumps threatens to attack again1
అమెరికా మెరుపుదాడి.. ఖండించిన ప్రపంచదేశాలు

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ/మాస్కో: పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే శత్రుత్వంతో పరస్పర దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్యలోకి అగ్రరాజ్యం హఠాత్తుగా వచ్చి భీకరదాడులతో పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను మరింత ఎత్తుకు ఎగదోసింది. పర్వతగర్భంలో పటిష్టంగా, రహస్యంగా ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని బద్దలుకొట్టే లక్ష్యంతో అమెరికా యుద్ధవిమానాలు వేల కేజీల బరువైన అతిభారీ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్‌ రాజధాని సమీప ఫోర్డో అణుకేంద్రంపై శనివారం అర్ధరాత్రిదాటాక గంటలకు జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ పెనిట్రేటర్‌(ఎంఓపీ) గైడెడ్‌ బాంబులను అమెరికా బీ–2ఏ స్పిరిట్‌ స్టెల్త్‌ బాంబర్‌ విమానాలు జారవిడిచాయి. ఈ బాంబులు 200 అడుగుల లోతుకు చొచ్చుకెళ్లి అక్కడి భూగర్భాన్ని బద్దలుకొట్టాయి. నతాంజ్‌ అణుకేంద్రంపైనా అమెరికా ఇవే బాంబులను వేసింది. మొత్తంగా 14 జీబీయూ బాంబులను ఉపయోగించినట్లు అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్, జనరల్‌ డేనియల్‌ కెయిన్‌ వెల్లడించారు. ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌.. శనివారం అర్ధరాత్రిదాటగానే ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’పేరిట ఈ దాడులను చేసింది. అమెరికాలోని మిస్సోరీలోని వైట్‌హ్యాన్‌ వైమానిక స్థావరం నుంచి ఆరు బీ–2ఏ విమానాల దండు దండయాత్ర మొదలైంది. ఏకధాటిగా 37 గంటలపాటు ప్రయాణించి, మార్గమధ్యంలో గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంటూ 11,400 కిలోమీటర్లు ప్రయాణించిమరీ ఫోర్డో, నతాంజ్‌ అణుకేంద్రాలపై ఒక్కోటి దాదాపు 14,000 కేజీల బరువుండే 14 బంకర్‌ బస్టర్‌ బాంబులను పడేశాయి. ఆ తర్వాత ఇస్ఫహాన్‌ అణుకేంద్రంపై అమెరికా జలాంతర్గామి 30 టోమాహాక్‌ క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ మూడు అణుకేంద్రాలపై 75 దాకా గైడెడ్‌ క్షిపణులను ప్రయోగించి విధ్వంసం సృష్టించింది. మొత్తంగా 125 విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. కొన్ని విమానాలు దాడిచేయగా మిగతావి శత్రుసేనలను తికమక పెట్టేందుకు వేర్వేరు దిశల్లో చక్కర్లు కొట్టాయి. మెరుపువేగంతో దాడులుచేసి తిరిగి తమతమ స్థావరాలకు చేరుకున్నాయి. యుద్ధ, రవాణా, ఇంధన విమానాలు ఈ ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’లో పాల్గొన్నాయి. అమెరికా దాడుల్లో అణుకేంద్రాల్లో మౌలికవసతులు ఏ స్థాయిలో నాశనమయ్యాయో ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే పర్వతం పైభాగంలో ఆరు భారీ రంధ్రాలు పడ్డట్లు తాజాగా తీసిన ‘ప్లానెట్‌ ల్యాబ్స్‌ పీబీసీ’ఉపగ్రహ ఫొటోల్లో కనిపించింది. అయితే అణుబాంబు తయారీని అడ్డుకునేందుకు బాంబులేశామని, ఇరాన్‌లో యుద్ధాన్ని ఎగదోసి, ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమకు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ స్పష్టంచేశారు. అయితే అణుబాంబు తయారీ సామర్యాన్ని ఇరాన్‌ సంతరించుకోవద్దనే లక్ష్యంతోనే తాము యుద్ధంలో పాల్గొన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ సైనికచర్యను సమర్థించుకున్నారు. తమపై ప్రతిదాడి చేస్తే మిగతా లక్ష్యాలపై దాడులు తప్పవని ఇరాన్‌ను హెచ్చరించారు. అయితే దాడుల తర్వాత ఆయా అణుకేంద్రాల నుంచి ఎలాంటి అణుధారి్మకత వెల్లడైన ఛాయలు కనిపించలేదని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ స్పష్టంచేసింది. దాడికి ముందే అక్కడి నుంచి యురేనియం నిల్వలను తరలించినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. ఊహించనిస్థాయిలో దెబ్బకొడతాం: అబ్బాస్‌ ఓవైపు అణు మధ్యవర్తిత్వం కోసం స్వాగతం పలుకుతూ మరోవైపు సమరాగ్నిని రాజేస్తున్న అగ్రరాజ్యాన్ని ఊరికే వదిలిపెట్టబోమని ఇరాన్‌ ప్రతిజ్ఞచేసింది. చరిత్రలో ఎన్నడూలేని స్థాయిలో దాడులుచేసి బదులు తీర్చుకుంటామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ప్రకటించారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోపరేషన్‌ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన అబ్బాస్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘దౌత్యనీతిని కాలరాస్తూ అమెరికా మాపై దాడులకు తెగబడింది. మేం దౌత్యాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టి దేశ రక్షణ కోసం భీకరపోరు చేయాల్సిన తక్షణావసరమిది. దుస్సాహసంతో దారుణంగా దాడులు చేసిన యుద్ధోన్మాద అమెరికా తదుపరి తీవ్ర పర్యావసానాలకు బాధ్యతవహించాల్సి ఉంటుంది. అమెరికా చర్యలకు ఇరాన్‌ తన సైన్యంతో బదులుతీర్చుకుంటుంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఇరాన్‌ పాటుపడుతుంది’’అని అబ్బాస్‌ అన్నారు. మరోవైపు తమపై దాడిచేసిన ఇజ్రాయెల్‌పైనా ఇరాన్‌ ఆదివారం మిస్సైళ్లను ప్రయోగించింది. తన అమ్ములపొదిలోని మధ్యస్థ శ్రేణి ఖుర్రమ్‌షహర్‌–4 క్షిపణిను సైతం ఇరాన్‌ ప్రయోగించింది. ఇది ఒకేసారి 1,500 కేజీల బరువైన వేర్వేరు వార్‌హెడ్లను ఏకంగా 2,000 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని ఈ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దాడులను పొగిడిన ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్‌ స్వాగతించింది. ఇదొక అద్భుత, సాహసోపేత, చరిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, అధ్యక్షుడు ఇసాక్‌ హెర్జోగ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘దాడులు చేయాలని కోరాం. కానీ అమెరికా నిర్ణయం ముందస్తుగా మాకుతెలీదు. ఇదొక చారిత్రక నిర్ణయం. అమెరికా నేరుగా దాడులు చేస్తున్నందున ఇక మేం దాడులు చేయబోమని అనుకోవద్దు. ఇరాన్‌ మా భూభాగాలపై క్షిపణులు వేస్తోంది. మేం వాటికి బదులు చెప్పాలి’’అని ఇసాక్‌ అన్నారు. ఆదివారం సైతం ఇరాన్‌లోని డజనుకుపైగా మిలటరీ స్థావరాలపై దాడులుచేశామని చెప్పారు. అయితే ఆస్పత్రులు, మెడికల్‌ సెంటర్లపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోందని ఇరాన్‌ ఆరోపించింది. ఆదివారం నాటికి ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్‌లో 865 మందిదాకా చనిపోయారని, 3,396 మంది గాయపడ్డారని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ‘హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌’సంస్థ ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీని అత్యంత సురక్షిత బంకర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. తమ దేశంలో 24 మంది చనిపోయారని, వేయి మంది గాయపడ్డారని ఇజ్రాయెల్‌ పాత లెక్కలనే చెబుతోంది మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్‌ ఇరాన్‌పై దాడులను చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. దాడుల తర్వాత ఇరాన్‌కు ప్రపంచదేశాల నుంచి సైనిక సాయం పెరుగుతుందని రష్యా వ్యాఖ్యానించింది. ఈ మేరకు రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదెవ్‌ ‘ఎక్స్‌’ లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘దాడుల కారణంగా ఆ అణుకేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదు. పైగా ఇరాన్‌కు బయటి మద్దతు పెరుగుతోంది. అణువార్‌హెడ్‌లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మంతనాలు జరిపేందుకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ ఆదివారం మాస్కోకు వెళ్లారు. భేటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జలసంధి దిగ్భందం!! ప్రపంచ చమురు జీవనాడికి పేరొందిన హోర్ముజ్‌ జలసంధిని మూసేస్తామని ఇరాన్‌ బెదిరించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయానికి ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలపింది. అయితే జాతీయ ప్రయోజనాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ‘సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది కూడా ఆమోదిస్తే జలసంధి ద్వారా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. దాంతో ఇంధన కొరత ఎక్కువై, గిరాకీ పెరిగి, పెట్రో ధరలు మరింత అధికంకానున్నాయి. భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముంది. మరోవైపు, అమెరికా జోక్యం, బాంబు దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆదివారం ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌తో భారత ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉద్రిక్తతలపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ వివరాలను మోదీ తన ‘ఎక్స్‌’ఖాతాలో వెల్లడించారు.

YS Jagan Fires on Chandrababu Govt2
అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అప్పుల కోసం టీడీపీ కూటమి సర్కారు మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు బరి తెగించిందని వైఎస్సార్‌­సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ‘ఎక్స్‌’ వేదికగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) జారీ చేసే ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌) బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్‌ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ (సంచిత నిధి)పై అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ.. ఏపీఎండీసీకి ఎన్‌సీడీ బాండ్ల జారీకి అనుమతి ఇవ్వడం సరికాదన్నారు.ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని స్పష్టం చేస్తూ ఆదివారం ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు. అందులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మరోసారి ఉల్లంఘించింది. అప్పుల కోసం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి జూన్‌ 24న ఎన్‌సీడీ బాండ్ల జారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఆమోదం తీసు­కున్న అంశాలకు మాత్రమే రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ప్రభుత్వం నిధులు తీసుకోవచ్చు. కానీ.. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నిధులు తీసుకునేలా ప్రైవేట్‌ పార్టీలను అనుమతించడం రాజ్యాంగంలోని 203, 204 అధికరణ (ఆరి్టకల్‌)లను ఉల్లంఘించడమే. రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి ఏపీఎండీసీకి అను­మతి ఇవ్వడం రాజ్యాంగంలోని అధికరణ 293(1)ని ఉల్లంఘించడమే.ఎన్‌సీడీ బాండ్‌ హోల్డర్లకు ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత అంతకంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడమంటే దారుణం. దీనికి అదనంగా రూ.1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఖనిజ సంపదను ఎన్‌సీడీ బాండ్‌ హోల్డర్లకు తనఖా పెట్టారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలు చేయమని హైకోర్టు నోటీ­సులు జారీ చేసినట్లు కూడా తెలిసింది. హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీని కొనసా­గించడానికి ఏపీఎండీసీని ప్రభుత్వం అనుమతించడం సరి కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడమే. భారత రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడమే’’.

Farmers complaint at Bhu bharathi conferences3
సర్వే నంబర్లు గాయబ్‌!

సాక్షి, హైదరాబాద్‌: ఒకటి కాదు...రెండు కాదు.. రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన లక్షకు పైగా సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. పాత రికార్డుల్లో ఉన్నా కొత్త రికార్డుల్లోకి ఇవి ఎక్కలేదు. ధరణికి ముందున్న మాన్యువల్‌ రికార్డుల్లో నమోదైన ఈ సర్వే నంబర్లన్నీ ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూముల సర్వే నంబర్లు కనిపించకపోవడంతో ఆయా సర్వే నంబర్లలో భూమి ఉన్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకపోవడం, సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూభారతి సదస్సుల్లో ఈ రైతులందరూ మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 561 మండలాల్లో ఉన్న 10,239 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో మొత్తం 8,00,999 దరఖాస్తులు రాగా, అందులో తమ భూముల సర్వే నంబర్లు మిస్సయ్యాయంటూ ఏకంగా 1,26,028 దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 15 శాతం సర్వే నంబర్ల మిస్సింగ్‌ దరఖాస్తులే కావడం గమనార్హం. రెవెన్యూ రికార్డులకు సంబంధించి కీలకమైన, భూమి గుర్తింపు సంఖ్య అయిన సర్వే నంబరే లేకుండా పోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మొత్తం 8 లక్షలకు పైమాటే రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం పేరిట ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఆ పోర్టల్‌ను రద్దు చేసి భూభారతి అమల్లోకి తెచ్చి కూడా రెండు నెలలయింది. కానీ రాష్ట్ర రైతాంగం చేతిలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి ఇంకా లెక్కలేనన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామస్థాయిలో జరిగిన ఈ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా వినతులు రావడం గమనార్హం. ఇందులో ఎక్కువగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 30 శాతం దరఖాస్తులు ఇవే కావడం గమనార్హం. కాగా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవసరమైన నిబంధనలను భూభారతి చట్టంలో పెట్టినా..ఈ అంశం కోర్టులో పెండింగ్‌ ఉండడంతో అవి రెగ్యులరైజ్‌ చేసేందుకు వీలు కాలేదు. కోర్టులో కేసు ముగిసిన తర్వాత ఆగస్టు నెలలో వీటన్నింటినీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాత సర్వే నంబర్ల మిస్సింగ్, అసైన్డ్‌ భూములకు సంబంధించిన రికార్డుల సమస్యలు, ఆ భూములను తమకు క్రమబద్ధీకరించాలంటూ వచ్చిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. అసైన్డ్‌ భూముల రెవెన్యూ రికార్డులకు సంబంధించి 90 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఆ భూములను తమకు రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ మరో 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత వారసత్వం (విరాసత్‌) ద్వారా వచ్చిన భూమిని భాగస్వామ్య పంపకం చేయాలంటూ ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అయితే భూభారతి పోర్టల్‌ ద్వారా ఈ భాగస్వామ్య పంపకాలకు అవకాశం కల్పించలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక మ్యుటేషన్‌ పెండింగ్‌/కోర్టు కేసులు, డిజిటల్‌ సంతకం పెండింగ్, విస్తీర్ణంలో తేడాలు.. ఇలా రెవెన్యూ రికార్డులకు సంబంధించి 13 రకాలు, ఇతర సమస్యలకు సంబంధించిన 17 రకాల దరఖాస్తులు ఇటీవల జరిగిన భూభారతి సదస్సుల్లో రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 3.2 లక్షలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు కాగా మిగిలిన దరఖాస్తులను కూడా నమోదు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఖమ్మంలో ఎక్కువ..మేడ్చల్‌లో తక్కువ జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఖమ్మం జిల్లా రైతాంగం ఎక్కువగా భూమి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు భూభారతి సదస్సుల్లో వచ్చిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాలో అత్యధికంగా 67,378 దరఖాస్తులు రాగా, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 61,145 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.28 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం వచ్చిన 8 లక్షల దరఖాస్తుల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 15 శాతం కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. ఆ తర్వాత వరంగల్‌ (54,933), భూపాలపల్లి (48,651), సూర్యాపేట (44,501), సిద్దిపేట (42,639), నల్లగొండ (42,161) జిల్లాల్లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఇక అత్యల్పంగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 2,857 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 10 వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో ఆసిఫాబాద్‌ (3,712), మహబూబ్‌నగర్‌ (9,610), నారాయణపేట (4,052), రాజన్న సిరిసిల్ల (6,965), వనపర్తి (7,615) ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి సమస్యల నుంచి విముక్తి భూభారతి సదస్సులను చాలా పకడ్బందీగా నిర్వహించాం. అధికారులే గ్రామాలకు వెళ్లి, ప్రజలకు ఒకరోజు ముందే దరఖాస్తులు ఇచ్చి, అన్ని వివరాలను తీసుకున్నారు. రూపాయి ఖర్చు లేకుండా రైతులు తమ భూ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసుకునే అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉంది. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ చేసిన పాపాలకు, ధరణి తెచ్చిన కష్టాలకు భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య నిదర్శనం. ధరణిని బంగాళాఖాతంలో కలిపేశాం. ఇప్పుడు రైతుల సమస్యల పరిష్కారమే మా ముందున్న తక్షణ కర్తవ్యం. ఆగస్టు 15 నాటికి తెలంగాణ రైతాంగాన్ని భూ సమస్యల నుంచి విముక్తులను చేస్తాం. – రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (నోట్‌: ఇతరముల కేటగిరీలో ఎక్కువగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, 2 లక్షలకు పైగా అవేనని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అసైన్డ్‌ భూములను రిజిస్టర్‌ చేయాలంటూ 50 వేలకు పైగా, శివాయి జమేదార్‌ భూముల సమస్యలపై 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. వీటితో పాటు పోడు భూములు, సరిహద్దు వివాదాలు, ఇండ్ల స్థలాలకు పాస్‌బుక్కులు, కోర్టు కేసులు, అప్పీళ్లు, భూదాన్‌ భూములు.. ఇలా 17 రకాల సమస్యలపై భూభారతి సదస్సుల్లో రైతులు దరఖాస్తులు సమర్పించారు.)

Rasi Phalalu: Daily Horoscope On 23-06-2025 In Telugu4
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం,, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.త్రయోదశి రా.8.49 వరకు, తదుపరి చతుర్దశి; నక్షత్రం: కృత్తిక ప.2.21 వరకు, తదుపరి రోహిణి; వర్జ్యం: తె.5.20 నుండి 6.49 వరకు (తెల్లవారితే మంగళవారం); దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.18 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు; అమృత ఘడియలు: ప.12.04 నుండి 1.33 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు సూర్యోదయం: 5.30; సూర్యాస్తమయం: 6.33; మాస శివరాత్రి మేషం.. కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ.వృషభం... కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.మిథునం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కర్కాటకం.. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.సింహం..... పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.కన్య... కుటుంబంలో చికాకులు. బంధువులతో తగాదాలు. స్థిరాస్తి వివాదాలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.తుల... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.వృశ్చికం..... శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. భూలాభాలు. సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.ధనుస్సు.... బంధువుల ద్వారా కీలక సమాచారం. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.మకరం... పనులు కొంత మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.కుంభం.... ఆకస్మిక ప్రయాణాలు. పనులు నిదానిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.మీనం.... కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

Maoists wonot sleep peacefully this monsoon says Amit shah5
మావోయిస్టులను నిద్రపోనివ్వను

రాయ్‌పూర్‌: మావోయిస్టులు సాధారణగా వర్షాకాలంలో విశ్రాంతి తీసుకుంటారని, కానీ ఈ వర్షాకాలంలో కూడా మావోయిస్టులను నిద్రపోనివ్వనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. వర్షాకాలంలో కూడా ప్రభుత్వ ఆపరేషన్‌ కొనసాగుతుందని హెచ్చరించారు. చర్చల ప్రసక్తే లేదన్న మంత్రి.. అడవుల్లో ఉన్న మావోయిస్టులంతా ఆయుధాలు వదిలి జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని, అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. చత్తీస్‌గఢ్‌లోని నవా రాయ్‌పూర్‌ అటల్‌ నగర్‌లో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ(ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ)కి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే సెజ్‌బహార్‌లోని ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ ట్రాన్సిట్‌ క్యాంపస్‌ను, ఛత్తీస్‌గఢ్‌లోని ఐ–హబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం షా మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేస్తామన్నారు. అవసరమైతే అంతకన్న ఎక్కువ సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను పూర్తిగా అమలుతో మన దేశ నేర న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, వేగవంతమైన, శాస్త్రీయ న్యాయ వ్యవస్థగా మారుతుందని షా అన్నారు. నవ రాయ్‌పూర్‌లోని ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ క్యాంపస్‌కు రూ. 145 కోట్లు, సీఎఫ్‌ఎస్‌ల్‌కు రూ. 123 కోట్లు ఖర్చవుతుందని, ఇవి మూడు సంవత్సరాలలో అందుబాటులోకి వస్తాయన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, ఆర్థిక పురోగతిపైనే కాకుండా సకాలంలో న్యాయం అందించడంపైనా దృష్టి పెడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయి, ఉప ముఖ్యమంత్రులు అరుణ్‌ సావో, విజయ్‌ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Chandrababu govt Singayya death incident distorted6
సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్ర పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదుకు తెగబడింది. ఓ వైపు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న వ్యతిరేకత.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో టీడీపీ కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీసింది. వైఎస్‌ జగన్‌ ఇటీవలి సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాలకు వక్రభాష్యం చెబుతూ అక్రమ కేసుల నమోదుకు బరితెగించింది. సింగయ్య అనే వ్యక్తి ఓ అనుమతిలేని ప్రైవేట్‌ వాహనం ఢీకొని మృతి చెందినట్టు స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌ అధికారికంగా ప్రకటించిన తరువాత.. మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం తన నక్కజిత్తులను ప్రదర్శించింది. అందుకోసం యావత్‌ పోలీసు శాఖను కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ఏకంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనే అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాహన డ్రైవర్‌గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) కానిస్టేబుల్‌ రమణారెడ్డిని ఏ1గా.. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్‌ జగన్‌ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు తాజా తార్కాణం. ఈ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు భిన్నంగా తాజాగా బీఎన్‌ఎస్‌ 105(1), 49 కింద కేసు నమోదు చేస్తామని గుంటూరు ఎస్పీ సతీశ్‌ ఆదివారం చేసిన ప్రకటనే నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పక్కాగా పన్నాగాన్ని అమలు చేసింది. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లలో కుట్ర పూరిత నిర్లక్ష్యం నుంచి ... తాజాగా అక్రమ కేసు నమోదు వరకు శకుని మాయోపాయాన్ని తలపించేట్టుగా చంద్రబాబు కుతంత్రం ఇలా సాగింది.అడుగడుగునా భద్రతా వైఫల్యంమాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి మృతి చెందడం వాస్తవమే అయితే ఆ కేసులో మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది. ఎందుకంటే జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన ఆయన పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశ పూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నది స్పష్టమైంది. వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం బయట పడింది. వైఎస్‌ జగన్‌ తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. రూట్‌ మ్యాప్‌తో పాటు ఇతర వివరాలు అందించారు. ఆ మేరకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. జడ్‌ ప్లస్‌ భద్రత ప్రకారం వైఎస్‌ జగన్‌ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఉండాలి. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్‌ పార్టీ పోలీసులు విధులు నిర్వహించాలి. ఆ రోప్‌ పార్టీ భద్రతా వలయాన్ని దాటుకుని ఎవరూ వాహనం సమీపానికి రాకుండా కట్టడి చేయాలి. కానీ వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనలో పోలీసులు ఈ భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించనే లేదు. ఆయన వాహనానికి ముందున సమీపంలో ఎస్కార్టు వాహనం లేదు. ఇరువైపులా రోప్‌ పార్టీ పోలీసులు లేనే లేరు. దాంతో వైఎస్సార్‌సీపీ అభిమానులే కాదు... అభిమానుల ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు కూడా వైఎస్‌ జగన్‌ వాహనంపైకి ఎగబడ్డారు. ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్‌పైకి ఎక్కి మరీ హల్‌ చల్‌ చేశాడు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం బానెట్‌పైకి ఓ యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే వైఎస్‌ జగన్‌ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. అందువల్లే అక్కడ ప్రమాదం జరిగింది. అందుకు బాధ్యత పోలీసులదీ.. రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏ1గా అంటే ప్రధాన ముద్దాయిగా చేర్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ వాహనం డ్రైవర్‌ రమణారెడ్డి (ఏఆర్‌ కానిస్టేబుల్‌)తోపాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్‌ జగన్‌ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం విస్మయ పరుస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఆ ప్రమాదాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదుకు తెగబడిందన్నది స్పష్టం అవుతోంది.అది జగన్‌ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబు కుట్రేమాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఇటీవల మీడియా చానళ్ల ఇంటర్వ్యూల్లోనే తన కుట్ర లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన తన కుట్ర కార్యాచరణను చేపట్టారన్నది కూడా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన భద్రత పట్ల పోలీసులు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఆయన కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు పోలీసులు ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వైఎస్‌ జగన్‌ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ అయ్యే హెలీప్యాడ్‌ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్‌ వద్దకు చొచ్చుకు వచ్చేందుకు ఉద్దేశ పూర్వకంగా అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి రోడ్డు మార్గంలో వెళ్లినా సరే పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కల్పించ లేదు. నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి సరైన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా డొక్కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని గతంలో సమకూర్చింది. ఆ వాహనం కొద్ది దూరం వెళ్లే సరికే మొరాయించింది. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకున్న వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించించింది. హైకోర్టు అనుమతితో వైఎస్సార్‌సీపీ సొంత నిధులతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కొనుగోలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా తన కుట్రలకు పదును పెడుతూనే ఉంది.జగన్‌కు జనాదరణతో బెంబేలెత్తే అక్రమ కేసులువైఎస్‌ జగన్‌ జిల్లా పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లా వెళ్లినా దారిపొడవునా వేలాది మంది జనం తండోప తండాలుగా తరలి రావడంతో ప్రభుత్వ పెద్దలను కలవర పరుస్తోంది. దాంతోనే జగన్‌ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆ కుట్రలను ఛేదిస్తూ మరీ భారీ సంఖ్యలో జనం ప్రభంజనంగా పోటెత్తుతుండటంతో చంద్రబాబుకు కంటగింపుగా మారింది. దాంతో వైఎస్‌ జగన్‌ పర్యటనలకు వచ్చే వారిపై, వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కనీసం అక్రమ కేసుల భయంతోనైనా ఆయన పర్యటనలకు జనం రాకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ కుతంత్రం. అందుకు ఇటీవల వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటన అనంతరం పెట్టిన అక్రమ కేసులే తాజా తార్కాణం. పుష్ప సినిమాలో ‘రప్పా రప్పా’ అనే డైలాగ్‌తో కూడిన ఫ్లెక్సీని ఓ టీడీపీ కార్యకర్త వైఎస్‌ జగన్‌ పర్యటనలో ప్రదర్శించారు. ఆయన టీడీపీకి చెందిన వాడని.. టీడీపీ గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉందన్నది ఫొటోలు, ఇతర ఆధారాలతో బయట పడింది. అయితే టీడీపీ నేతలే ఆ యువకుడిని వైఎస్‌ జగన్‌ పర్యటనలోకి పంపించి తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్ని ఉండాలి. లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదన్న ఆగ్రహంతో ఆ యువకుడే ఆ ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండాలి. అంతేగానీ ఆ ఫ్లెక్సీ వ్యవహారంతో వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నది తేలిపోయింది. అయినా సరే ఆ టీడీపీ కార్యకర్త ప్రదర్శించిన ఫ్లెక్సీకి వక్రభాష్యం చెబుతూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ యువకుడితోపాటు సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌ భార్గవ్‌ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. తాజాగా వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన వాహనం కింద పడి ఒకరు మరణించారని.. అదీ మూడు రోజుల తర్వాత చెబుతూ కేసు నమోదు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అంటే వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో వెల్లువెత్తుతున్న ప్రజాదరణను తట్టుకోలేక ఈర్షా్యద్వేషాలతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగిన ఎస్పీ సతీశ్‌!ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గుంటూరు ఎస్పీ సతీశ్‌ తలొగ్గినట్టు స్పష్టమవుతోంది. బాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న ఆయన సరైన నిర్ధారణ లేకుండా అధికారిక ప్రకటన చేయరు. గుర్తు తెలియని ప్రైవేటు వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఆయన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ప్రకటించారు. ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ వాహనం ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని చెప్పారు. ఆ సమయంలో ఐజీ సర్వశ్రేష్ట్ర త్రిపాఠి కూడా ఆయన పక్కనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం నమోదు చేయాలని భావిస్తున్న అక్రమ కేసుకు ఎస్పీ ప్రకటన అడ్డంకిగా మారింది. అందుకే ఎస్పీ సతీశ్‌ ప్రకటనపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో 18 రాత్రికే గుంటూరు పోలీసుల వైఖరిలో మార్పు కనిపించింది. కానీ ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఎస్పీ ఆదివారం మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ ప్రయా ణిస్తున్న వాహనం ఢీ కొనడంతో సింగయ్య మృతి చెందార న్నారు. అంటే ప్రభుత్వ పెద్దలు ఎస్పీపై ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చారో అన్నది తేటతెల్లమైందని నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ వైఫల్యంతోనే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయలేక టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేలో కూడా అదే విషయం వెల్లడై­నట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్‌ జగన్‌ ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? ఏడాదిలోనే పదేళ్లకు సరిపడా అప్పులు చేసి రాష్ట్రాన్ని తిరోగమనపథంలోకి తీసుకుపోయారు.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం? రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యానికి బాధ్యత చంద్రబాబుదే.. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలు పూర్తిగా కుదేలైనా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న అవినీతి, అక్రమాలతో రాష్ట్రం కుదేలైందని వైఎస్‌ జగన్‌ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మరోవైపు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే పేరిట ఈవెంట్‌ మేనేజ్మెంట్‌ ఎత్తుగడ బెడిసికొట్టింది. లక్షలాది మంది విద్యార్థులు, ఇతరులను బలవంతంగా రప్పించి సరైన వసతులు కల్పించలేకపోవడంతో వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన చంద్రబాబు అత్యవసరంగా ఏదో డైవర్షన్‌ రాజకీయం అవసరమని గుర్తించారు. అందుకే వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనను వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసేలా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు.గుంటూరు ఎస్పీ ప్రకటనలు నాడు–నేడుబాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న అధికారి చేసే ప్రకటనకు అత్యంత విశ్వసనీయత ఉంటుంది. ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలా తమ కుట్రలో భాగస్వాములను చేస్తోందనడానికి గుంటూరు ఎస్పీ సతీశ్‌ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే తార్కాణం. జూన్‌ 18 : వైఎస్‌ జగన్‌ పర్యటనలో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొని సింగయ్య మృతి చెందారు. అది కాన్వాయ్‌లోని వాహనం కాదు. ప్రైవేట్‌ వాహనం (ఏపీ 26 సీఈ 0001) ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం. ఆ మేరకు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106(1) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. (ఆ వాహనం వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాశ్‌ అనుచరుడు గొట్టిపాటి హరీశ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రచురించాయి).జూన్‌ 22 : వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొనడంతోనే సింగయ్య మృతి చెందారు. ఆ వాహన డ్రైవర్‌ రమణారెడ్డితోపాటు అందులో ప్రయాణిస్తున్న వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజినీ, వైఎస్‌ జగన్‌ పీఏ కె.నాగేశ్వర రెడ్డిలపై కేసు నమోదు చేశాం. ఆ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని సెక్షన్లను సవరిస్తూ బీఎన్‌ఎస్‌ 105(1), 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.అబద్ధపు వాంగ్మూలం కోసం డ్రైవర్‌పై ఒత్తిడి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఆయన వాహనం డ్రైవర్‌గా వ్యవహరించిన రమణారెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తోంది. ఆ డ్రైవర్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) విభాగంలో కానిస్టేబుల్‌గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వాహనానికి డ్రైవర్‌గా ఆయన్ను ప్రభుత్వమే కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రమణారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాన్ని వక్రీకరిస్తూ తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తున్నట్టుగా సమాచారం. తాము చెప్పిన­ట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఆయన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని.. అంతేకాకుండా పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది.

Tdp govt failure to implement Super Six promises: Andhra pradesh7
అబ్రకదబ్ర.. సూపర్‌ సిక్స్‌ ఇచ్చేశా.. మాయాఫెస్టోతో నయ వంచన!

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు అంతకంటే రెండింతలు అధికంగా సంక్షేమం అందిస్తామని వాగ్దానం చేశారు. వాటిని నమ్మిన ప్రజానీకం ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మేనిఫెస్టో అమలుపై దృష్టి పెట్టడం లేదు. పైగా సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలు అమలు చేసేశామని.. కాదూ కూడదని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారికి నాలుక మందం తప్ప మ­రొకటి కాదంటూ సీఎం చంద్రబాబు బెదిరింపు­లకు దిగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తు­న్నారు.2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధి­కా­రంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మేనిఫె­స్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని గుర్తు చేస్తు­న్నారు. దేశ చరిత్రలో ఎన్నికల మేనిఫె­స్టోకు నాటి సీఎం వైఎస్‌ జగన్‌ సిసలైన నిర్వచనం చెప్పా­రని ప్రశంసిస్తున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక, మద్య నిషేధాన్ని ఎత్తేయ­డం.. 1999, 2014 ఎన్ని­కల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమ­లు చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ చంద్ర­బాబు­ను నమ్మడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపడమేనని ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌ ప్రజలను జాగృతం చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.వైఎస్‌ జగన్‌ చెప్పినట్లే.. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశా­రని, హామీల అమలు పూచీ నాదంటూ గ్యారంటీ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌ వాటిపై నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతు­న్నారు. సూపర్‌ సిక్స్‌ హామీ­లను అమలు చేయక పోవడం ద్వారా ఏడాదిలోనే ప్రజ­లకు రూ.81,397.83 కోట్లను చంద్రబాబు ఎగ్గొ­ట్టారు. మిగతా హామీలను తుంగలో తొక్కడం ద్వారా అంతే స్థాయిలో సీఎం చంద్రబాబు ఎగ్గొట్టా­రని ప్రజానీకం మండిపడుతోంది. ఏడాదిలో ఏమీ చేయకపోగా, ఎంతో చేసేసినట్లు సంబరాలకు సిద్ధ­మ­వడాన్ని తీవ్రంగా తప్పు పడు­తోంది.బీసీలకు వెన్నుపోటు⇒ బీసీలే టీడీపీకి వెన్నెముక అంటూ పదే పదే చెప్పే సీఎం చంద్రబాబు.. ఆ వర్గాల ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి వెన్నుపోటు పొడిచారు. బీసీ వర్గాల ప్రజల స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.పది వేల కోట్లు వ్యయం చేస్తామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున స్వయం ఉపాధికి వ్యయం చేయాలి. కానీ.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఈ పథకానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేయాలి. కానీ..ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ⇒ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్‌ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి దాకా అమ­లు చేయలేదు. పవర్‌ లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తూ ఉత్త­ర్వులు ఇచ్చారే గానీ అమలు చేయలేదు. ⇒ నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న హామీని అమలు చేయలేదు. దేవాలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.25 వేలు ఇస్తామన్న హామీని గాలికి వదిలేశారు. ⇒ వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్‌.. రాయల్టీ, సీనరేజీ చార్జీల్లో మినహాయింపు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదు. రజకు­లకు దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహకం, విద్యుత్‌ చార్జీల రాయితీ ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.⇒ వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది ఆ సాయం అందించకుండా రూ.265 కోట్లు ఎగ్గొ­టా­్టరు. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని తుంగలో తొక్కారు.మహిళలకు మోసం ⇒ 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా­నని హామీ ఇచ్చి, చేయ­కుండా మహిళలకు మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో వంచించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ.. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు.⇒ అంగన్‌వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేర­కు గ్రాట్యుటీ చెల్లిస్తామని, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారు.⇒ ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పిస్తామని, విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు ఇస్తా­మని.. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా అమలు చేయలేదు.ఎస్సీ, ఎస్టీలకు నమ్మకద్రోహంఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తోంది. సబ్‌ ప్లాన్‌ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని నమ్మబలికి.. వాటిని ఇతర పనులకు మళ్లిస్తూ అన్యాయం చేస్తోంది. చివరకు గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడమే అందుకు నిదర్శనం.రైతులకు తీరని ద్రోహంవ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని 2014లో హామీ ఇచ్చి వాటిని మాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో అన్నదాతలకు ద్రోహం చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. వరి నుంచి కోకో వరకూ ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేదు. గిట్టు­బాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రైతు భరోసాగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి మొదటి ఏడాది రూ.10,716.53 కోట్లు్ల ఎగ్గొట్టారు.ఉద్యోగులకూ మోసం సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని 2014లో హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో ద్రోహం చేస్తున్నారు. మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్‌ను రాజీ­నామా చేయించారు. ఇప్పటికీ తిరిగి చైర్మన్‌ను నియమించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటిదాకా ఐఆర్‌ ఊసే లేదు. అలవెన్స్‌ పేమెంట్స్‌పైన కూడా పునఃపరిశీలన చేస్తామని హామీ ఇచ్చి, నాలుగు డీఏలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. వెరసి ఉద్యోగులకు రూ.20 వేల కోట్లకుపైగా బకాయిపడ్డారు.⇒ వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేసి 2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేసి వారికి ద్రోహం చేశారు.కాపులకు రూ.3 వేల కోట్లు బకాయి ⇒ కాపు సామాజిక వర్గంపై చంద్రబాబుది కపట ప్రేమేనన్నది మరోసారి స్పష్టమైంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపు సంక్షేమం కోసం రానున్న ఐదేళ్లలో కనీసంగా రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి.. కాపుల సాధికారత, అభి­వృద్ధి కోసం చర్యలు చేపడతా­మని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.3 వేల కోట్లు చొప్పున ఖర్చు చేయాలి.కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అంటే.. ఇప్పటికే కాపులకు రూ.3 వేల కోట్లు బకాయిపడ్డారు. 2025–­26 బడ్జెట్‌లోనూ కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఇచ్చిన హామీకి దిక్కే లేదు.ముస్లిం మైనార్టీలకు దోఖా ⇒ హజ్‌ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం అందిస్తామని, మసీ­దుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు, అర్హత ఉన్న ఇమామ్‌లను ప్రభు­త్వ ఖాజీలుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. వాటిని ఇప్పటి దాకా అమలు చేయలేదు. విజయవాడ సమీపంలో హజ్‌ హౌస్‌ నిర్మాణం ఇప్పటికీ చేపట్ట­లేదు. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్‌లకు స్థలాలు కేటాయిస్తామన్న హామీకి దిక్కేలేదు. ⇒ నూర్‌ బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని, రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.⇒ క్రిస్టియన్‌ మిషనరీస్‌ ప్రాపర్టీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తామని, చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామని.. శ్మశాన వాటికలకు స్థల కేటాయింపు, జెరూసలెం యాత్రికులకు సాయం అందిస్తామంటూ ఇచ్చిన హామీని ఇప్పటి దాకా అమలు చేయలేదు.విద్యార్థుల జీవితాలతో చెలగాటం కాలేజీలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆరు త్రైమాసికాలకు సంబంధించి రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక డాక్టర్‌ అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.గాల్లో దీపంగా ప్రజారోగ్యం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని, అన్ని మండల కేంద్రాలలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. బీపీ, షుగర్‌ వంటి నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులకు ఉచితంగా జనరిక్‌ మందులు పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. కానీ.. ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గత ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నీరుగార్చేశారు.ఈ పథకం కింద చికిత్స అందించడానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. కానీ.. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకున్న వారికి రూ.3,600 కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న వారు విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు వంతున ఆరోగ్య ఆసరా కింద గత ప్రభుత్వం ఇచ్చేది. ఆరోగ్య ఆసరాకు ఏటా రూ.400 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ రూ.3600 కోట్లు, ఆరోగ్య ఆసరా రూ.400 కోట్లు మొత్తం రూ.4000 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు.విద్యుత్‌ చార్జీల బాదుడు రూ.15,485 కోట్లు విద్యుత్‌ చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే విద్యుత్‌ చార్జీలను తగ్గించకపోగా భారీగా పెంచేశారు. విద్యుత్‌ చార్జీల రూపంలో ఏడాదిలోనే రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు.అగ్రవర్ణ పేదలకు అన్యాయం ⇒ వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ బ్రాహ్మణులకు యువగళం కింద నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఏడాదిగా ఒక్కరికీ ఇవ్వకుండా వంచించారు. ⇒ ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ⇒ భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయలేదు. ⇒ కమ్మ, రెడ్డి, వెలమ తదితర అగ్ర కుల కార్పొరేషన్‌లకు తగిన నిధులు కేటాయించి.. వారి సాధికార, అభివృద్ధికి చర్యలు చేపడతామన్న హామీని తుంగలో తొక్కారు. చెదురుతున్న సొంతింటి స్వప్నం గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఏడాదిగా ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇవ్వలేదు. కొత్తగా ఇళ్లు మంజూరు చేయలేదు. పేదల సొంతింటి స్వపాన్ని చిదిమేస్తున్నారు.నత్తనడకన సాగునీటి ప్రాజెక్టులు పోలవరం త్వరితగ­తిన పూర్తి చేస్తామ­ని, గాలేరు–­నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజ­ర్వాయర్, వంశధార–నాగావళి అను­సంధానం వంటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని.. ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకే కుదించి ఆ ప్రాజెక్టును బ్యారేజ్‌గా మార్చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. గాలేరు–నగరి ఆపేశారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు తగ్గించి లైనింగ్‌ చేస్తున్నారు. రూ.1400 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం శీతకన్ను వేసింది.బాదుడే బాదుడు ⇒ పెట్రోల్, డీజిల్‌ ధరలు నియంత్రి­స్తా­మ­న్న∙హామీ నిలుపు­కో­లే­దు. ⇒ మద్యం ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఊరూ­రా.. వాడవాడన బెల్ట్‌షాపులు వెలిశాయి. ⇒ రేషన్‌ పంపిణీ విధానాన్ని సమీక్షించి.. పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు అందించే ఎండీయూ వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లు రద్దు చేశారు. దాంతో ఎండీయూ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు 20 వేల మంది రోడ్డున పడ్డారు. రేషన్‌ కోసం దుకాణాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి తెచ్చారు.

Human-made hunger crisis in Gaza says UNRWA senior official explains8
గాజాలో... ఆకలి కేకలు!

గాజా: 2023 అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతంపై మెరుపుదాడి చేపట్టిన హమాస్‌ ఇతర జిహాదీలు 1,195 మందిని చంపేయడంతోపాటు 251 మందిని బందీలుగా పట్టుకుపోయారు. ఆ ఒక్క ఘటన..దశాబ్దాలుగా శరణార్థులుగా సొంత ప్రాంతంలోనే బతుకులీడుస్తున్న పాలస్తీనా ప్రజలను అత్యంత తీవ్రమైన కష్టాల్లోకి నెట్టివేసింది. శక్తివంతమైన ఇజ్రాయెల్‌ సైన్యం ఆ రోజు నుంచి గాజాపై యథేచ్ఛగా దాడులు సాగిస్తూ 50 వేల మందిని పొట్టనబెట్టుకోవడంతోపాటు సుమారు లక్షన్నర మందిని క్షతగాత్రులుగా మార్చేసింది. జిహాదీ గ్రూపులు బందీలను విడుదల చేయలేదనే సాకుతో గాజాను కొన్ని నెలలుగా పూర్తిగా దిగ్బంధంలో ఉంచింది. నీరు, ఆహారం, మందులు, ఇతర అత్యవసరాలను సైతం అందకుండా చేసింది. దీంతో ఈ ఆ ప్రాంతంలోని 22% మంది, 4.70 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అత్యంత కీలకమైన ఆస్పత్రులు, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆస్పత్రుల్లో వసతులు, మందులు కరువై సరైన వైద్యం అందక, మహిళలు, చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. మంచి నీరు, ఇంధన సరఫరాను సైతం నిలిపివేసింది. డీహైడ్రేషన్, డయేరియా, హెపటైటిస్‌ వంటి వాటితో జనం, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా ప్రాంతంలోని 90 శాతం నివాసాలను నేలమట్టం చేసి, నిలువ నీడ లేకుండా చేసింది. నేలమట్టమైన భవనాల శిథిలాలు, అపరిశుభ్రత మధ్యనే పాలస్తీనియన్లు భయంభయంగా బతుకుతున్నారు. ఐరాస సారథ్యంలో నడుస్తున్న ఆహార పంపిణీ కేంద్రాల నుంచి నిల్వలు హమాస్‌కు దారి మళ్లుతున్నాయని ఆరోపిస్తూ వాటిని ఇజ్రాయెల్‌ మూసివేయించింది. రెండు నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్‌ సారథ్యంలో ఆహార పంపిణీ కేంద్రాలు పరిమితంగా ఏర్పాటయ్యాయి. ఇక్కడ సైతం అన్నార్తులు తుపాకీ కాల్పులకు గురికాక తప్పడం లేదు. రోజూ పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ‘గాజాలో మానవీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే లక్షలాది మంది ఆకలి చావులకు గురికాక తప్పదు’అని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది. గాజా స్ట్రిప్‌లోని 20 లక్షల మంది ప్రజల ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఇజ్రాయెల్‌కు హితవు పలుకుతోంది. భూమిపై నరకం గాజా భూమిపై నరకం కంటే అధ్వానంగా గాజా ప్రాంతం తయారైందని ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ది రెడ్‌ క్రాస్‌ ప్రెసిడెంట్‌ మిర్జానా స్పోల్‌జరిక్‌ వ్యాఖ్యానించారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు, పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు, బందీలను వదిలిపెట్టేందుకు ప్రపంచ దేశాలు అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను పట్టించుకోవడం లేదు. పాలస్తీనియన్లకు కనీస మానవీయమైన గౌరవాన్ని కూడా ఇవ్వడం లేదు. గాజాలో చట్టపరమైన, నైతిక, మానవీయ ప్రమాణాల ఉల్లంఘన జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.

Sakshi Guest Column On War Situations9
ఇది దుస్సాహసాల యుగం

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగింది. కానీ అదంత తేలిక కాలేదు. ఇప్పటికీ తన లక్ష్యం సాధించలేక పోయింది. చైనాపై ఆధారపడటం అనివార్యమైంది. ఇటీవలి ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు దాన్ని మరీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే రష్యా ఏం ఓడలేదు. పైగా, 2022 ఫిబ్రవరి తర్వాత ఎన్నడూ లేనంత బలీయంగా ఇప్పుడు రూపొందింది. అంతర్జాతీయంగా రష్యాను ఏకాకి చేయాలన్న పథకం నీరుగారి పోయింది. ఈ పథక రచనలో ప్రధాన సూత్రధారి అమెరికా భంగపడింది. ఎలాగోలా రష్యాతో ఒప్పందం చేసుకోవాలని ఈ అగ్రరాజ్యం ఇప్పుడు అంగలారుస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌ భద్రత మీద, ఉక్రెయిన్‌ సార్వభౌమికత మీద చేస్తున్న వ్యయం తగ్గించుకోవాలని భావిస్తోంది. యుద్ధం ద్వారా కాకుండా దౌత్యంతోనే ఈ ఊబి నుంచి బయటపడాలనుకుంటోంది.రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇందుకు ససేమిరా అన్నా ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. ‘దుస్సాహసం ఫలిస్తుంది’ అన్నది పుతిన్‌ తన అనుభవాల నుంచి నేర్చుకున్నపాఠం. ఒక దేశం మీద దండెత్తాడు. ఇప్పటిదాకా నెగ్గుకొచ్చాడు. మరింత ఉక్రెయిన్‌ భూభాగంపై పట్టు సాధించగలనన్న, తద్వారా తన విదేశాంగ విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి రష్యాకు సమకూరుతుందన్న, తూర్పు మధ్య యూరప్‌ ప్రాంతాల భద్రతకు ఢోకా ఉండదన్న ఆలోచన ఇలాగే కొనసాగవల్సిందిగా పుతిన్‌ను పురిగొల్పి ఉంటుంది. దుస్సాహసం ఫలిస్తుంది!గాజా మీద ఇజ్రాయెల్‌ దురాక్రమణకు దిగింది. హమాస్‌ టెర్రరిజం ప్రస్తుత సంక్షోభానికి పురిగొల్పింది అనడంలో సందేహం లేదు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ మితిమీరి ప్రతిస్పందించింది. అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోయింది. ఇజ్రాయెల్‌ అంటే అదో జాతి నిర్మూలన శక్తి అని ప్రపంచవ్యాప్తంగా ఒక తరం మనస్సులో శాశ్వతంగా ముద్ర పడింది. ఈ దాడి ఆ దేశ వనరులను హరించివేసింది. పొరుగున ఉన్న అరబ్బు దేశాలతో సాధారణ సంబంధాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇజ్రాయెల్‌ దీర్ఘకాలిక భద్రత కూడా ప్రమాదంలో పడినట్లే!అయితే ఇజ్రాయెల్‌ ఏం ఓడలేదు. ఆ దేశపు దూరదృష్టి లేని వ్యూహకర్తలు కోణం నుంచి చూస్తే, హమాస్‌ నాయకత్వాన్ని తుదముట్టించడంతో పాటు వారి సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్‌ ఈ పోరులో విజయం సాధించింది. హెజ్బొల్లా నాయకత్వాన్ని, సైనిక సదుపాయాలను నిర్మూలించి, లెబనాన్‌ పాలనలో మార్పు తెచ్చింది. సిరియా ప్రభుత్వ మార్పుకు పరోక్షంగా దోహదపడింది. నెతన్యాహూ ఇలాగే ముందుకు సాగి ఇరాన్‌ మీద దాడి చేశాడంటే అందులో ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు తీర్చిదిద్దుతాయి. పుతిన్‌ అనుకున్నట్లే, నెతన్యాహూకు కూడా అతడి అనుభవం పాఠం నేర్పింది. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను అన్నింటినీ ఉల్లంఘించాడు. యుద్ధఖైదీ అభియోగం మోపి అరెస్టు చేయాలన్న ఇంటర్నేషనల్‌ వారెంటును పట్టించుకోలేదు. పాలస్తీనా కలలను చిదిమివేసిన అనుభవమే మరో దేశంపై దండెత్తడానికి, ఆ దేశ అణుశక్తి కార్యక్రమాలను వమ్ము చేయడానికి, అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నెతన్యాహూను పురిగొల్పి ఉంటుంది.ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోయినా...వీగర్ల స్వయంప్రతిపత్తి ప్రాంతమైన షిన్జియాంగ్‌ను చైనా జైలుగా మార్చేసింది. టిబెట్‌లో జనాభా స్వరూప స్వభావాలను మార్చింది. హాంకాంగ్‌ను హస్తగతం చేసుకుని రెండు వ్యవస్థల విధానాన్ని అమలు చేస్తామన్న చట్టబద్ధ హామీని విస్మరించింది. సౌత్‌ చైనా సముద్రంలోని ద్వీపాలను సైనిక స్థావరాలుగా చేసుకుంది. తన సరిహద్దుల వెలుపల తైవాన్‌తోపాటు, ఇతర తూర్పు ఆసియా దేశాల్లో పరోక్ష అధికారం చలాయిస్తోంది. ఇవేవీ కూడా ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోవచ్చు. కానీ ఇవన్నీ కలిపి చూస్తే, తన ఆధిపత్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయి చివరకు పూర్తిగా కబళించివేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ చర్యలతో చైనా ప్రతిష్ఠ మసకబారింది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు వీలుగా పలు దేశాలు కూటములుగా జట్టు కట్టేందుకు, చైనా వస్తు సరఫరాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పరిస్థితికి దారితీసింది. అయినా చైనా ఏం ఓడలేదు. వాస్తవానికి, తన ఆక్రమణలు అన్నిటినీ ‘న్యూ నార్మల్‌’గా మార్చేయగలిగింది. సాగర జలాల్లో తన అధికార ప్రదర్శనను కొనసాగించగలనని, లేదా తైవాన్‌ను ఆక్రమించుకోగలనని జిన్‌పింగ్‌ అనుకుంటే అందులో ఆశ్యర్యపడేదేం లేదు. ఒక మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే జిన్‌పింగ్‌ కూడా అనుభవాల నుంచి పాఠం నేర్చుకున్నాడు. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. ఆయన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనాను హస్తగతం చేసుకున్నాడు. దేశానికి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ప్రత్యర్థులను అణచివేయడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమాలను ఉపయోగించుకున్నాడు. హిమాలయాల్లో కానీ, సాగరాల్లో కానీ, పసిఫిక్‌ లేదా యూరేషియాలో కానీ ఇలాగే ముందుకు సాగాలని ఈ అనుభవమే జిన్‌పింగ్‌ను పురిగొల్పి ఉంటుంది. ఉగ్రవాద దుస్సాహసంఏప్రిల్‌ 22న పాకిస్తాన్‌ తైనాతీలు మరోసారి ఇండియాపై పహల్‌గామ్‌లో ఉగ్రదాడికి తెగబడ్డారు. అలాంటి ఘటన, దాని పర్యవసానాలు... టెర్రరిజం ఎగుమతుల కేంద్రంగా పాకిస్తాన్‌ పొందిన గుర్తింపును ఇంకా బలపరిచాయి. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని మరింత కుంగదీశాయి. సైనిక పరంగా పాకిస్తాన్‌ బలహీనతలను బహిర్గత పరచాయి. దేశ సౌభాగ్యానికి అవసరమైన ప్రాదేశిక సమగ్రతను మరింత దూరం చేశాయి.అయితే తాను ఓడిపోయానని పాకిస్తాన్‌ అనుకోవడం లేదు. పైగా, రావల్పిండిలోని మిలిటరీ జనరళ్ల దృష్టిలో పాకిస్తాన్‌ గెలిచింది. తామే తప్పూ చేయడం లేదన్న యుద్ధోన్మాద ధోరణి ఇకమీదటా చెల్లిపోతుందని ఫీల్డ్‌ మార్షల్‌ అసీమ్‌ మునీర్‌ అనుకుంటే అందులో ఆశ్చర్యపడేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. జిన్‌పింగ్, పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే, తన అనుభవాలు అతడికి పాఠం నేర్పాయి. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. మునీర్‌ ద్వేషం రగిల్చే ప్రసంగాలు చేశాడు. ఉగ్రవాద తైనాతీలను ప్రోత్సహించాడు. ప్రత్యర్థిని సైనిక ఘర్షణలోకి దించాడు. అంతర్జాతీయ పాత్ర కోసం అభ్యర్థన చేశాడు. కాల్పుల విరమణను విజయంగా ప్రకటించుకున్నాడు. కొన్ని తరాల ప్రజలను శోకంతో తపించేలా చేసినా, పాకిస్తాన్‌కు కావల్సిన ప్రచారాన్ని, ప్రజల్లో చీలికను సాధించిపెట్టిన ఇలాంటి ఉగ్రదాడులతోనే ముందుకుసాగేందుకు మునీర్‌ను అతడి అనుభవం పురిగొల్పవచ్చు. మరో దేశం మీద దండెత్తడం, ప్రజలను ఆకలితో అలమటింపజేయడం దుస్సాహసం (అడ్వెంచరిజమ్‌) అవుతుంది. టెర్రరిజానికి ఆశ్రయం ఇవ్వడం లేదా మరొకరి భూభాగాన్ని కైవసం చేసుకోవడం దుస్సాహసం అవుతుంది. అన్ని అంతర్జాతీయ నియమాలనూ, చట్టాలనూ ఉల్లంఘించడం, ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను తిరస్కరించడం దుస్సాహసం అవుతుంది. మానవ సమాజాలు ఏర్పడినప్పటి నుంచీ దుస్సాహసం ఉంది. దీన్ని అడ్డుకునేది చట్టం, ఆచారం, స్వీయ నిగ్రహం... ఇవేవీ కావు. విఫలమవుతామన్న భయం, అందుకు చెల్లించాల్సిన మూల్యం మాత్రమే దుస్సాహసాన్ని అడ్డుకోగలవు. విషాదం ఏమిటంటే, ఇప్పుడు ఈ వైఫల్యభీతి అంతరించింది. అడ్వెంచరిజం ఫలించే యుగం ఇది.ప్రశాంత్‌ ఝా వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, పొలిటికల్‌ ఎనలిస్ట్‌(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

ENG Vs IND: Jasprit Bumrah Wrecks England With 5 Wickets10
అటా...ఇటా!

ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోరుకు అతి చేరువగా వచ్చింది. బ్రూక్‌ బాదుడుకు లోయర్‌ ఆర్డర్‌ సహకారం తోడవడంతో కేవలం 6 పరుగుల వెనుకబడిన ఇంగ్లండ్‌ పోటీలోకి రాగా... రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ రాణించడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమంగానే ఉన్నా... నాలుగో రోజు భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారన్నది కీలకంగా మారింది. సొంతగడ్డపై దంచికొట్టే అలవాటు ఉన్న ఇంగ్లండ్‌ ముందు ఎంత లక్ష్యం నిర్దేశించినా సురక్షితం కాదనే విశ్లేషణల మధ్య... టీమిండియా సోమవారం పూర్తిగా బ్యాటింగ్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! లీడ్స్‌: భారత్, ఇంగ్లండ్‌ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్‌ (4) త్వరగానే అవుటైనా... కేఎల్‌ రాహుల్‌ (75 బంతుల్లో 47 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), సాయి సుదర్శన్‌ (48 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా 96 పరుగుల ముందంజలో ఉంది.రాహుల్‌తో పాటు కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 209/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌... చివరకు 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్‌ (137 బంతుల్లో 106; 14 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... హ్యారీ బ్రూక్‌ (112 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌ జట్టు... టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 6 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... ప్రసిధ్‌ కృష్ణ 3, మొహమ్మద్‌ సిరాజ్‌ 2 వికెట్లు తీశారు. జైస్వాల్‌ 4 పరుగులకే... తొలి ఇన్నింగ్స్‌లో చక్కటి సెంచరీ చేసిన జైస్వాల్‌... రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఫీల్డింగ్‌లో మూడు క్యాచ్‌లు వదిలేయడంతో నెలకొన్న ఒత్తిడి అతడి ఆటతీరులో కనిపించింది. కార్స్‌ వేసిన నాలుగో ఓవర్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి భారంగా పెవిలియన్‌కు వెనుదిరిగాడు. ఈ దశలో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్‌తో కలిసి రాహుల్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లు భారీ షాట్లతో రెచ్చిపోయిన పిచ్‌పై రాహుల్‌ సంయమనం పాటించాడు. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్‌ వెనుదిరగగా... కెపె్టన్‌ గిల్‌తో కలిసి రాహుల్‌ మరో వికెట్‌ పడకుండా రోజును ముగించాడు. వర్షం కారణంగా ఆట నిర్ణిత సమయం కంటే ముందే ముగిసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో కార్స్, స్టోక్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. బ్రూక్‌... పరుగు తేడాతో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మూడో రోజు ఇంగ్లండ్‌ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ‘సెంచరీ హీరో’ ఓలీ పోప్‌ క్రితం రోజు స్కోరుకు మరో 6 పరుగులు మాత్రమే జత చేసి వెనుదిరగగా... కెపె్టన్‌ బెన్‌ స్టోక్స్‌ (52 బంతుల్లో 20; 3 ఫోర్లు)ను సిరాజ్‌ అవుట్‌ చేశాడు. ఇక ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టుదు అనుకుంటే... లోయర్‌ ఆర్డర్‌తో కలిసి హ్యారీ బ్రూక్‌ చెలరేగిపోయాడు. ధనాధన్‌ షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. వికెట్‌ కీపర్‌ జేమీ స్మిత్‌ (52 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌), క్రిస్‌ వోక్స్‌ (55 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.తొలి సెషన్‌లో 28 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌ 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగా... రెండో సెషన్‌లో 23.4 ఓవర్లలోనే 138 పరుగులు చేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటలో బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయినా... ఆ బంతి నోబాల్‌ కావడంతో బతికిపోయిన బ్రూక్‌కు... మూడో రోజు మరో రెండు అవకాశాలు లభించాయి. వాటిని వినియోగించుకున్న అతడు భారత్‌ ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. శతకానికి ఒక పరుగు దూరంలో ప్రసిధ్‌ కృష్ణ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతికి బ్రూక్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కార్స్‌ (23 బంతుల్లో 22; 4 ఫోర్లు), వోక్స్, టంగ్‌ (18 బంతుల్లో 11; 2 ఫోర్లు) విలువైన పరుగులు చేసి టీమిండియా ఆధిక్యాన్ని 6 పరుగులకు పరిమితం చేశారు.అదే తంతు..ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్‌ మరీ పేలవంగా సాగింది. రెండో రోజు బుమ్రా బౌలింగ్‌లోనే మన ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు జారవిడవగా... మూడో రోజు మరో రెండు క్యాచ్‌లు నేల పాలయ్యాయి. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో బ్రూక్‌ ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ అందుకోలేకపోగా... 82 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో బ్రూక్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను జైస్వాల్‌ జారవిడిచాడు. ఒక ఎండ్‌లో బుమ్రా ఒత్తిడి పెంచుతున్నా... మరో ఎండ్‌ నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు.దీనిపై మాజీ ఆటగాళ్లు కూడా మండిపడగా... షార్ట్‌ బాల్స్‌తో వికెట్లు తీసిన ప్రసిధ్‌ కృష్ణ పరుగుల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాడు. 20 ఓవర్లు వేసిన అతడు 128 పరుగులు సమరి్పంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ బ్యాటర్ల మీద ఒత్తిడి కొనసాగలేకపోయింది. దీనికి తోడు తొలి టెస్టులో కెపె్టన్సీ చేస్తున్న గిల్‌ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఇంగ్లండ్‌కు సాయపడ్డాడు.టెయిలెండర్లు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బుమ్రాను రంగంలోకి దింపి ఆధిక్యం పెంచుకోవాల్సింది పోయి... జడేజాకు బంతి అప్పగించి ఇంగ్లండ్‌ మరికొన్ని పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. ఎట్టకేలకు రెండో సెషన్‌ చివర్లో బంతి అందుకున్న బుమ్రా వరుస ఓవర్లలో వోక్స్, టంగ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌కు తెరదింపాడు. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 14వసారి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 471; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) నాయర్‌ (బి) బుమ్రా 4; డకెట్‌ (బి) బుమ్రా 62; పోప్‌ (సి) పంత్‌ (బి) ప్రసిధ్‌ 106; రూట్‌ (సి) నాయర్‌ (బి) బుమ్రా 28; బ్రూక్‌ (సి) శార్దుల్‌ (బి) ప్రసిధ్‌ 99; స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 20; జేమీ స్మిత్‌ (సి) సుదర్శన్‌ (బి) ప్రసిధ్‌ 40; వోక్స్‌ (బి) బుమ్రా 38; కార్స్‌ (బి) సిరాజ్‌ 22; టంగ్‌ (బి) బుమ్రా 11; బషీర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 34; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్‌) 465.వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206, 4–225, 5–276, 6–349, 7–398, 8–453, 9–460, 10–465.బౌలింగ్‌: బుమ్రా 24.4–5–83–5; సిరాజ్‌ 27–0 –122–2; ప్రసిధ్‌ 20–0–128–3; జడేజా 23–4–68–0; శార్దుల్‌ 6–0–38–0. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) కార్స్‌ 4; రాహుల్‌ (బ్యాటింగ్‌) 47; సుదర్శన్‌ (సి) క్రాలీ (బి) స్టోక్స్‌ 30; గిల్‌ (బ్యాటింగ్‌) 6; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (23.5 ఓవర్లలో 2 వికెట్లకు) 90.వికెట్ల పతనం: 1–16, 2–82.బౌలింగ్‌: వోక్స్‌ 6–2– 18–0; కార్స్‌ 5–0–27–1; టంగ్‌ 5–0–15–0; బషీర్‌ 2.5–1– 11–0; స్టోక్స్‌ 5–1–18–1.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement