union budget 2024
ప్రధాన వార్తలు
సాఫ్ట్వేర్ బూమ్ మళ్లీ వస్తుందా?
దేశంలో 90ల నాటి సాఫ్ట్వేర్ బూమ్ మళ్లీ వస్తుందా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ మార్కెట్ వేత్త, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు రామ్దేవ్ అగర్వాల్. కేంద్ర బడ్జెట్ 2026ను ఆయన “భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు మాస్టర్ స్ట్రోక్”గా అభివర్ణించారు. 2047 వరకు డేటా సెంటర్లకు 100% ట్యాక్స్ హాలిడే (పన్ను రహితం) అందించే విధాన నిర్ణయాన్ని ఆయన “1,000 పౌండ్ల గొరిల్లా” (అత్యంత శక్తివంతమైన) తరహా నిర్ణయంగా పేర్కొన్నారు.ప్రస్తుత డిజిటల్ పురోగతిని 1990ల సాఫ్ట్వేర్ బూమ్తో పోలుస్తూ.. “మనం ఇప్పటికే ఏఐ(AI)ని స్వీకరించాం. ఇప్పుడు ‘ఏఐ ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్’ను నిర్మిస్తున్నాం. విద్యుత్, కేబుల్స్, మౌలిక సదుపాయాల్లో భారీ మూలధనం పెట్టుబడి పెడుతున్నాం” అని రామ్దేవ్ అగర్వాల్ తెలిపారు.మరోవైపు కేంద్ర బడ్జెట్ 2026లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెరగడం వల్ల సమీప కాలంలో మార్కెట్లకు హెడ్విండ్స్ ఉన్నాయని అంగీకరించారు. అయితే దేశ దీర్ఘకాలిక ఆదాయ కథ బలంగా కొనసాగుతోందని రామ్దేవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. “4.3% ద్రవ్యలోటు లక్ష్యం, రూ.12.2 లక్షల కోట్ల క్యాపెక్స్ పుష్తో, దీర్ఘకాలంలో భారతదేశమే నిజమైన విజేత” అని ఆయన పేర్కొన్నారు.బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ఫ్యూచర్స్పై ఎస్టీటీ 0.02% నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్ ప్రీమియంపై 0.10% నుంచి 0.15%కి పెరిగింది. అలాగే ఆప్షన్ ఎక్సర్సైజ్పై పన్ను 0.125% నుంచి 0.15 శాతానికి ఎగిసింది. ఈ చర్యలు స్వల్పకాలిక ట్రేడింగ్ కార్యకలాపాలను తగ్గించవచ్చని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.ఇది చదివారా? వర్క్ ఫ్రమ్ హోమ్.. కొత్త కండీషన్బడ్జెట్లోని సూక్ష్మ అంశాలు కూడా అంతే ప్రాధాన్యత కలవని ఆయన అన్నారు. ఐటీ సేవల నిర్వచనాన్ని విస్తరించడం వల్ల గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు (GCC) బదిలీ ధరలపై స్పష్టత లభించిందని, ఇది హైఎండ్ టెక్నాలజీ వ్యాపారాలకు భారత్ స్వాగతం పలుకుతోందనే బలమైన సంకేతం అని పేర్కొన్నారు.
తమిళనాడు సంస్కృతి పరిరక్షణకు..
డీఎంకే ఏలుబడిలో ఉన్న తమిళనాడుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా అరుదైన ఖనిజాల రవాణా కారిడార్ను నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీంతోపాటు చెన్నై మీదుగా పయనించే హైస్పీడ్ రైలు లింక్లను అభివృద్ధిచేయనున్నారు. పశ్చిమ కనుమల మార్గంలో పొధుగైమలై కొండ ప్రాంతంలో హైకింగ్, ట్రెక్కింగ్, మౌంటేన్ బైకింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు.పులికాట్ సరస్సుకు విచ్చేసే విదేశీ పక్షుల కోలాహలం, ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించేందుకు బర్డ్ వాచింగ్ పాయింట్లను నిర్మించనున్నారు. త్వరలో తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాల నిధులను భారీగా కేటాయించడం విశేషం. ఇనుప రాతి యుగం నాటి ప్రఖ్యాత ఆదిచనల్లూర్ ప్రాంతంలో పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ లభించిన పురాతన రాళ్లు, ఆనాటి నాగరికత వైభవాన్ని చాటే వస్తువులతో ఆర్కియాలాజికల్ సైట్ను అభివృద్ధిచేయనున్నారు.నాటి సంస్కృతికి కళ్లకు కట్టేలా అభివృద్ధి చేస్తామని ఆమె వెల్లడించారు. నడకదారిలో మొత్తం పురాతత్వ ప్రాంతాన్ని కలియతిరిగేలా వాక్వేలను నిర్మించనున్నారు. అక్కడి ప్రాచీన వస్తు వుల విశిష్టతను కథల రూపంలో చెప్పే లా, నాటి సాంకేతికతలను విడమర్చి విశదీకరించేలా గైడ్లను అందుబాటు లోకి తేనున్నారు. పాడైన ప్రాచీన వస్తు వులకు మరమ్మతులు, సంరక్షణ కోసం కన్జర్వేటివ్ ల్యాబ్ను ఏర్పాటు చేయ నున్నారు.పురాతత్వ ప్రాంతానికి విచ్చేసే పర్యా టకులు, విదేశీ సందర్శకుల్లో ఆ ప్రాంతంపై మరింత అవగాహన పెంచేలా ఎగ్జిబిషన్ల వంటివి ఏర్పా టుచేయనున్నారు. ‘అత్యంత అరుదైన మూలకాల కోసం ఖనిజాల తవ్వకం కోసం తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్ను ఏర్పాటుచేయబోతున్నాం. ఖనిజాల శుద్ధి, పరిశోధన, తయారీని మరింతగా ప్రోత్సహిస్తాం’ అని మంత్రి నిర్మల అన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
బెంగాల్కు కొత్తగా సరుకు రవాణా కారిడార్
పశ్చిమబెంగాల్, గుజరాత్ మధ్య వేగవంతమైన సరుకు రవాణా లక్ష్యంగా సరికొత్త కారిడార్ను ఆర్థికమంత్రి నిర్మల ఆదివారం బడ్జెట్లో ప్రతిపాదించారు. ‘సమీకృత ఈశాన్య భారత పారిశ్రామిక కారిడార్’లో భాగంగా పశ్చిమబెంగాల్లోని డంకునీ నుంచి గుజరాత్లోని సూరత్కు నూతన సరుకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల ప్రకటించారు. బెంగాల్లోని దుర్గాపూర్ కేంద్రంగా ఈ కారిడార్ను విస్తరిస్తామని చెప్పారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పర్యాటక పథకమైన ‘పూర్వోదయ విజన్’లో భాగంగా మరింత అభివృద్ధి చేస్తామని నిర్మల వెల్లడించారు.డంకునీ సూరత్ ఫ్రీట్ కారిడార్ అనేది పర్యావరణ అనుకూలమైనదేకాకుండా ఇరు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా ఖర్చులనూ భారీగా తగ్గిస్తుందని నిర్మల పేర్కొన్నారు. నదీజల మార్గాల గుండా జరిగే సరకు రవాణాను సమీకృత కారిడార్లతో అనుసంధానించి బెంగాల్ పారిశ్రామికాభివృద్ధిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని నిర్మల తెలిపారు. 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి మరో మూడునెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ బెంగాల్కు మోదీ సర్కార్ వరాల జల్లు కురిపించడం గమనార్హం.పూర్వోదయ రాష్ట్రాలుగా పిలుచుకునే బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ఆమె తెలిపారు. 4,000 ఎలక్ట్రిక్ బస్సుల అందజేతతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉపాధి పెంపు, ఆయా రాష్ట్రాల మధ్య జనం, వస్తూత్పత్తుల రవాణాపై దృష్టిపెట్టామని ఆమె వెల్లడించారు.విమర్శించిన తృణమూల్ కాంగ్రెస్రాష్ట్రానికి కొత్తగా సరుకు రవాణా కారిడార్ తెస్తామన్న నిర్మల నిర్ణయంపై బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ‘పాత ప్రతిపాదనలకే కొత్త తాయిలాల పొట్లంలో కట్టి ఇస్తున్నారు. నిధుల మంజూరును గాలికొదిలేసి కేవలం కాగితాలకు పరిమితమయ్యే వాగ్దానాలు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల ఎత్తుగడ. గత ఐదేళ్లుగా ఇదే చూస్తున్నాం.బెంగాల్కు మోదీ సర్కార్ కేంద్రనిధులపై శ్వేతపత్రం జారీచేసే దమ్ముందా? 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక్క కూలీకి అయినా ప్రత్యక్ష బదిలీ పథకం(ఈబీటీ) ద్వారా నగదు ఇచ్చినట్లు రుజువుచేస్తే రాజకీయ సన్యాసం చేస్తా’ అని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు.ఎన్నికల వ్యూహంగా అభివర్ణించిన విశ్లేషకులుఅభివృద్ధి అని చెబుతున్నా వాస్తవానికి తాజా కేటాయింపులు కేవలం ఎన్నికల ఎత్తు గడగా భావించవచ్చని ఎన్నికల వ్యూహకర్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీ భారీ కేటాయింపులు చేస్తోందని వారు వ్యాఖ్యానించారు. ‘‘ ఎన్నికలున్న రాష్ట్రాలకు బడ్జెట్లో భారీ వడ్డనలు ఉండటం ఇటీవలికాలంలో ఒక సంప్రదాయంగా మారింది. ఈ కేటాయింపులు వాస్తవాలో కాదో గుర్తెరిగి తదుపరి ఎన్నికల్లో ఓటేసే స్పృహ ఓటర్లకు ఉండాల్సిందే’’ అని చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్
కొత్త ఆదాయపు పన్ను.. జీఎస్టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాలు చూస్తున్న వీక్షకులంతా... బడ్జెట్ కూడా ఈ వారంలో మొదలయ్యే టి–20 వరల్డ్కప్ మ్యాచ్లా ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్ప్లేకి రెడీ అయిపోయారు. కానీ... కెప్టెన్ మోదీ తమది టి–20 ధనాధన్ కాదని.. సుదీర్ఘ టెస్ట్ ఇన్నింగ్స్తోనే అనుకున్న వృద్ధిని సాధిస్తామని సంకేతాలిచ్చారు. తమ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఫుల్గార్డ్తో పంపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని సాధిస్తామంటూ రెండు దశాబ్దాల తరువాతి లక్ష్యాన్ని ఆవిష్కరించారు. ఆ దిశగా టెస్ట్ ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టారు. వీరబాదుడు లేదు.. రిస్కీ షాట్లు లేనే లేవు. బౌండరీలు, సిక్సర్లు అస్సలే లేవు. ప్రతి బంతినీ పద్ధతిగా ఆడుతూ సింగిల్స్కు పరిమితమయ్యారు. సునీల్ గవాస్కర్ను మరిపించారు. కళ్లు చెదిరే షాట్లు అక్కర్లేదు... క్రీజ్లో ఉంటే చాలనే స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా కెప్టెన్ నరేంద్ర మోదీ చెప్పింది ఒక్కటే.. ‘నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్... ఇది లాంగ్టర్మ్ ఇన్నింగ్స్’’.ఇన్కమ్ట్యాక్స్ పిచ్ ఏమాత్రం మారలేదు. అవే శ్లాబ్స్. కాకపోతే టీసీఎస్, టీడీఎస్ విషయాల్లో చిన్నచిన్న ఉపశమనాలిచ్చారు. ఎన్నారైలు, ఫారిన్ అసెట్స్కు సంబంధించి పాత తప్పులు దిద్దుకోవటానికి కొన్ని ఫ్రీహిట్స్ ఇచ్చారు. వన్టైమ్ డిస్క్లోజర్ అనేది ఓ వారి్నంగ్. అంటే... నోబాల్గా ప్రకటించిన క్లీన్బౌల్డ్ అన్నమాట. 7 రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచటం... 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు అంటూ మోదీ ‘7’వ నంబర్లో వచ్చే ధోనీ, కపిల్ వంటి కెప్టెన్ల స్థాయిని కళ్లకు కట్టారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, బయోఫార్మా శక్తి, కెమికల్ పార్కులు, రేర్ ఎర్త్ కారిడార్లు, కంటైనర్ తయారీ, ఎల్రక్టానిక్ కాంపోనెంట్ల తయారీ వంటి పథకాలన్నీ మున్ముందు స్కోర్బోర్డును ముందుకు తీసుకెళ్లబోయే షాట్లు. ఇన్ని ఒత్తిళ్ల నడుమ... ద్రవ్య లోటును 4.3 శాతానికే పరిమితం చేస్తామంటూ... సింగిల్స్తోనైనా రన్రేటు మాత్రం పడిపోకుండా చూసుకున్నారు. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే... ఎస్టీటీ రూపంలో మోదీ ప్రభుత్వం ఓ బౌన్సర్ వేసింది. ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలి కనక స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్నును 150 శాతం, ఆప్షన్లపై 50 శాతం పెంచారు. మార్కెట్లకిది నచ్చలేదు. బంతిని బలంగానే కొట్టాయి. ప్రస్తుతానికైతే బంతి గాల్లోకి లేచి మార్కెట్లు పడ్డాయి. అది క్యాచో కాదో మున్ముందు తెలుస్తుంది. ఇవీ చదవండి:రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్అదే పిచ్.. కాస్త రిలీఫ్ఖనిజ సంపదకు కారిడార్ వెలుగులునిధుల సిక్సర్విలేజ్.. విన్నర్
కూ.. చుక్చుక్! ష్.. గప్చుప్
కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తీపి చేదులను తలపించింది. గ్రేటర్ నగరానికి కొంత మోదం.. కాసింత ఖేదం అనే పరిస్థితిని ప్రతిబింబించింది. జీహెచ్ఎంసీ గతంలో కోరిన రూ.10,500 కోట్లతో పాటు కొత్తగా ఆశించిన రూ.719 కోట్లకు అతీగతీ లేకుండాపోయింది. మెట్రో రెండో దశకు మొండిచేయి చూపించింది. కేంద్ర బడ్జెట్లో దీని ప్రస్తావనే లేకుండాపోయింది. రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించకపోవడంతో నగర వాసిని నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారులకు రుణాలు అందజేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో నగర వీధి వ్యాపారులకు ఊరటనిచ్చింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా మూడు కార్పొరేషన్లుగా మారనున్న గ్రేటర్కు ప్రయోజనం కలగనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణె, చెన్నై నగరాలకు హైస్పీడ్ కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. జలమండలి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆర్థిక భరోసా లభించింది. బ్యాటరీల ధరలు తగ్గనుండటంతో గ్రేటర్లో ఈవీల విక్రయాలు భారీగా పెరగనున్నట్లు అంచనా. క్యాన్సర్, మధుమేహం తదితర దీర్ఘకాలిక రోగులకు సంబంధించి 17 రకాల ఔషధాల ధరలు తగ్గనుండటంతో నగరంలోని సుమారు 30 లక్షల బాధితులకు మేలు ఒనగూరనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణె, చెన్నై నగరాలకు హైస్పీడ్ కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. రైళ్ల వేగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రయాణం సమయం 12 గంటలకు పైగా ఉంది. ప్రస్తుతం చార్మినార్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 6 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరితే చెన్నైకి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్– బెంగళూర్, హైదరాబాద్– పుణె నగరాల మధ్య ప్రయాణ సమయం 8 గంటలకు పైగా ఉంది. ఈ మూడు రూట్లలో హైస్పీడ్ కారిడార్లను నిర్మిస్తే ప్రయాణ సమయం సగానికి తగ్గే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాటరీల ధరలు తగ్గనున్న నేపథ్యంలో గ్రేటర్లో ఈవీల విక్రయాలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే నగరంలో 2.5 లక్షలకుపైగా అన్ని రకాల ఈవీలు టాప్గేర్లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా బ్యాటరీల ధరలు తగ్గితే వీటి అమ్మకాలు ఊపందుకోనున్నాయి. సాధారణంగా ఈవీలను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ బ్యాటరీల ధరలు, అరకొర విద్యుత్ చార్జింగ్ సదుపాయంతో వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాటరీ ధరల తగ్గింపు కొంత మేరకు ప్రోత్సాహకంగా ఉంటుంది. బైక్లపై గరిష్టంగా రూ.10 వేలు, కార్లు, ఇతర వాహనాలపై రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ధరలు తగ్గే అవకాశాలున్నాయి. నగరంలో ప్రస్తుతం 2.05 లక్షల ద్విచక్ర వాహనాలు, మరో 45 వేలకు పైగా కార్లు, ఆటోలు, కమర్షియల్ వాహనాలున్నట్లు అంచనా. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనున్నాయి. మెట్రోకు మొండిచేయి.. జీహెచ్ఎంసీకి నిరాశహైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం మొండి చేయి చూపించింది. కేంద్ర బడ్జెట్లో దీని ప్రస్తావనే లేకుండాపోయింది. రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత బడ్జెట్లో ఎలాంటి నిధుల కేటాయింపులు జరగలేదు. రెండో దశలో చేపట్టనున్న 76.4 కి.మీ మొదటి 5 లేన్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ‘బి’ విభాగం కింద మూడు మార్గాల్లో నిర్మించనున్న 86.1 కి.మీ.కారిడార్లకు మరో రూ.19,759 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఇప్పటికే చెన్నై, పుణె, ఢిల్లీ నగరాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం సముచితమైన ప్రోత్సాహాన్ని, తన వాటా నిధులను అందజేస్తోంది. హైదరాబాద్ మెట్రోపై ఎందుకో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని 10,050 చ.కి.మీ.పరిధిలో రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.4,5000 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకూ కేంద్రం స్పందించలేదు. కేంద్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ ఆశ నెరవేరలేదు. గతంలో కోరిన రూ.10,500 కోట్లు.. కొత్తగా ఆశించిన రూ.719 కోట్ల అంశం బడ్జెట్ కాపీలో కనిపించలేదు. ఆర్థిక సంఘం నిధులు, గృహనిర్మాణాల కింద అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.జలమండలికి భరోసాకేంద్ర బడ్జెట్లో నీటి సరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థల బలోపేతానికి పెద్దపీట వేయడంతో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు (జలమండలి) ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆర్థిక భరోసా లభించింది. జల్ జీవన్ మిషన్ పొడిగింపుతో పాటు అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించడం జలమండలికి ఊరటనిచ్చే అంశం. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్య రంగాల కోసం కేంద్రం ప్రకటించిన కొత్త నిధి, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకమైన ‘ఆర్థిక ఊతం’గా మారనుంది. అమృత్ 2.0 పథకం కింద నగరంలో కొత్తగా చేపట్టే మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణానికి నిధులు అందనున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) ద్వారా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఎస్టీపీలకు కూడా కేంద్రం చేయూత లభించనుంది. మరోవైపు, వర్షాకాలంలో నగరాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు ప్రతిపాదించిన ‘సమీకృత స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టు’కు సైతం ఈ నిధుల నుంచి వాటా దక్కే అవకాశం ఉంది. అలాగే ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ జలమండలికి వరంగా మారనుంది. నగరంలో తాగునీటి నెట్వర్క్ విస్తరణ, పారిశుద్ధ్య వ్యవస్థల ఆధునికీకరణ పనులు వేగవంతం కానున్నాయి.వీధి వ్యాపారుల్లో ఆశ పీఎం స్వనిధి స్కీం పొడిగింపు ద్వారా గ్రేటర్లోని వీధి వ్యాపారులకు తొలి విడత రూ.15వేలు, రెండో విడత రూ.25 వేలు, మూడో విడత రూ.50వేలు రుణాలిస్తారు. నిరీ్ణత వ్యవధిలో చెల్లించే వారికి సబ్సిడీ ఉంటుంది. సకాలంలో రెండో విడత చెల్లించిన వారికి రూ. 30వేల పరిమితి వరకు క్రెడిట్ కారులిస్తారు. వడ్డీ లేకుండా అత్యవసరంలో ఉపయోగపడుతుంది. రూ.లక్ష కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా మూడు కార్పొరేషన్లుగా మారనున్న గ్రేటర్కు ప్రయోజనం కలిగేందుకు అవకాశం ఉంది. తగ్గనున్న ఔషధ ధరలు.. 30 లక్షల మందికి మేలుక్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగులు వినియోగించే 17 రకాల ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఫలితంగా నగరంలో సుమారు 30 లక్షల బాధితులకు మేలు ఒనగూరనుంది. నగరంలో 1.5 కోట్ల జనాభా ఉండగా.. ఇందులో సుమారు 21 శాతం మంది మధుమేహులున్నట్లు అంచనా. నగరంలోని ప్రముఖ కేన్సర్ ఆసుపత్రి ఎంఎన్జేకు ఏటా పది వేల మంది కొత్త రోగులు వస్తున్నారు. అదే సమయంలో ఏటా మరో 1.10 లక్షల మందికి ఫాలోఅప్ చికిత్సలు అందుతున్నాయి. ఇతర ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకుంటున్న వారు ఈ సంఖ్యకు అదనం. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. చికిత్సల అనంతరం రెగ్యులర్ ఫాలోఅప్లో భాగంగా నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ, బీమా వంటివి ఉంటే ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో ఔషధ ధరలు తగ్గించడం వల్ల రోగులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగే అవకాశముంది. ఎంతో ప్రోత్సాహకరంబ్యాటరీల ధరలు తగ్గడం వల్ల ఆటోమేటిక్గా ఈవీల ధరలు కూడా తగ్గుతాయి. దీంతో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్ బైక్ల వినియోగంలో హైదరాబాద్ టాప్లో ఉంది. రానున్న రోజుల్లో ఈవీల వినియోగం ఇంకా పెరుగుతుంది. ఇందుకనుగుణంగా రాష్ట్రప్రభుత్వం విద్యుత్ చార్జింగ్ సదుపాయాన్ని పెంచాల్సిన అవసరముంది. – సంధ్య, ఈవీ డీలర్
ఫ్యూచర్స్ ట్రేడర్లపై ఎస్టీటీ గూగ్లీ
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీ స్థాయి స్పెక్యులేషన్ని కట్టడి చేసే దిశగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో)పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని (ఎస్టీటీ) పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఫ్యూచర్స్పై ప్రస్తుతం 0.02 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.05 శాతానికి (150 శాతం) పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఆప్షన్స్ ప్రీమియంపై, ఆప్షన్స్ వినియోగంపై ప్రస్తుతం వరుసగా 0.1 శాతం, 0.125 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.15 శాతానికి (దాదాపు 50 శాతం) పెంచుతున్నట్లు తెలిపారు. క్యాష్ ఈక్విటీ మార్కెట్పై కాకుండా అత్యధిక వాల్యూమ్స్ ఉంటున్న డెరివేటివ్ ట్రేడింగ్నే లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో యాక్టివ్, స్వల్పకాలిక ట్రేడింగ్ లావాదేవీల వ్యయాలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అతి స్పెక్యులేటివ్ యాక్టివిటీని నివారించేందుకు, మార్కెట్ సమతుల్యతను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు రూ. 1 లక్ష విలువ చేసే ఫ్యూచర్స్ విక్రయంపై ఎస్టీటీ రూ. 12.50గా ఉండగా ఇకపై రూ. 20కి పెరుగుతుంది. అలాగే రూ. 10,000 ఆప్షన్ కాంట్రాక్ట్ విక్రయంపై ఎస్టీటీ రూ. 6.25 నుంచి రూ. 10కి పెరుగుతుంది‘ అని స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం లెమన్ సహ వ్యవస్థాపకుడు ఆశీష్ సింఘాల్ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరంలో ఎస్టీటీ రూపంలో కేంద్రానికి రూ. 73,000 కోట్లు రావొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ముందుగా అంచనా వేసిన రూ. 78,000 కోట్ల కన్నా తక్కువగా రూ. 63,670 కోట్లకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ‘నామమాత్రపు పెంపు అనేది కేవలం స్పెక్యులేషన్ని నివారించేందుకే తప్ప ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చేందుకు కాదు. ఎఫ్అండ్వో ట్రేడింగ్కి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవుతున్నప్పుడు మేము మౌనంగా చూస్తూ ఉండిపోలేము. ఈ నిర్ణయం అలాంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులను నివారించేందుకు ఉపయోగపడుతుంది‘ అని బడ్జెట్ అనంతరం కాన్ఫరెన్స్లో నిర్మలా సీతారామన్ వివరించారు. మార్కెట్లు డౌన్.. ఎస్టీటీ పెంపు ప్రభావంతో మార్కెట్లు గణనీయంగా తగ్గాయి. కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 2 శాతం క్షీణించాయి. బ్రోకరేజ్ సంబంధ స్టాక్స్ ఒక దశలో 18 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈలో ఎంసీఎక్స్ షేరు సుమారు 12 శాతం తగ్గి రూ.2,232కి (ఇంట్రాడేలో 18 శాతం డౌన్), ఏంజెల్ వన్ స్టాక్ దాదాపు 9 శాతం క్షీణించి రూ. 2,320కి, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సరీ్వసెస్ 8 శాతం క్షీణించి రూ. 304కి పడ్డాయి. అటు గ్రో మాతృ సంస్థ బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేరు 5 శాతం క్షీణించి రూ. 168 వద్ద, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2 శాతం తగ్గి రూ. 567 వద్ద క్లోజయ్యాయి. ఎఫ్పీఐలకు ప్రతికూలం.. సమీప భవిష్యత్తులో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ముఖ్యంగా డెరివేటివ్స్ ఆధారిత హై–ఫ్రీక్వెన్సీ గ్లోబల్ ఫండ్స్కి ప్రతికూలంగా ఉండొచ్చని చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ ఆకాశ్ షా తెలిపారు. అంతర్జాతీయంగా రిసు్కలు, కరెన్సీపరమైన ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల ఎఫ్పీఐలు ఇప్పటికే ఆచితూచి వ్యవహరిస్తూ మన ఈక్విటీ మార్కెట్ నుంచి జనవరిలో రూ. 41,000 కోట్లు ఉపసంహరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు ప్రతికూలంగా పరిణమిస్తుందన్నారు.దీనితో ట్యాక్స్ అనంతర లాభాలు తగ్గిపోయి, భారత మార్కెట్ ఆకర్షణను కోల్పోయే అవకాశం ఉందని షా వివరించారు. ఫండమెంటల్స్ ప్రాతిపదికన, దీర్ఘకాలిక దృష్టితో లావాదేవీలు నిర్వహించే ఎఫ్పీఐలపై ప్రభావం పరిమితంగానే ఉంటుందన్నారు. కాకపోతే, లావాదేవీల వ్యయాలు పెరిగిపోవడం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు..ఇతర ఆసియా మార్కెట్లవైపు మళ్లే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది పెంపునకు అదనంగా ఇప్పుడు ఎస్టీటీని భారీగా పెంచడం వల్ల ట్రేడర్లు, హెడ్జర్ల వ్యయాలు పెరిగిపోతాయని కోటక్ సెక్యూరిటీస్ ఎండీ శ్రీపాల్ షా చెప్పారు. దీనితో డెరివేటివ్స్ విభాగంలో పరిమాణాలు తగ్గుతాయన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం కన్నా వాల్యూమ్స్ని తగ్గించడమే ఈ ప్రతిపాదన అంతరార్థం అయి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్ ఎఫ్అండ్వో ఇన్వెస్టర్లను ఎస్టీటీ పెంపు అనేది పెద్ద అవరోధంగా ఉండకపోవచ్చని గ్రీన్ పోర్ట్ఫోలియో పీఎంఎస్ సహ–వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలిపారు. అతి స్పెక్యులేటివ్ ధోరణులను తగ్గించి ఫైనాన్షియల్ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్ఎస్ఈ ఎండీ ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు.
వికసిత్ భారత్.. పెట్టుబడిదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: సామాన్యుడికి కొంత మోదం.. స్టాక్ మార్కెట్లకు, మదుపర్లకు ఖేదం.. స్టార్టప్లకు కాస్త నిరాశ.. పన్ను చెల్లింపుదారులకు అసంతృప్తి.. విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. తయారీరంగం వారికి ఊరట.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బడ్జెట్ క్రికెట్ మ్యాచ్ చూశాక.. వివిధ వర్గాల అనుభూతులివి. 2026–27 సంవత్సరానికిగానూ రూ.53.47 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను నిర్మల ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ, ప్రజాకర్షక హామీలకు దూరంగా బడ్జెట్ను రూపొందించారు. విత్త మంత్రి తన బడ్జెట్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు ప్రకటించారు.యువశక్తి బడ్జెట్మాఘ పౌర్ణమి శుభ పర్వదినాన, సిక్కుల ఆధ్యాత్మిక గురువు గురు రవిదాస్ జయంతి రోజున 2026–27 బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు నిర్మల తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ 12 ఏళ్లలో ఆర్థిక రంగానికి స్థిరత్వం వచ్చిందని, సుస్థిరాభివృద్ధి, ద్రవ్య క్రమశిక్షణ సాధ్యమయ్యాయని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రజాకర్షక హామీలకంటే ప్రజల ప్రయోజనాలను నిరంతరం ఎంచుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. దీన్ని ‘యువ శక్తి నడిపిన బడ్జెట్’గా ఆమె అభివర్ణించారు.3 కర్తవ్యాలువిత్తమంత్రి తన ప్రసంగాన్ని మూడు ప్రధాన కర్తవ్యాలతో ప్రారంభించారు. అవి సమ్మిళిత వృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, అందరితో కలసి–అందరి ప్రగతి. జీఎస్టీ సరళీకరణ, లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వంటి 350కిపైగా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మొదటి కర్తవ్యం కింద 6 రంగాల్లో చర్యలు ప్రతిపాదించారు. కీలక రంగాల్లో తయారీని భారీగా పెంచడం, ‘చాంపియన్ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ఈ)’ తయారుచేయడం, మౌలిక వసతుల రంగానికి ఊపునివ్వడం, ఇంధనరంగంలో సుస్థిరాభివృద్ధి – దీర్ఘకాలిక భద్రతకు చర్యలు, పట్టణ ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. కస్టమ్స్ పన్నుల్లో సరళీకరణ2026–27 బడ్జెట్లో కస్టమ్స్ విధానాన్ని సరళీకరించారు. అనవసర మినహాయింపులను తగ్గించారు. 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తేశారు. ప్రయాణికుల బ్యాగేజ్ నిబంధనలను సడలించి, వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి తగ్గించారు. ‘ఇంద్రధనుస్సు’ తయారీఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్, టెక్స్టైల్స్, క్రీడా పరికరాలు వంటి ఏడు రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. ఉద్యోగాల సృష్టి, సాంకేతికత ఆధారిత అభివృద్ధిపై దృష్టి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. పర్యాటకం – చిరు వ్యాపారాలుహిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్లలో పర్యావరణ హిత పర్వత మార్గాల అభివృద్ధికి ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా 15 పురావస్తు కేంద్రాల అభివృద్ధికి కూడా బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రూ.10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. డేటా సెంటర్లు, స్టాక్ మార్కెట్మనదేశంలో డేటా సెంటర్లు ఏర్పాటుచేసే సంస్థలకు నిర్మలమ్మ పెద్ద శుభవార్తే చెప్పారు. భారతదేశం నుంచి గ్లోబల్ డేటా సెంటర్ సేవలు అందించే సంస్థలకు ఏకంగా 20 ఏళ్ల పాటు.. అంటే 2047 వరకు పన్ను మినహాయింపు ప్రకటించారు. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30 శాతం పన్ను విధించారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెంచుతున్నట్టు ప్రకటించారు. విదేశీ టూర్లు – విదేశీ విద్యవిదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ను 2 శాతానికి తగ్గించారు. విదేశీ విద్య, వైద్య ఖర్చులపై కూడా టీసీఎస్ తగ్గింపు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. విద్యార్థులు, యువ ఉద్యోగులు, టెక్ ఉద్యోగులు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎన్నారైలు వంటి చిన్న పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు, 6 నెలల పాటు అమల్లో ఉండే విదేశీ ఆస్తుల వెల్లడింపు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు.విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్తఆర్థిక మార్కెట్లను బలోపేతం చేసేందుకు, విదేశాల నుంచి మరింత మూలధనాన్ని ఆకర్షించేందుకు నిర్మల మూడు కీలక అంశాలు ప్రకటించారు. కార్పొరేట్ బాండ్లకు మార్కెట్ – మేకింగ్ ఫ్రేమ్వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి వినూత్న మార్గం, లిస్టెడ్ కంపెనీల్లో అలాంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులు పెంచడం వంటి నిర్ణయాలు వెల్లడించారు. ముఖ్యంగా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (పీఐఎస్) ద్వారా ఎన్ఆర్ఐలు ఇప్పుడు భారతీయ స్టాక్స్లో పెట్టుబడి పెట్టొచ్చు. మౌలిక వసతులుమౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా, తూర్పున పశ్చిమ బెంగాల్లోని డంకుని నుంచి పశ్చిమాన సూరత్ వరకు కలిపే ప్రత్యేక సరకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను ప్రారంభిస్తారు. తీర ప్రాంత సరుకు రవాణాను ప్రోత్సహించే పథకాన్ని కూడా అమలు చేస్తారు. సీప్లేన్ ల తయారీ దేశీయంగా జరిగేలా ప్రోత్సాహకాలు ఇస్తారు.క్లీన్ ఎనర్జీస్వచ్ఛ ఇంధన రంగంలో భాగంగా, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగించే కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ సాంకేతికతల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.20,000 కోట్ల వ్యయం ప్రకటించారు. పర్యావరణ అనుకూల ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు, నగరాల మధ్య ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ‘వృద్ధి అనుసంధానాలుగా’ అభివృద్ధి చేయనున్నారు. లిథియం–అయాన్ బ్యాటరీలు, అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన దిగుమతులపై కూడా డ్యూటీ మినహాయింపు కొనసాగుతుందని ప్రకటించారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటుచేయనున్నారు.దివ్యాంగులకు వరాలుదివ్యాంగులకు చేయూతకోసం ‘దివ్యాంగజన్ కౌశల్ యోజన’, ‘దివ్యాంగ్ సహకార యోజన’ వంటి పథకాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, ఒడిశా, బిహార్, జార్ఖండ్ వంటి 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యావరణ ప్రజా రవాణా ప్రోత్సహించేందుకు 4వేల విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టనున్నారు. ఇంకా, 7 అరుదైన వ్యాధులకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలను వ్యక్తిగత వినియోగం కోసం డ్యూటీ లేకుండా దిగుమతికి అనుమతి ఇచ్చారు.ప్రపంచ స్థాయికి ఉత్పాదక రంగందేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మల అనేక పథకాలు ప్రకటించారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చేందుకు ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’, ఫార్మా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.10వేల కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రకటించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల విడి భాగాల తయారీ ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకం, గ్లోబల్ సప్లై చైన్లో భారత్ వాటా పెంచేందుకు రూ.10వేల కోట్లతో కంటైనర్ తయారీ పథకం ప్రకటించారు. సాగు – బ్యాంకింగ్ – క్రీడలువ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం వంటి చర్యలు ప్రకటించారు. బ్యాంకింగ్ రంగం మీద అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే పదేళ్లలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఖేలో ఇండియా మిషన్కు శ్రీకారం చుడుతున్నట్టు నిర్మల తెలిపారు.
నిధుల సిక్సర్
న్యూఢిల్లీ : పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆదివారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగానికి సింహ భాగం కేటాయించింది. ముఖ్యంగా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా లక్ష కోట్లకు పైగానే కేటాయింపులు జరిపింది. 2025–26లో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,84,678 కోట్లు ప్రతిపాదించింది. అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం అధికంగా కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధరీతులపై కేంద్రం దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా కొత్త ఆయుధాలు, ఎయిర్క్రాఫ్ట్లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్వేర్ కొనుగోళ్లు లక్ష్యంగా మొత్తం రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.2,19,306 కోట్లు కేటాయించింది. ‘ఆపరేషన్ సిందూర్’చరిత్రాత్మక విజయం నేపథ్యంలో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే తమ దృఢ సంకల్పానికి మూలధన సేకరణ సహా రక్షణ రంగ బడ్జెట్ పెంపు మరింత ఊతం ఇచి్చందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.5,53,668 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు రూ.1.80 లక్షల కోట్లతో పోల్చుకుంటే మూలధన వ్యయం రూ.39 వేల కోట్లు పెంచింది. అయితే 2025–26 సంవత్సరానికి సవరించిన మూలధన వ్యయాన్ని రూ.1,86,454 కోట్లుగా అంచనా వేశారు. తాజా మూలధన వ్యయంలో యుద్ధ విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ.53,733 కోట్లు, నౌకాదళం కోసం రూ.25,023 కోట్లు కేటాయించారు. రూ.1,71,338 కోట్ల పింఛన్లతో కలిపి రెవెన్యూ వ్యయాన్ని రూ.5,53,668 కోట్లుగా చూపించారు. కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు పౌర, శిక్షణ విమానాల తయారీకి అవసరమైన కాంపొనెంట్లు, విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. రక్షణ రంగ పరిశ్రమలకు.. విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాలింగ్కు అవసరమైన విడిభాగాలపై బీసీడీ రద్దును ప్రతిపాదించారు. రక్షణ రంగ వైమానిక పరిశ్రమకు ఈ రెండు నిర్ణయాలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అత్యాధునికయుద్ధరీతులపై కేంద్రందృష్టి పెట్టింది.మాజీ సైనికుల సీహెచ్ఎస్కు రూ.12,100కోట్లు మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (సీహెచ్ఎస్) కోసం రూ.12,100 కోట్లు ప్రతిపాదించామని రాజ్నాథ్ చెప్పారు. భద్రత, అభివృద్ధి, స్వయం సమృద్ధి మధ్య సమతూకాన్ని ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందని అన్నారు. 2026–27 నాటికి అంచనా వేస్తున్న జీడీపీలో రక్షణ రంగ బడ్జెట్ సుమారు 2 శాతంగా ఉండే అవకాశం ఉందన్నారు. రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిలటరీ ఆధునీకరణతో పాటు సాంకేతిక ఆవిష్కరణలు, వనరుల సముచిత వినియోగానికి వీలుగా క్రమబద్ధమైన సేకరణపై రక్షణ బడ్జెట్ దృష్టి పెడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా సాయుధ దళాల బడ్జెట్పై దేశ రక్షణ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. సాయుధ దళాల ఆధునీకరణ, బలోపేతానికి దేశం కట్టుబడి ఉందనే విషయాన్ని రక్షణ బడ్జెట్ ప్రస్ఫుటం చేసిందని థాలేస్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అంకుర్ కనగ్లేకర్ అన్నారు. త్రివిధ దళాల ఆధునీకరణే లక్ష్యం: రక్షణ మంత్రి త్రివిధ దళాల ఆధునీకరణే ఈ బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశమనిరాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.85 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది సుమారు 24 శాతం అధికమని పేర్కొన్నారు. ఈ పెంపుదలతో దేశ మిలటరీ సామర్థ్యం మరింత శక్తివంతం అవుతుందని అన్నారు. మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కూడా ప్రస్తుత బడ్జెట్లో ప్రాధాన్యత ఇచి్చనట్లు తెలిపారు. మ్యాచ్ సమ్మరీమిగతా విషయాల్లో ఎంత ‘డిఫెన్స్’ ఆడినా... డిఫెన్స్ రంగం విషయానికి వచ్చేసరికి నో డిఫెన్స్. ఎందుకంటే భద్రతపై రాజీ ఉండకూడదన్నది ప్రభుత్వ పాలసీ. అందుకే... రక్షణ రంగం సేఫ్ ప్లేను వదిలి నిధుల సిక్సర్ కొట్టింది. రూ.7.84 లక్షల కోట్ల రికార్డు కేటాయింపుతో కేంద్రం బంతిని నేరుగా బౌండరీ దాటించింది. చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో కొట్టిన ఈ షాట్ కేవలం స్కోర్ పెంచడానికి కాదు, మ్యాచ్ను కంట్రోల్లోకి తీసుకురావడానికి. మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలు, ఆధునిక మిలటరీ హార్డ్వేర్తో దేశ రక్షణ విషయంలో ఎంత హిట్టింగ్కైనా సిద్ధమని మోదీ సర్కారు స్పష్టంగా చెప్పింది. ఆపరేషన్ సిందూర్’ తర్వాత సన్నద్ధతకు మరింత పదునుపెట్టిన ఈ బడ్జెట్... డిఫెన్స్లో కాదు, అగ్రెసివ్ ఫీల్డ్ సెటప్తో ఆడుతున్న స్పష్టమైన సంకేతం.
రాష్ట్రానికి నిర్మలమ్మ నిరాశే మిగిల్చారు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చూపెట్టలేదు. దేశ వ్యాప్తంగా ప్రకటించిన ఏడు రైల్వే కారిడార్లు ( మూడు హైదరాబాద్ మీదుగా) మినహా ఈసారి బడ్టెట్లో కూడా తెలంగాణ ప్రస్తావన కనిపించలేదు. విజన్–2047కు అనుగుణంగా రీజినల్ రింగురోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన వరకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ఏ కార్యక్రమానికీ నిధులు కేటాయించలేదు. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ తెలంగాణకు ఎలాంటి ఊరట దక్కలేదు. కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా అమలు చేసే పథకాల్లో భాగంగానే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరాలి తప్ప ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాయం అడిగినా చేయలేదు ఈసారి కేంద్ర బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మూడు అంశాల్లో కేంద్ర సహకారాన్ని ఆశించింది. ముఖ్యంగా 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధులు వస్తాయని, 2014 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలకు మోక్షం కలుగుతుందని, విభజన హామీల్లో కొన్నింటికైనా ఈసారి కేటాయింపులు ఉంటాయని రాష్ట్రం భావించింది. అయితే తెలంగాణకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకుండానే బడ్జెట్ ప్రతిపాదనలు జరిగాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక పథకాలకు రూ.1.65 లక్షల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇందుకోసం పలుమార్లు కేంద్రాన్ని రాష్ట్ర పెద్దలు కలిశారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు తోడు రాష్ట్ర ఎంపీలు, తమ శాఖలకు నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర మంత్రులు ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్థికమంత్రి, ప్రధాన మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ ఈ విజ్ఞప్తులేవీ కేంద్రం పట్టించుకోలేదు. రీజినల్ రింగు రోడ్డు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో ప్రాజెక్టు విస్తరణ, హైదరాబాద్లో సీవరేజి మాస్టర్ ప్లాన్, వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రేడియల్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ హైవే, ఇండ్రస్టియల్ హబ్లు, లాజిస్టిక్, రీక్రియేషన్ పార్కులు, ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులు, తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లాకో నవోదయ పాఠశాల, పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాలకు తోడు రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదలన్నింటినీ కేంద్ర బడ్జెట్ బుట్టదాఖలు చేసింది. రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి సహకారం ఉంటుందని ఆశించినా, అది కూడా దక్కలేదు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లాంటి సోషల్ ఇంజనీరింగ్ కార్యక్రమాలకు కూడా ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. మిర్చిబోర్డు, స్కిల్ వర్సిటీ లాంటి ఊసు కూడా లేకుండానే పార్లమెంటు ముందుకొచ్చిన కేంద్ర వార్షిక బడ్జెట్ రాష్ట్రాన్ని నిరాశలో ముంచెత్తింది. ఈ బడ్జెట్ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్పై కూడా ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చొరవ తీసుకుంటే ప్రయోజనం కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కొన్ని పథకాలు, కార్యక్రమాల విషయంలో తెలంగాణ చొరవ తీసుకుంటే... కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మాత్రం కొంతమేర ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైస్పీడ్ రైల్ కారిడార్లకు అనుసంధానంగా రోడ్డు కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయవచ్చని అంటున్నారు. డాటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సహకారం, ఇతర దేశాల నుంచి పెట్టుబడుల సమీకరణ, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం తదితర అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానాలు, కేంద్రం అందించే సాయం బట్టి కొంత ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ఇక, ఆదాయ పన్ను విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడం, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ల విషయంలోనూ విధానాల్లో ఎలాంటి మార్పు ప్రకటించకపోవడంతో వేతన జీవులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ఈ బడ్జెట్ ద్వారా ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతుండడం గమనార్హం. స్వల్పంగా పెరిగిన పన్నుల్లో వాటా కేంద్ర పన్నుల్లో వాటా ఈసారి బడ్జెట్లో స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి గతంలో ఉన్న 41 శాతం పన్నుల్లో వాటాను ఈసారి 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా 42.5 శాతానికి పెంచారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో వాటా కూడా గత ఏడాది కంటే కొంచెం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 2.102 శాతంగా ఉన్న పన్నుల్లో వాటా ఈసారి 2.174 శాతానికి పెరగడం గమనార్హం. ఈ మేరకు రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా కింది రూ. 33,181 కోట్లు వస్తాయని అంచనాలు చెబుతున్నాయి. ప్రతి నెలా సగటున రూ.2,370 కోట్ల చొప్పున మొత్తం 14 విడతల్లో ఈ మొత్తం వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అయితే, పన్నుల్లో వాటి ఈసారి రూ.4వేల కోట్ల వరకు పెరిగింది. గత బడ్జెట్లో రూ.29,280 కోట్లు రాగా, ఈసారి అది రూ.33వేల కోట్లకు పెరగడం ఒక్కటే తెలంగాణకు ఈసారి కేంద్ర బడ్జెట్లో దక్కిన ఊరట అని చెప్పుకోవచ్చు.
సాగుకు ఒరిగేది తక్కువే!
డిజిటల్ వ్యవసాయం ద్వారా అద్భుతం సాధిస్తున్నామని చెబు తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణి బడ్జెట్ కేటాయింపుల్లోనూ కనిపించింది. అయితే భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్ల పట్ల బడ్జెట్లో ప్రతి స్పందన దాదాపు శూన్యం అని చెప్పాలి. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఒత్తిడి, తగ్గుతున్న మార్కెట్ రాబడి కారణంగా రైతు ఆదాయాలు తరుగుతున్నాయి. పెరుగుతున్న వివిధ పంటల దిగుమతి, అమెరికా దేశం నుంచి ఒత్తిళ్లను ఆర్థిక సర్వే 2025–26 అంగీకరించినా బడ్జెట్లో కనీస స్పందన లేదు.పెరుగుతున్న వాతావరణ ప్రభావానికి, ప్రభుత్వ పెట్టుబడుల మధ్య పొంతన అసలు లేదు. ఆశించినట్టుగా 2026 –27 బడ్జెట్లో సహజ వ్యవసాయం వంటి పైలట్ కార్యక్రమాలకు నిధులను గణనీయంగా పెంచినట్లు కనిపించడం లేదు. డిజిటల్ వ్యవ సాయం మీద పెట్టుబడుల వల్ల ఒరిగేది చాలా తక్కువ. డిజిటల్ టెక్నాలజీ కేవలం ప్రకృతి వైపరీత్యాల గురించి హెచ్చరించడానికి మాత్రమే పనికొస్తుంది. స్థిరమైన పంటల ఉత్పత్తి ఉన్నప్పటికీ రైతు ఆదాయ సంక్షోభాన్ని పరిష్క రించడంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ–నామ్, ధరల డ్యాష్బోర్డ్లు, గిడ్డంగి రసీదు వ్యవస్థలు వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు రైతుల సమస్యలను పరిష్కరించడం లేదు.ధరల స్థిరీకరణ, వైవిధ్యభరితమైన సేకరణ, వ్యవసాయ–ప్రాసెసింగ్ సామర్థ్యం, మార్కెట్ కార్యకలాపాలలో బలమైన ప్రభుత్వ జోక్యం లేకుండా... డిజిటల్ వ్యవస్థలనేవి రైతుల ఆదాయాలను రక్షించడం కంటే ధరలను అస్థిర పరచేందుకే అవకాశం ఎక్కువ ఉంది. వ్యవసాయానికి ఇచ్చిన మొత్తం నికర కేటాయింపు రూ.1,30,561 కోట్లు (2025–26 సవరించిన బడ్జెట్ కేటాయింపు కన్నా 6% ఎక్కువ). ఇందులో ప్రధానంగా ‘పీఎమ్– కిసాన్ సమ్మాన్ నిధి’కి రూ. 63,500 కోట్లు (49%), వడ్డీ సబ్సిడీలకు రూ. 22,600 కోట్లు (17%),పంట బీమా (పీఎమ్ఎఫ్బీవై)కు రూ. 12,200 కోట్లు (9%) కేటాయింపులు జరిగాయి.‘కృషియోన్నతి యోజన’కు కేటాయింపులు 65% (రూ. 6,800 నుండి 11,200 కోట్లకు) పెరిగాయి. ఇందులో కొత్తగా ‘కూరగాయలు/ పండ్ల మిషన్ ’ ఉంది. సహజ వ్యవసాయ మిషన్కు ఇచ్చిన నిధులలో కేవలం 3% వృద్ధి (రూ.725 నుండి 750 కోట్లకు) మాత్రమే ఉంది. ఇక, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 41% కేటాయింపులు పెరిగాయి.వడ్డీ చెల్లింపుల భారంబడ్జెట్లో కొత్త కార్యక్రమాలు (2026–27) చూస్తే... ‘భారత్–విస్తార్’ అనే బహుభాషా ఏఐ సాధనం ఏర్పాటుకు రూ. 150 కోట్ల కేటాయింపు జరిగింది. ఇది రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సాయం చేస్తుందని భావిస్తు న్నారు. అధిక విలువ కలిగిన వ్యవసాయ పంటలకు మద్దతు పేరిట తీరప్రాంత/కొండ ప్రాంతాలలో కొబ్బరి, గంధపు చెట్ల పెంపకానికి రూ. 350 కోట్లు ఇచ్చారు. మఖానా అభివృద్ధికి రూ. 90 కోట్లు ఇచ్చి, పసుపుకు మాత్రం ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదు.బడ్జెట్ వ్యూహాత్మక దృష్టి కేవలం డిజిటల్ వ్యవసా యానికి పరిమితం అయ్యింది. డ్రోన్లు, ఏఐ, డిజిటల్ వ్యవస్థల వంటివి భాగంగా ఉండే సాంకే తిక పరిజ్ఞానాన్ని వాడటం; ‘పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’కి అధిక నిధులను కేటాయించడం ద్వారా రైతు ఆదాయాన్ని స్థిరీకరించడం, అధిక విలువ కలిగిన పంట లను వైవిధ్యీకరించడం, సహజ వ్యవసాయ పరి వర్తనకు స్థిరమైన నిధులను అందు బాటులోకి తేవడం వంటి వాటికి బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది.మొత్తం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు కేటాయించినది 2.7% మాత్రమే! మొత్తం బడ్జెట్ ప్రాథమ్యాలతో పోలిస్తే... ప్రభుత్వం అప్పులపై వడ్డీ చెల్లింపుల (రూ. 14.4 లక్షల కోట్లు) పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. వ్యవసాయానికి రూ. 1.3 లక్షల కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ప్రభుత్వం మీద ఉన్న అప్పుల భారం అభివృద్ధి మీద వ్యయాన్ని పరి మితం చేస్తుందని స్పష్టం అవుతున్నది. వ్యవసాయ బడ్జెట్ నిరాడంబరమైన వృద్ధిని చూపుతోంది. వాస్తవ అభివృద్ధి/ వ్యవసాయ రంగ పరివర్తన వ్యయం కేవలం రూ. 33,000 కోట్లు మాత్రమే. ప్రభుత్వం ప్రతి 2 రోజులకు వడ్డీ చెల్లింపులపై చేసే ఖర్చు కన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం.డా‘‘ దొంతి నరసింహారెడ్డివ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు

