Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Fires On Chandrababu Govt in Media Meet1
బాండ్లు చూపి బాబును నిలదీయండి: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ అంటూ చంద్ర­బాబు చేసిన వాగ్దానాలను కనీసం రిబ్బన్‌ కూడా కత్తిరించకుండానే.. మొత్తం హామీలు అమలు చేసేశానని చెబుతున్నాడు. అబ్రకదబ్ర.. ఛూమంతర్‌ అంటూ.. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ సహా 143 హామీలు అమలు చేసేశానని ఊదరగొడుతున్నాడు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌పై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటూ ముందే బెదిరిస్తున్నాడంటూ ఎత్తి చూపారు. ఎల్లో మీడియా, సోషల్‌ మీడియా కూడా చంద్రబాబు చెబుతున్న పచ్చి అబద్ధాలను.. నిజాలుగా నమ్మించేలా ప్రచారం చేస్తున్నా­యని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్ని అబద్ధాలు చెప్పి, మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏడాదిగా తాను ఏం చేశానన్నది చెప్పేందుకు ఇంటింటికీ తన ఎమ్మెల్యేలు, నాయకులను పంపుతానంటున్నాడని దుయ్యబ­ట్టారు. ‘ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను, బాబు ష్యూరిటీ–­భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన బాండ్లను దగ్గర పెట్టుకోండి. వాటిని చూపి ప్రభు­త్వం మీకు ఎంత బాకీ ఉందో వడ్డీతో సహా చెల్లించాలని నిలదీయండి’ అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబు మేనిఫెస్టో..’ అంటే చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు­కుందాం’ అంటూ వైఎస్సార్‌సీపీ దాన్ని మీకు అందుబాటులోకి తెస్తుందని.. దాని కోసం మీరు క్యూఆర్‌ కోడ్‌ వినియోగిస్తే చాలు డౌన్‌లోడ్‌ అవుతుందని ప్రజలకు సూచించారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ సహా అన్ని హామీలు 2024 జూన్‌ నుంచి అమలు అవుతాయని.. మీ ఖాతాలో డబ్బులు జమ అవుతుందని చంద్రబాబు త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతూ మీకు ఇచ్చిన బాండ్లను.. మీ ఇంటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాగానే చూపి.. అవి తమకు ఎప్పుడిస్తారని నిలదీయాలని ప్రజలకు పిలుపు­నిచ్చారు. అప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని హామీలను అమలు చేస్తుందేమో చూద్దామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే.. మీ తరఫున మీతో కలిసి పోరాడటానికి వైఎస్సార్‌సీపీ, తాను సిద్ధమని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయాలంటూ కలెక్టరేట్‌లను ముట్టడించే కార్యక్రమానికి ప్రణాళిక రచిద్దామని ప్రజలను చైతన్య పరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..జగన్‌ కంటే ఎక్కువ ఇస్తానని మోసం చేస్తావా?⇒ చంద్రబాబు ఎన్నికలకు ముందు జగన్‌ చేస్తున్నవే కాకుండా అంత కంటే ఎక్కువ చేస్తామన్నారు. ‘మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాను’ అంటూ 2024 ఏప్రిల్‌ 11న చంద్రబాబు హామీ ఇచ్చారు (చంద్రబాబు మాట్లాడిన వీడియోను ప్రదర్శించి చూపారు). ఇప్పుడు వాటన్నింటినీ అమలు చేసేశానని చెబుతున్నాడు. ⇒ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామన్నారు. ఎంత మందికి ఇచ్చారు? రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.56 కోట్ల మంది ఉన్నారని టీడీపీ అఫీషియల్‌ గెజిట్‌ ‘ఈనాడు’లో 2025 ఏప్రిల్‌ 17న కథనాన్ని ప్రచురించారు. కోటిన్నరకు పైగా ఉపాధి లేని యువత ఉంటే.. వారికి ఒక్కపైసా కూడా ఇవ్వకుండా అన్నీ చేసేశానని చెప్పడం మోసం కాదా? ⇒ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామని ఎగ్గొట్టలేదా? దీపం, ఉచిత బస్సు అనేవి చిన్న పనులు. కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.59 లక్షల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీళ్లందరికీ ఉచిత గ్యాస్‌ ఇవ్వాలి అంటే సిలిండర్‌కు రూ.877 చొప్పున మూడు సిలిండర్లకు రూ.4,109 కోట్లు ఖర్చు అవుతుంది. తొలి ఏడాది బడ్జెట్‌ కేటాయింపు రూ.865 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.3,244 కోట్లు ఇవ్వకుండా మోసం చేయలేదా? అక్కడా మళ్లీ మోసమే.. కనీసం ఒక్క సిలిండర్‌కైనా పూర్తిగా ఇవ్వాలంటే రూ.1,370 కోట్లు అవుతుంది. అలాంటిది రూ.865 కోట్లే ఇచ్చారు. ఒక్క సిలిండర్‌ను కూడా సరిగా ఇవ్వలేదు. దీపం పథకం బోగస్‌! ⇒ మహిళలకు ఉచిత బస్సు అన్నింటికంటే చాలా సులభం. నెలకు రూ.275 కోట్లు ఆర్టీసీ వాళ్లకు ఇస్తే ఏడాదికి రూ.3 వేల కోట్లతో పథకం అమలవుతుంది. మా కడపలో మహిళలు విశాఖపట్నం వెళ్లి చూసి రావొచ్చని ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. పండుగ పేర్లు మారిపోతున్నాయి తప్ప బస్సు రావట్లేదు. గతేడాది ఉగాది నుంచి ఈ ఏడాది ఉగాది వరకు పండుగలు వెళ్లిపోతే.. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఉచిత బస్సు అమలుకు అధ్యయనంతో పనేముంది? ఆర్టీసీకి డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా? అప్పుడు కడప వాళ్లు విశాఖ వెళ్తారు.. అనంతపురం వాళ్లు అమరావతి చూసుకోవడానికి విజయవాడకు వస్తారు. దుర్గమ్మ దర్శనం చేసు­కుని వెళ్తారు. ఇంకేమైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఇటు రాయల­సీమ వాళ్లు, అటు ఉత్తరాంధ్ర వాళ్లు కొంచెం సేద తీరుతారు. ⇒ 50 ఏళ్లకే పెన్షన్‌ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు అవుతుంది. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా ఎగరగొడుతున్నారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవి పీకేశారు. చంద్రబాబు ఎన్నికలకు వెళ్లే నాటికి మార్చిలో 66,34,742 పింఛన్లు ఉంటే.. ఈ నెలలో ఇచ్చింది 61.48 లక్షల మందికి మాత్రమే. సంవత్సరం తిరిగే లోగా 5 లక్షల పింఛన్లు తగ్గించేశారు. వీటికి అదనంగా 50 ఏళ్లు నిండిన వాళ్లకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మహిళలను మోసం చేశారు.⇒ ప్రధాన మంత్రి పీఎం కిసాన్‌ పథకంతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. మడమ తిప్పను.. మాట తప్పను అన్నావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇస్తుంది కాబట్టి నేను రూ.6,500 ఇస్తానని చెప్పావు. ఇది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మేము సంవత్సరానికి ఇప్పుడిచ్చేది కాకుండా రూ.20 వేలు ఇచ్చేలా తెలుగుదేశం పార్టీలో నిర్ణయం చేశామని చంద్రబాబు చెప్పాడు. (చంద్ర­బాబు మాట్లాడిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు). కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.20 వేలు ఇస్తానని ఊదరగొట్టి ఏడాదిలో ఒక్కపైసా ఇవ్వలేదు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులకు రూ.20 వేలు చొప్పున ఇస్తే రూ.10,716 కోట్లు మేలు జరిగేది. ⇒ తల్లికి వందనం పేరిట తల్లులను వంచన చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోమని ఎన్నికల్లో పదేపదే చెప్పారు. ‘ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు.. ఆంక్షలు లేవు.. కటింగ్‌ లేదు.. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది అన్నారు (చంద్రబాబు ఈ మేరకు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ యూడైస్‌ డేటా ప్రకారం రాష్ట్రంలో 2023–24లో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. మరి 87.41 లక్షల మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున రూ.13,111 కోట్లు ఇవ్వాలి. ఇస్తామంటోంది కేవలం రూ.8,700 కోట్లు. అది కూడా చివరికి వచ్చే సరికి ఏ మేరకు ఇస్తారో చూడాలి. అందరికీ ఇచ్చిన తర్వాత గాని తెలియదు ఎంత మందికి ఇచ్చారో.. ఎంత మందికి ఎగనామం పెట్టారో. ఈ లెక్కలు చూసినా 30 లక్షల మందికి కోత పెట్టారు. మేము గట్టిగా నిలదీస్తే రూ.15 వేలు కాదు రూ.13 వేలే ఇచ్చేది.. అందులో 67 లక్షల మందికి ఇస్తున్నామని ప్లేటు ఫిరాయించారు. మళ్లీ 67 లక్షల్లో ప్రస్తుతానికి 54 లక్షల మందికే ఇస్తున్నామంటున్నాడు. ఎన్నికలప్పుడు చెప్పిన నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు పోయింది. ఇప్పుడు కొందరికి మాత్రమే రూ.13 వేలు అని తేలింది. ఇది మోసం కాదా చంద్రబాబూ? ప్రశ్నిస్తే నాలుక మందమంటావా?రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు నిండిన 2,10,58,615 మంది మహిళలు ఉన్నారు. వీళ్ల అడ్రస్‌లతో సహా వివరాలు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. ఇందులో 60 ఏళ్లు నిండిన వాళ్లను తీసేస్తే.. 1.80 కోట్ల మంది మహిళలు ఉంటారు. వీళ్లందరిలో ఎంత మందికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఇచ్చారు? తొలి ఏడాది ఎగ్గొట్టాక.. ఇప్పుడు పీృ4 జపం చేస్తున్నాడు. నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవరో శ్రీమంతులతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తానని డ్రామాలు చేయడానికి సిగ్గులేదా?ఇన్నిన్ని అబద్ధాలు, మోసాలు చేస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పుడు ప్రతి ఇంటికీ తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను పంపిస్తాడట. అప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, చంద్రబాబు ఇచ్చిన బాండ్లను అందరూ దగ్గర పెట్టుకుని చూపించండి. ఆ మేనిఫెస్టో ప్రకారం ఏడాదిగా మీకు రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తూ నిలదీయండి. మీ వద్ద ఆ మేనిఫెస్టో లేకపోతే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకునేలా వైఎస్సార్‌సీపీ త్వరలో రిలీజ్‌ చేస్తుంది. దాన్ని దగ్గర పెట్టుకుని మీకు ఏమేం రావాలో చెబుతూ ప్రశ్నించండి. కనీసం వారికి అప్పుడైనా సిగ్గు వచ్చి అమలు చేస్తారేమో చూద్దాం. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం గురించి వివరిస్తున్న వైఎస్‌ జగన్‌ ఉన్న పథకాలను భ్రష్టు పట్టించారు⇒ ఒకవైపున ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టించారు. అప్పట్లో ప్రతి తల్లికి అమ్మ ఒడి పేరుతో సాయం అందించి, పిల్లలను బడులకు పంపించేలా ప్రోత్స­హించాం. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి 83–84 లక్షల మంది పిల్లలను బడుల బాట పట్టించాం. ఇప్పుడు నిబద్ధత లేకుండా మోటివేషన్‌ కార్యక్రమాలను భ్రష్టు పట్టిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ విద్యా రంగాన్ని దెబ్బ తీసి, మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు నాశనం చేశాడు. ⇒ మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఇంగ్లిష్‌ మీడియం బడులు, 3వ తరగతి నుంచి టోఫెల్‌ చెప్పే పీరి­యడ్లు పోయాయి. సబ్జెక్టు టీచర్‌ విధానం, రోజు­కొక రుచికరమైన మెనూ, చిక్కీతో సహా ఇచ్చే గోరు­ముద్ద పోయింది. నాడు–నేడు పనులు ఆగి­పోయాయి. ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్సీ, అక్కడి నుంచి ఐబీ వరకు ప్రయాణం నిలిచిపోయింది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేవి. ఇప్పడు అవీ లేవు. తొలిసారిగా మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ప్రైవేటు బడుల కంటే మెరు­గైన­విగా నిలిచాయి. స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు కని­పించేవి. ఇప్పడు విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించా­రు. చివరికి పదో తరగతి పరీక్షల పేపర్లు సక్ర­మంగా దిద్దలేని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ⇒ మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే వాళ్లం. ప్రతి ఏప్రిల్‌లో వసతి దీవెన అందించేవాళ్లం. ఇదంతా క్రమం తప్పకుండా జరిగేది. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఈ జూన్‌ దాటితే ఆరు త్రైమాసికాలు బకాయిలు పెట్టారు. ఎన్నికల కోడ్‌తో పెండింగ్‌ పడినప్పటి నుంచి ఆరు త్రైమాసికాలు రూ.4,200 కోట్లు, ఏప్రిల్‌ (2024)లో ఇవ్వాల్సిన వసతి దీవెన రూ.1100 కోట్లు, ఈ ఏడాదికి మరో రూ.1,100 కోట్లు మొత్తం రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు చెల్లించాల్సి ఉంటే.. ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు మాత్రమే. ⇒ ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌ను వెయ్యి నుంచి 3,300కు పెంచి పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని, మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దరి చేర్చాం. మధ్య తరగతి ప్రజలు అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశాం. నెలకు ఆరోగ్యశ్రీ కింద రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే, చంద్రబాబు వచ్చిన ఏడాదిలో రూ.3,600 కోట్లు పెండింగ్‌ పెట్టేశారు. ఆరోగ్య ఆసరా కింద పేషెంట్‌ ఆపరేషన్‌ అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఇచ్చే వాళ్లం. దీనికి మరో రూ.400 కోట్లు అవుతుంది. ఇలా.. చంద్రబాబు ఏడాదిలో రూ.4 వేల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్యం చేయలేక చేతులు ఎత్తేశాయి. ఇప్పుడు పేదలు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇవ్వకుండానే చంద్రబాబు.. అబ్రక దబ్రా అంటూ మాయ చేస్తున్నాడు. గట్టిగా అడిగితే నాలుక మందం అంటూ బెదిరిస్తున్నాడు. ⇒ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, సీజన్‌ ముగిసే­లోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా పంటల కొను­గోలు, గిట్టుబాటు ధర.. ఇలా అన్నీ రద్ద­య్యాయి. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయి­పోయిన పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.బాబు బాదుడే బాదుడుచంద్రబాబు నిజంగా కొన్ని చేశారు. ఏడాదిలో రూ.15 వేల కోట్లు కరెంటు చార్జీలు బాదాడు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచి పేదలను బాదేశాడు. అన్ని పన్నులు పెంచడంతో ఇంటి అద్దెల బాదుడు.. హెరిటేజ్‌ కోసం అమూల్‌ను చంపేసి పాలరేట్ల బాదుడు.. ఇంటింటికీ రేషన్‌ అందించే వాహనాలు తీసేసి.. సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం మానేశాడు. ఫలితంగా పప్పుల ధరలు పెరగడంతో.. రకరకాలుగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మొదలెట్టాడు. చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరిగి ప్రజలు కిందాపైనా పడుతున్నారు. ఏడాదిలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఏకంగా 3 లక్షలకుపైగా ఉద్యోగాలు తీసేశాడు. 2.60 లక్షల మంది వలంటీర్లు, 20 వేల మంది రేషన్‌ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల ఉద్యోగాలు హుష్‌ కాకి! బెవరేజస్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న 15 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉద్యోగాలు పోయాయి.ఉద్యోగులకు రూ.20 వేల కోట్ల బకాయిప్రభుత్వ ఉద్యోగ­స్తు­లకు మేలు జరిగిందా అంటే అదీ లేదు. వస్తూనే ఐఆర్‌ ఇస్తాన­న్నాడు. అదీ పాయే. ఉన్న పీఆర్సీ­ని రద్దు చేశాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని సాగదీస్తూ వస్తున్నాడు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌ పెట్టాడు. జూలై 1వ తేదీ వస్తే నాల్గో డీఏ పెండింగ్‌. వైఎస్సార్‌సీపీ హయాంలో తీసుకొచ్చిన గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను తీసేసి ఓపీఎస్‌ తీసుకొస్తా అన్నాడు. ఆ విషయంలోనూ వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే రూ.20 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తిరిస్తా.. భూ స్థాపితం చేస్తా అంటున్నాడు. ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం ఆయన, ఆయన ఎల్లో మీడియా రకరకాల స్కెచ్‌లు వేస్తున్నారు.ఇలా ఇంటింటా మోసం..మెహరాజ్‌ బేగం షేక్‌ అని ముస్లిం మహిళ. ఈమెకు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అని యూనిక్‌ ఐడీ కోడ్‌ ఇచ్చారు. మీ సంక్షేమ వివరాల కోసం అంటూ ఓ వెబ్‌ సైట్‌ లింక్‌ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాశారు. ఆమె ఐడీ కోడ్, వయసు, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఇద్దరు, 18 సంవత్సరాల కంటే పైబడి వయసున్న మహిళలు ఇద్దరు, నిరుద్యోగ యువతీ యువకులు సున్నా, నియోజకవర్గం రాజంపేట, కింది స్కీములు వర్తిస్తాయని రాశారు. ఆడబిడ్డ నిధి రూ.1500 చొప్పున ఇద్దరికి ఏడాదికి అందే సాయం రూ.36 వేలు, తల్లికి వందనం కింద ఇద్దరికి రూ.30 వేలు,.. మొత్తంగా ఏడాదిలో మీకు రూ.66 వేలు, ఐదేళ్లలో అందే మొత్తం రూ.3.3 లక్షలు అని స్పష్టంగా చూపించారు. ఇంకా మహాశక్తి దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం జూన్‌ 2024 నుంచి ప్రారంభం అని రాశారు. మీ మద్దతు తెలపడానికి మిస్డ్‌ కాల్‌ ఇవ్వండి అని రాశారు. మిస్డ్‌ కాల్‌ ఇప్పించి ఓటీపీ పంపించారు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. బెనిఫిట్‌ డీటెయిల్స్‌.. అభినందనలు... రూ.3 లక్షల 30 వేలు పొందేందుకు.. మీ కుటుంబం అర్హత పొందింది’ అని మెసేజ్‌ పెట్టారు. 2024 జూన్‌ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని కూడా రాశారు. చంద్రబాబు నాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని ఏకంగా బాండ్‌ ఇచ్చాడు. ఇలా రాష్ట్రంలో ఇంటింటా చేశారు. అందుకే ఏడాది కాలంగా మీకు ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో కలిపి ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు మీ ఇంటికి వచ్చినప్పుడు.. ఇదిగో బాండు.. ఇదిగో ఎస్‌ఎంఎస్‌ అని చూపి డిమాండ్‌ చేయండి. ఏడాది అయింది.. మా అవసరాలు చాలా ఉన్నాయి.. ఇబ్బందులు పడుతున్నాము.. మా బాకీ ఎప్పుడిస్తావని గట్టిగా నిలదీయండి. అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మీ తరఫున పోరాటం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరం కలిసి మళ్లీ ధర్నా చేద్దాం.. మళ్లీ కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమం చేద్దాం. సంపద సృష్టి కాదు.. ఆవిరిసాక్ష్యాధారాలతో కడిగిపారేసిన వైఎస్‌ జగన్‌ఆవిరయ్యే సంపదంతా చంద్రబాబు అండ్‌ కో జేబుల్లోకిమా హయాంలో జీఎస్‌డీపీలో అప్పుల శాతం 4.08% చంద్రబాబు పాలనలో ఏడాదిలోనే అది ఏకంగా 5.12% వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రూ.3,32,671 కోట్ల అప్పుబాబు ఏడాది పాలనలోనే రూ.1,61,301 కోట్ల అప్పుఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎగవేయడానికి చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రకరకాల స్కెచ్‌లు వేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నాడు. ఆయన కళ్లెదుటే సంపద ఆవిరి అవుతోంది. ఆ సంపద చంద్రబాబు జేబులోకి, ఆయనకు సంబంధించిన వారి జేబుల్లోకి పోతోంది’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద పెరగకపోగా.. ఆదాయంతోసహా అన్నీ తగ్గుతు­న్నా­యంటూ కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదికలను ఎత్తిచూపుతూ చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర జీఎస్‌డీపీలో మా హయాంలో అప్పుల శాతం 4.08% అయితే.. చంద్రబాబు ఏడాది పాలన కాలంలో అది ఏకంగా 5.12 శాతానికి చేరుకుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు చూస్తే, మా హయాంలో అది 2.65 శాతం అయితే (అప్పుడు రెండేళ్లు కోవిడ్‌ ఉంది), ఇప్పుడు ఏకంగా 3.61 శాతా­నికి పెరిగింది’ అని చెప్పారు. ‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఏడాది కాలంలోనే దారుణంగా అప్పులు చేశారు. మా హయాంలో ఐదేళ్లలో అన్నీ కలిపి రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే.. చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేసిన మొత్తం అప్పులు రూ.1,61,301 కోట్లు. అంటే మా ఐదేళ్ల హయాంతో పోలిస్తే ఏకంగా 48.5% అప్పు చేశాడు’ అని వివరించారు. జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..చంద్రబాబు గజదొంగల ముఠా దోచుకుంటోందిరాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఖజానాకు రాకుండా చంద్రబాబు, ఆయనకు చెందిన గజ దొంగల ముఠా పంచుకుంటోంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం(ట్యాక్స్, నాన్‌ ట్యాక్స్‌) రూ.14,644 కోట్లు ఉంటే.. 2025 ఏప్రిల్, మే నెలల్లో అది రూ.14,580 కోట్లుగా ఉంది. నిజానికి ఈ ఏడాది 10–12 శాతం పెరగాల్సిందిపోయి.. 0.44 శాతం తగ్గింది. 2024–25లో కూటమి ప్రభుత్వ సొంత ఆదాయం రూ.96,227 కోట్లు కాగా, 2023–24లో రూ.93,354 కోట్లు. అంటే ఆదాయాల వృద్ధి కేవలం 3.08 శాతం మాత్రమే. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ పెరుగుదల ఏకంగా 12.04 శాతం ఉంది. దీంతో పోలిస్తే.. సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పే చంద్రబాబు సాధించింది అత్యల్పం. ఇదీ చంద్రబాబు గారి పనితీరు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ?ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు చెప్పే అబద్ధాలు. తానెప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తినీ తాకట్టు పెట్టలేదని ఈ మధ్య చాలా గట్టిగా, గంభీరంగా చెప్పాడు (వీడియో ప్రదర్శించారు). ఏపీఎండీసీ జీవో నంబర్‌ 69 ద్వారా ఏపీఎండీసీకి సంబంధించిన 436 మైన్స్‌ ప్రాజెక్టులను తాకట్టు పెడుతూ, వాటి విలువ రూ.1.91 లక్షల కోట్లుగా చూపిస్తూ ఏప్రిల్‌ 24న పర్మిషన్‌ ఇచ్చాడు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ? ఏపీఎండీసీ ఇష్యూ చేసిన బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడు. ఎస్డీఎల్‌ (స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్లు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎఫ్‌ఆర్బీఎం లిమిట్స్‌ కింద ఆర్బీఐ ఇస్తుంది) కోసం ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్దకు పోతుంది. ఆ లిమిట్స్‌ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దాని కన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు.

Shubhanshu Shukla Space Mission Postponed2
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్‌.. ఆరోసారి వాయిదా

ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పడింది. ఈ నెల 22న శుభాంశు రోదసి యాత్ర చేయాల్సి ఉండగా.. యాక్సియం-4 ప్రయోగం వాయిదా పడిందని నాసా తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, అంతరిక్ష ప్రయోగంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక, ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నాసా వెల్లడించింది.ఇదిలా ఉండగా.. శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో ఈ మిషన్‌ చేపట్టాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడింది.ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.NASA's Axiom-4 mission with Indian astronaut Shubhanshu Shukla delayed for sixth time pic.twitter.com/TAaXUZpCnv— UPSC Post 📫 (@upscpost) June 20, 2025

Palnadu: Yellow Media Conspiracy Exposed Over Pushpa Dialogue Poster3
ఇదేంది‘రప్పా’..! అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

సాక్షి, నరసరావుపేట: అధికారపార్టీ అడ్డంగా బుక్కయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై కూటమి నేతలు, వారి అనుకూల మీడియా రెండు రోజులుగా నానాయాగీ చేశారు. ‘‘సైకోలు వీరంగం చేశారు, నరకుడు భాష ఏంటి’’ అటూ పచ్చ పత్రికల్లో వార్తలు రాయడంతోపాటు టీవీ చానళ్లలో డిబేట్లు నిర్వహించారు.వైఎస్సార్‌సీపీ అభిమానులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. పుష్ప సినిమాలోని రప్పా.. రప్పా.. పోస్టర్‌ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజపై టీడీపీ మైనార్టీ సెల్‌ సత్తెనపల్లి టౌన్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులూ తక్షణం కేసు నమోదు చేశారు. తీరా చూస్తే రవితేజ టీడీపీ వాడేనని తేలిపోయింది. దీంతో అధికారపార్టీ అడ్డంగా దొరికిపోయింది. బయటపడిన అసలు నిజాలు పోలీసులు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన బొల్లెద్దు రవితేజను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. రవితేజ కుటుంబ సభ్యులు తాము టీడీపీ అభిమానులమని తమకు వైఎస్సార్‌సీపీతో సంబంధం లేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరామని ఫొటోలు చూపారు. బొల్లెద్దు రవితేజపై ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డు రవితేజ పేరు మీద ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డునూ వారే బయటపెట్టారు. దీంతో టీడీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. టీడీపీ సభ్యత్వం ఉండి వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నాడని, ఏ ఉద్దేశంతో హాజరయ్యాడు? రవితేజ వెనుక ఎవరున్నారంటూ సోషల్‌మీడియాలో వైఎస్సార్‌సీపీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవితేజ టీడీపీ కోవర్టేనని, వైఎస్‌ జగన్‌ పర్యటనలో ఆలజడులు సృష్టించడానికే టీడీపీ నేతలు అతనిని పంపి కుట్రలు పన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కొత్త రాగం వైఎస్సార్‌సీపీ అభిమానులపై టీడీపీ చేసిన దు్రష్పచారం బూమరాంగ్‌ కావడంతో ఆ పార్టీ నేతలు కొత్త రాగం మొదలుపెట్టారు. రవితేజ తల్లిదండ్రులు టీడీపీ వారేనని, కానీ రవితేజ మాత్రం వైఎస్సార్‌సీపీ అభిమాని అంటూ బుకాయిస్తున్నారు. బీమా ఉందని టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంటూ పెదకూరపాడు నేతలతో వీడియోలు విడుదల చేయించారు. దీనికి సోషల్‌ మీడియా యాక్టివిస్టులు గట్టి సమాధానాలు ఇచ్చారు. కోట్ల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటూ మహానాడులో చేసే ప్రసంగాలన్నీ వట్టివేనా అంటూ ప్రశి్నంచారు. జీవిత బీమా ఉంటుందని ఆశచూపి ఇతర పార్టీల నేతలకూ సభ్యత్వాలు అంటగడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు.

Rasi Phalalu: Daily Horoscope On 20-06-2025 In Telugu4
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.నవమి ఉ.6.32 వరకు, తదుపరి దశమి తె.4.13 వరకు (తెల్లవారితే శనివారం), నక్షత్రం: రేవతి రా.7.16 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: ఉ.8.00 నుండి 9.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.59 వరకు, తదుపరి ప.12.26 నుండి 1.18 వరకు, అమృత ఘడియలు: సా.4.57 నుండి 6.28 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.32. మేషం....రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.వృషభం...ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.మిథునం....శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కర్కాటకం...వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.సింహం......శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.కన్య.....బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.తుల..శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృశ్చికం.పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ధనుస్సు...మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.మకరం...దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.కుంభం...వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.మీనం...ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Sakshi Guest Column On Indira Gandhi National Emergency5
యాభై ఏళ్ల చీకటి గాయం

ఏదైనా చారిత్రక పరిణామం మీద సరైన అంచనాకు రావడానికి యాభై ఏళ్ల కాలం విశేషంగా దోహదం చేయగలదు. చరిత్రను పునర్లిలిఖించుకునే బాధ్యత ప్రతి తరం మీద ఉందన్న వాస్తవాన్ని గుర్తిస్తే, 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలాన్నీ, దాని ఫలితాలనూ అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయమే. ఎమర్జెన్సీ విధించిన వారు దేశానికి స్వాతంత్య్రం తెచ్చామని చెప్పే పార్టీ వారు కావచ్చు. అయినా చరిత్ర తీర్పు ముందు అంతా సమానమే. ఎమర్జెన్సీ దేశంలో ‘క్రమశిక్షణ’ తెచ్చిందా? లేక చీకటి యుగంలోకి నెట్టిందా? ప్రేరేపించిన కారణాలేమిటి?1975 జూన్‌ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మంత్రిమండలి సిఫారసుతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహమ్మద్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 352లోని 1వ నిబంధన ఆ అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది. ఆంతరంగిక భద్రతకు తీవ్ర విఘాతం వాటిల్లితే రాష్ట్రపతి ఈ అసాధారణ చర్య తీసుకుంటారు.ఎమర్జెన్సీ విధించిన సమయానికి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అవి రాజ్యాంగం నిర్దేశించినట్టు ఉన్నాయా? 1974 జన వరి నుంచి చూసినా ఆ పరిస్థితులు కానరావు. కొంచెం గట్టిగా కనిపించే పరిణామం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌(జేపీ) సంపూర్ణ విప్లవం మాత్రమే. మెస్‌చార్జీలు తగ్గించాలన్న డిమాండ్‌తో మొదలై, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న స్థాయికి వెళ్లిన గుజరాత్‌ విద్యార్థి ఆందోళన ఉంది. 1975 జనవరిలో సమస్తిపూర్‌(బిహార్‌)లో రైల్వే మంత్రి ఎల్‌ఎన్‌ మిశ్రా సభలో బాంబు పేలి, ఆయన చని పోయారు. దీనిని జేపీ ఉద్యమంతో ముడిపెట్టలేక పోయారు.సంపూర్ణ విప్లవానికి మద్దతుగా పార్లమెంటుకు జనతా మార్చ్‌ నిర్వ హించాలని విపక్షాలన్నీ (సీపీఐ మినహా) నిర్ణయించాయి. ఈ మధ్యలో జరిగిన మరొక అనూహ్య పరిణామం, రాయ్‌బరేలీ ఎన్నిక పిటిషన్‌పై మార్చి 18న అలహాబాద్‌ హైకోర్టు బోనులో ఇందిర నిలబడటం. గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని మొరార్జీ దేశాయ్‌ ప్రారంభించిన నిరాహార దీక్షను ఏప్రిల్‌ 13న విరమించారు. ఎన్నికలు జరిపించడానికి ఇందిర సుముఖత వ్యక్తం చేశారు.అయినా స్వతంత్ర భారత చరిత్రను మలుపు తిప్పిన అత్యవసర పరిస్థితి వంటి తీవ్ర నిర్ణయం ఇందిర ఎందుకు తీసుకున్నారు? రెండు తక్షణ కారణాలు. 1971 నాటి సాధారణ ఎన్నికలలో రాయ్‌బరేలీ నియోజక వర్గం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగ్‌మోహన్‌ లాల్‌సిన్హా 1975 జూన్‌ 12న తీర్పు ఇవ్వడం. ఇందిరపై పోటీ చేసి ఓడిన సోషలిస్ట్‌ నాయకుడు రాజ్‌ నారాయణ్‌ ఈ కేసు వేశారు. అదే రోజు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్ని కలలో ప్రజా తీర్పు వచ్చింది. కాంగ్రెస్‌ ఓడి, జన మోర్చా గెలిచింది. రెండోది: అలహాబాద్‌ హైకోర్టు తీర్పు మీద శాశ్వత స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళితే జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ 1975 జూన్‌ 25న షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చి, ఇందిరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో ఓటు హక్కు లేకుండా చేయడం. న్యాయ వ్యవస్థ చేసిన ఈ రెండు నిర్ణయాలు, గుజరాత్‌ ప్రజాతీర్పు ఆమెను ఇరకాటంలోకి నెట్టాయి. కాంగ్రెసేతర పక్షాలు ఇందిర పదవిలో కొనసాగడానికి అనర్హులని ప్రకటిస్తూ ఆ సాయంత్రం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సభ నిర్వహించి కొత్త ఉద్యమం కోసం లోక్‌సంఘర్ష సమితిని ప్రకటించాయి. ఆ అర్ధరాత్రి రాష్ట్ర పతి ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు. మరునాడు ఉదయం ఆరు గంటలకు ఇందిర నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి మండలి ఎమర్జెన్సీ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి అప్పటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి రాష్ట్రపతి సంతకం పడిన తరువాత తెలిసింది.ప్రతిపక్షం అవసరం లేదా?ఇందిర భారత పాలనా వ్యవస్థకు కొత్త రూపం ఇవ్వాలను కున్నారు. దేశాభివృద్ధి అధ్యక్ష తరహా పాలనలోనే సాధ్యమన్న ఒక వాదాన్ని అప్పటికే ప్రచారంలో పెట్టారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవ్‌కాంత్‌ బారువా ‘ఇందిరే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ అన్నారు. మరొక నినాదం కూడా ఇచ్చారు. ‘వర్తమాన పరిస్థితులలో భారత దేశానికి అసలు ప్రతిపక్షమే అవసరం లేదు’ అని! నాటి హరి యాణా ముఖ్యమంత్రి ఇందిరను జీవితకాలపు అధ్యక్షురాలిగా (పార్టీకి), తద్వారా యావజ్జీవితం దేశ ప్రధానిగా చూడాలని కోరుకున్నారు.ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యం కూడా ఇందిర చర్యకు ప్రాతిపదిక ఇచ్చాయి. ‘సోవియెట్‌ నాయకుల సలహాతో దేశంలో అత్యవసర పరి స్థితి విధించినట్లు అర్థమైంది. సోవియెట్‌లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారిని సైబీరియాకు పంపిస్తారు. ఇక్కడా ప్రతిపక్షాల వారిని అదే విధంగా జైళ్ల పాలు చేశారు.’ మాజీ గవర్నర్, పంజాబ్‌ మాజీ ముఖ్య మంత్రి సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా రాసిన ‘క్వెస్ట్‌ ఫర్‌ ఫ్రీడమ్‌: స్టోరీ ఆఫ్‌ ఏన్‌ ఎస్కేప్‌’ గ్రంథంలోని వాక్యాలివి. బర్నాలా ఎమర్జెన్సీ బాధితుడే. ‘చిలీ పాలకుడు సాల్వెడార్‌ అలెండి తరువాత నిన్నే అమెరికా లక్ష్యంగా చేసుకుంది’ అంటూ క్యూబా అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో చేసిన హెచ్చరికతోనే ఇందిరాగాంధీ ఆగమేఘాల మీద అత్యవసర పరిస్థి తిని విధించారన్న వాదన గురించి సంజయ బారు ప్రస్తావించారు. 1975 జూన్‌ 25 అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్య జయ ప్రకాశ్‌ నారాయణ్‌ను, మొరార్జీ దేశాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. మరునాడు ఉదయం జనసంఘ్‌ నాయకులు వాజ్‌పేయి, అడ్వాణీ, మధు దండావతె, మరికొందరిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఆంధ్రలో పెద్దలు గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, జూపూడి యజ్ఞనారాయణ, యలమంచిలి శివాజీ వంటి వారిని అరెస్టు చేశారు. దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ పేరుతో ఆ 21 మాసాలలో దాదాపు లక్ష మందిని అరెస్టు చేశారు. 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఎదురు దెబ్బ తప్పదు!ఎమర్జెన్సీ విధించిన వెంటనే తీసుకున్న చర్య సెన్సార్‌ షిప్‌. దీనితో దాదాపు భారతీయ పత్రికలన్నీ మూగబోయాయి. ఇది జూన్‌ 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్, ఆనందమార్గ్, జమాతే ఇస్లాం, సీపీఐ (ఎం.ఎల్‌.)లతో సహా 26 సంస్థలపై నిషేధం విధించారు. న్యాయమూర్తులను బదిలీ చేశారు. క్రమశిక్షణ పేరుతో వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆనాడు లోక్‌సభలో ప్రతిపక్షాలన్నింటి బలం అరవై లోపే! కానీ, లోక్‌ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చరిత్రా త్మక ఉద్యమమే జరిగింది. దాంతో లోక్‌సభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఇందిర 1977 జనవరి 18న ఆకాశవాణి ప్రసంగంలో వెల్లడించారు. 1977 జనవరి 20న జనతా పార్టీ ఆవిర్భవించింది. ఆ ఎన్నికలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ,సంజయ్‌గాంధీ కూడా ఓడిపోయారు. 1977 మార్చి 21న తాత్కాలిక రాష్ట్రపతి బి.డి. జెట్టి ఎమర్జెన్సీని రద్దు చేశారు.ఎమర్జెన్సీ అంటే కొందరు విపక్షాల నాయకుల అర్ధరాత్రి అరెస్టులు మాత్రమే కాదు. కోటీ పదకొండు లక్షల మందికి జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు; మీసా, డిఫెన్స్‌ ఇండియా రూల్స్‌ పేరుతో లక్షా పద మూడు వేల మంది అమాయకుల అక్రమ అరెస్టులు; స్వాతంత్య్ర పోరాటం స్ఫూర్తితో ఏర్పడిన రాజ్యాంగానికి జరిగిన తీరని అవమానం. అన్నింటికి మించి భార తీయ ఆత్మకు అది పెద్ద గాయం. న్యాయ వ్యవస్థ, పత్రికా రంగం భంగపడి ప్రజాస్వామ్యం బలహీనమైంది.ఇక అత్యవసర పరిస్థితి, తదితర పరిణామాల ద్వారా కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని తానే సిద్ధం చేసుకుంది. బీజేపీ అనే ఒక రాజకీయ పక్షం అలా దేశ రాజకీయ రంగం మీదకు వచ్చింది.డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త ‘జాగృతి’ సంపాదకుడు ‘ 98493 25634

Sakshi Editorial On Donald Trump Diplomacy6
ఇదెక్కడి దౌత్యనీతి?!

దేన్నయినా ఒకటికి పదిసార్లు చెబితే అది నిజమై కూర్చుంటుందని, ప్రపంచం దాన్ని మాత్రమే విశ్వసిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. పాకిస్తాన్‌ ఉగ్ర ఎత్తుగడను తిప్పికొట్టడానికి మన దేశం ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో అక్కడి ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దానికి ప్రతిగా భారత్‌పై పాక్‌ సైన్యం చేసిన దాడుల్ని తిప్పి కొట్టడంతోపాటు పాకిస్తాన్‌ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. గత నెల 6న మొదలై 9వరకూ సాగిన ఈ ఘర్షణలు... ఇరుపక్షాలూ 11న కాల్పుల విరమణ ప్రకటించటంతో ముగిశాయి. కానీ ట్రంప్‌ వేరే పనిలేనట్టు ఆనాటి నుంచీ ‘కాల్పుల విరమణ’ తన ఘనతేనంటూ చెప్పుకు తిరుగు తున్నారు. అక్కడితో ఆగలేదు. సంధి కుదుర్చుకోనట్టయితే వాణిజ్య ఒప్పందం ఉండబోదని భారత్‌ను హెచ్చరించాకే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. మన దేశం దాన్ని ఖండించినప్పుడు ‘అవును... నిజమే. వారిద్దరూ మాట్లాడుకొని సంధి కుదుర్చుకున్నారు. ఇందులో మాపాత్ర లేద’ని నాలుక మడతేస్తుంటారు. మళ్లీ నాలుగు రోజులు గడిచేసరికల్లా పాత పాటే అందుకుంటారు. భారత్, పాకిస్తాన్‌లు కాల్పుల విరమణ ప్రకటించటానికి కొన్ని గంటల ముందు ట్రంప్‌ ఆ సంగతి వెల్లడించటమైతే వాస్తవం. ప్రకటించటంలో రెండు దేశాలూ కొంత వ్యవధి తీసుకోవటాన్ని ఆసరా చేసుకున్న ట్రంప్‌ దాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా బుధవారం మరోసారి ఆ పనే చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 35 నిమిషాలసేపు ఆయనతో ఫోన్‌లో సంభాషించారు. ‘కాల్పుల విరమణ ప్రతిపాదన ఏ దశలోనూ మీ నుంచి రాలేదు. అలాగే వాణిజ్య ఒప్పందం గురించి ఇంతవరకూ మీ దేశంతో చర్చించలేదు’ అని వివరణనిచ్చారు. అక్కడితో అయిందనుకుంటే... మరికొన్ని గంటలు గడిచాక మరోసారి ట్రంప్‌ పాత పాటే వినిపించారు.రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించి ఆయన అభాసుపాలయ్యారు. అక్కడ యథావిధిగా పోరు సాగుతోంది. గాజాలో ఇప్పటికి 56,000 మంది పౌరుల్ని ఊచకోత కోసిన ఇజ్రాయెల్‌పై చర్యకు అడ్డుపడటమే కాదు... వారంరోజుల క్రితం దాన్ని ఉసిగొల్పి ఇరాన్‌పై దాడులు చేయించారు. ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్‌ను బెదిరిస్తున్నారు. పైగా ఆ దేశంపై సైనిక దాడికి పథక రచన చేస్తున్నారు. పశ్చిమాసియా ఊబిలోకి దేశాన్ని దించవద్దంటూ స్వదేశంలో, స్వపక్షంలో అనేకులు హెచ్చరిస్తున్నా ట్రంప్‌కు పట్టడం లేదు. ఇలాంటి వ్యక్తి భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంధి కుదిర్చానని ఎలా చెప్పుకుంటారో అనూహ్యం. కశ్మీర్‌ సమస్యపై గానీ, భారత్‌–పాక్‌ల మధ్య ఉన్న ఇతరేతర సమస్యలపై గానీ మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించ బోమని దశాబ్దాలుగా భారత్‌ చెబుతూనే ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ వైఖరే కొనసాగుతోంది. తాజాగా మోదీ ప్రభుత్వం దీన్ని మరికాస్త సవరించింది. మూడో పక్షం జోక్యాన్ని ఒప్పుకోబోమని చెబుతూనే మున్ముందు పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) పైనా, ఉగ్రవాదుల అప్పగింత పైనా మాత్రమేనని స్పష్టం చేసింది. ట్రంప్‌తో సంభాషించినప్పుడు పెహల్‌గామ్‌ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మొదలుకొని అన్ని విషయాలూ మోదీ పూసగుచ్చినట్టు చెప్పారని, ఇక నుంచి ఉగ్రదాడిని పరోక్ష యుద్ధంగా పరిగణించదల్చుకోలే దని, దాన్ని యుద్ధంగానే చూస్తామన్నారని మన విదేశాంగ కార్యదర్శి మిస్రీ తెలియజేశారు. జిత్తులమారితనం దౌత్యం అనిపించుకోదు. స్పష్టంగా, పారదర్శకంగా, అరమరికలు లేకుండా వ్యవహరించినప్పుడే ఎంతటి సంక్లిష్ట సమస్యయినా దారికొస్తుంది. దౌత్యం విజయవంతమవుతుంది. బెదిరింపులకు దిగటం, బెదిరించానని గొప్పలుపోవటం దౌత్యమెలా అవుతుంది? తన వ్యాపారాన్ని విస్తరించుకోవటానికీ, ప్రత్యర్థులపై పైచేయి సాధించటానికీ పూర్వాశ్రమంలో నేర్చు కున్న కళలన్నీ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ప్రదర్శిస్తున్నట్టు కనబడుతోంది. దీన్ని వదిలించుకోనట్టయితే నవ్వులపాలవుతానన్న ఆలోచన ఆయనకు స్ఫురిస్తున్నట్టు లేదు. ఉగ్రవాదులకు పాక్‌ సైన్యం ఊత మిస్తున్న వైనం స్పష్టంగా కనబడుతున్నా ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు బుధవారం విందుకు ఆహ్వానించారు. అది ఆయన ఇష్టం. కానీ అదే రోజు మోదీ అక్కడుండాలని కోరుకోవటం, వేరే దేశాల పర్యటన రద్దుచేసుకుని వాషింగ్టన్‌ రమ్మనటం హుందాతనం అనిపించుకుంటుందా? పర స్పరం కత్తులు దూసుకుంటున్న వైరిపక్షాలను ఒకేసారి పిలవటం తెలివితక్కువతనం అను కోవాలా? అతి తెలివి అనుకోవాలా? ఒకపక్క కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయం చేయటం సమ్మతం కాదని మన దేశం పదే పదే చెబుతున్నా ఈ మూర్ఖత్వం దేనికి? రేపో మాపో ఇరాన్‌పై తాము దండెత్తితే రీఫ్యూయలింగ్‌ కోసం పాకిస్తాన్‌ అవసరపడుతుంది. అందుకోసం ఆ దేశాన్ని దువ్వుతూ మనల్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నట్టు ఈ కపటనాటకం ఎందుకు?జీ7 శిఖరాగ్ర సదస్సు నుంచి హడావిడిగా నిష్క్రమించనట్టయితే, అక్కడ మోదీ ప్రసంగాన్ని నేరుగా విన్నట్టయితే ట్రంప్‌కు విషయం కాస్తయినా అర్థమయ్యేది. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమా ణాలు పాటిస్తున్న పాశ్చాత్య దేశాలను మోదీ నిశితంగా విమర్శించారు. సొంత కారణాలతో కొన్ని దేశాలపై ఆంక్షలు పెడుతూ, ఉగ్రవాదుల్ని ఉసిగొల్పే దేశాలను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారని మోదీ చెప్పారు. అయినా ట్రంప్‌ ధోరణి మారలేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌తో సహా అన్ని అంతర్జాతీయ అంశాల్లోనూ స్వతంత్ర విధానం పాటించటమే మనకు శ్రేయస్కరం. ద్వంద్వ నీతిని అనుసరించేవారికి తమ స్థానం ఏమిటో చెప్పనట్టయితే మనమే నష్టపోతాం.

Iranian missile hits Beersheba hospital7
ఆస్పత్రిపై క్షిపణుల దాడి 

బీర్‌షెబా/టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌/దుబాయ్‌/వాషింగ్టన్‌: అంతూదరీ లేకుండా భీకరంగా కొనసాగుతూ పశ్చిమాసియా శాంతిదీపం కొండెక్కేలా చేస్తున్న ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం మరింతగా విస్తరిస్తోంది. కయ్యానికి కాలు దువ్వుతూ యుద్ధజ్వాలను మరింత రాజేసిన ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ గురువారం బదులు తీర్చుకుంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్‌ ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. వాటిల్లో కొన్ని బాలిస్టిక్‌ క్షిపణులు దక్షిణ ఇజ్రాయెల్‌లోనే అత్యంత పెద్ద ఆస్పత్రి అయిన బీర్‌షెబా నగరంలోని వేయి పడకల సొరొక ఆస్పత్రిపై పడ్డాయి. క్షిపణుల ధాటికి ఆస్పత్రి ధ్వంసమైంది. ఈ దాడి ఘటనలో 80 మందికిపైగా గాయాలపాలయ్యారు. మంటలు అంటుకుని, అగి్నకీలలు ఎగసిపడుతున్న భవనం నుంచి రోగులను సహాయక బృందాలు స్ట్రెచర్‌లపై బయటకు తీసుకొస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఆస్పత్రిపై దాడి జరగబోతోందని సైరన్లు వినిపించడంతో చాలా మంది ముందుగానే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆస్పత్రిలో కొంతభాగాన్ని ఒకరోజు ముందే ఖాళీచేయించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆస్పత్రిలో 700 మంది రోగులున్నారు. గురువారం దేశవ్యాప్తంగా ఇరాన్‌ జరిపిన దాడుల్లో 270కిపైగా ఇజ్రాయెలీలు రక్తమోడారు. టెల్‌ అవీవ్, రమాత్‌ గాన్, రెహోవోత్‌ సిటీ సహా పలు నగరాలపైనా ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించింది. పలు భవనాలు పాక్షికంగా ధ్వంసమైన దృశ్యాలను ఇజ్రాయెల్‌ టీవీచానళ్లు ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. సిటీలోని గవ్‌యమ్‌ నెగెవ్‌ ఇజ్రాయెల్‌ సైనిక నిఘా కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోగా పొరపాటున ఆస్పత్రిపై క్షిపణులు పడ్డాయని తెలుస్తోంది. అయితే ఇరాన్‌ ఉద్దేశపూర్వకంగానే పౌరుల రక్తం కళ్లజూస్తోందని, ఇందుకు ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ అన్నారు. ‘‘మాకు అమెరికా సాయం చేస్తుందన్న నమ్మకం నాకుంది. అమెరికాకు ఏది అత్యుత్తమమో అదే ట్రంప్‌ చేస్తారు’’ అని నెతన్యాహూ అన్నారు. అయితే యుద్ధంలో పాల్గొనాలా వద్దా అనేదానిపై మరో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని శ్వేతసౌధం ప్రకటించింది. చర్చలకు ఇంకా అవకాశం ఉందని ట్రంప్‌ భావిస్తున్నారని వైట్‌హౌస్‌ ప్రెస్‌సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ చెప్పారు. ప్లుటోనియం చిక్కకుండా దాడులు ప్రస్తుతం క్రియాశీలంగా లేని ఇరాన్‌లోని ఖోŠన్‌దాబ్‌ పట్టణ సమీపంలోని అరాక్‌ భారజల రియాక్టర్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు దాడులుచేశాయి. దాడుల తర్వాత ఈ రియాక్టర్‌ నుంచి ఎలాంటి రేడియోధారి్మకత వెలువడలేదని ఇరాన్‌ తెలిపింది. అణురియాక్టర్లను చల్లబరిచేందుకు భారజలాన్ని ఉపయోగిస్తారు. ఇలా అణురియాక్టర్లను చల్లబరిచినప్పుడు ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా ప్లుటోనియం అనే అత్యంత శక్తివంతమైన పేలుడుపదార్థం ఏర్పడుతుంది. దీనిని సైతం అణుబాంబు తయారీలో ఉపయోగించుకోవచ్చు. యురేనియంను 90 శాతం శుద్ధ్దత స్థాయికి తీసుకొచ్చాకే అణుబాంబు తయారీకి పనికొస్తుంది. యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్‌ క్షిపణిదాడుల నేపథ్యంలో ఇరాన్‌కు అణుబాంబు తయారీలో ఈ ప్లుటోనియం అక్కరకొస్తుంది. ఇలా ఉపయోగపడకూడదనే ఉద్దేశంలోనే అరాక్‌ హెవీవాటర్‌ రియాక్టర్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులుచేసింది. గురువారం నాటికి యుద్ధంలో ఇరాన్‌లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 639 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,300 మందికిపైగా గాయాలపాలయ్యారు. దీనికి ప్రతిగా ఇరాన్‌ ప్రయోగించిన 400కుపైగా క్షిపణుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది చనిపోయారు. అప్రమత్తంగా ఉన్న అమెరికా యుద్ధవిమానాలు అత్యవసర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు సాయం చేయాల్సి వస్తే ఇరాన్‌ ప్రతిదాడులు చేస్తుందన్న అంచనాతో అమెరికా యుద్ధవిమానాలను ఆయా వైమానిక స్థావరాల నుంచి వేరే చోటుకు తరలించారు. ముఖ్యంగా ఖతార్‌లోని దోహాలో ఉన్న అల్‌ ఉదేయిద్‌ అమెరికా వైమానిక స్థావరంలోని సైనిక, ఆయుధ రవాణా విమానాలు, యుద్ధవిమానాలు, డ్రోన్లను వేరే చోటుకు తరలించినట్లు తెలుస్తోంది. తొలుత దాక్కుని తర్వాత దాడి చేయడం అమెరికా వ్యూహమని కొందరు యుద్ధనిపుణులు చెప్పారు. మరోవైపు భారత్, జపాన్, చైనా, ఇండోనేసియా, ఒమన్‌ తదతర దేశాలు తమ పౌరులను ఇరాన్‌ నుంచి సురక్షితంగా స్వదేశానికి తరలిస్తున్నాయి.

Sakshi Guest Column On Air India Plane Crash at Ahmedabad8
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం

ఒక ప్రమాదం, అందులోనూ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, జరగగానే ఒకటి రెండు రోజులు గగ్గోలు పెట్టడం, ఆ ప్రమాద కారణాలను గుర్తించి సవరించే పని ఎంత మాత్రమూ చేయకుండా మరొక ప్రమాదం దాకా మౌనంగా ఉండి పోవడం మన సమాజానికీ, రాజ కీయ నాయకత్వానికీ, ప్రచార సాధ నాలకూ బాగా అలవాటు అయిపోయింది. నిజానికి సమాజం మొత్తంగా ఇందులో చేయగలిగినదేమీ లేదు. ఆ బాధ్యత రాజకీయ నాయకత్వాలదీ, ప్రభుత్వాలదీ, అధికార వ్యవస్థలదీ! ఒక ప్రమాదం జరగగానే కూలంకుషంగా అధ్యయనం చేసి, ప్రమాద కారణాలను అన్వేషించి, మరొకసారి అటువంటి ప్రమాదం జరగడానికి వీలులేని విధంగా ఆ కారణాలన్నిటినీ తొలగించవలసిన బాధ్యత అధికార వ్యవస్థలదే! అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం అత్యంత విషాద కరమైన, ఘోరమైన ప్రమాదం. టేకాఫ్‌ అయిన కొద్ది సెకన్ల లోనే కూలిపోయి, 241 మంది విమాన ప్రయాణికులు, కనీసం 40 మంది ఇతరులు చనిపోయారు. ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో శాస్త్రీయ విశ్లేషణ జరిపి కారణాలు నిర్ధారించడానికి మూడు నాలుగేళ్లు పడుతుందంటున్నారు. ఈలోగా మన వాట్సప్‌ కార్ఖానాలూ, వాచాల త్వమే పెట్టుబడిగా నడుస్తున్న ఛానళ్లూ, సంచలనాత్మకమైతే చాలు ఎంత అబద్ధమైనా, ఎంత నిరాధారమైనా మాట్లాడ వచ్చునని అనుకుంటున్న సామాజిక మాధ్యమాలూ చాలా కారణాలను వండి వార్చాయి.ఈ ప్రమాదానికి సాంకేతిక కారణాలు ఎట్లాగూ అధ్యయనంలో బయటపడతాయి కాని ఈలోగా ఆలోచించ వలసిన సామాజిక, రాజకీయార్థిక కోణాల వైపు నుంచి చూస్తే అధికార వ్యవస్థల నిర్లక్ష్యం, లేదా లాభాపేక్షాపరుల అక్రమాలను అధికారులు అవినీతి వల్లనో, సోమరితనం వల్లనో చూసీ చూడనట్టు పోవడం మూల కారణం అని తేలుతుంది. ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించి 2022 జనవరిలో టాటా గ్రూప్‌కు అప్పగించినప్పటి నుంచీ గడచిన మూడేళ్లలో ఆ సంస్థ నిర్వహణలో భద్రతా లోపాల గురించీ, నిర్వహణ లోపాల గురించీ, నిబంధనల ఉల్లంఘనలగురించీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనేక సార్లు మందలించింది, జరిమానాలు వేసింది, హెచ్చ రించింది. విమానాల నిర్వహణలో, కాక్‌ పిట్‌ క్రమశిక్షణలో, అంతర్గత జవాబుదారీతనంలో లోపాలను ఎత్తి చూపింది. అర్హత లేని పైలట్లను వాడుతున్నారని 2025 జనవరిలో కూడా ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించింది. అహ్మదాబాద్‌ సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌ అంత ర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత ప్రమాదకర విమానాశ్రయాలలో ఒకటని గతంలోనే పేరు పొందింది. విమానాలకు పక్షుల తాకిడి అతి ఎక్కువగా ఉండే విమానా శ్రయం అది. ఎందువల్లనంటే దాని రన్‌ వేలు సరాసరిగా కిక్కిరిసిన జనసమ్మర్దపు కాలనీలకూ, భవనాలకూ అంటు కుని ఉంటాయి. రన్‌ వేకూ నివాస గృహ, భవన సము దాయాలకూ మధ్య ప్రామాణికంగా ఉండవలసినంత దూరం కాదు గదా, కనీసమైన స్థలం కూడా లేదు. అందు వల్ల టేకాఫ్‌లో విఫలమయ్యే విమానం ఆ నివాస గృహాల మీద కూలిపోక తప్పదు. ఆ నివాస గృహాల భవన సముదాయాల కుప్పలో ఒకటి ఇప్పుడు నలభై మంది వైద్య విద్యార్థులు మరణించిన బీజే మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థి వసతిగృహం. అయితే ఈ సంగతి ఇప్పుడు, ఇంత ఘోరమైన ప్రమాదం జరిగాక మాత్రమే తెలిసినది కాదు. ఎన్నో భద్రతా అధ్యయనాలు ఈ సంగతి ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నాయి. విమానాశ్రయ రన్‌ వే అంచుల్లో నివాస గృహాలు ఉన్నాయనీ, ఆ ఇళ్లవాళ్లు తమ చెత్తను ఈ గోడ ఇవతల పారబోస్తున్నారనీ, అక్కడ పురుగులు చేరి, ఆ పురుగుల కోసం పక్షులు వచ్చి, సరిగ్గా విమానం టేకాఫ్‌ సమయంలో ఫాన్‌లలోకి పక్షులు ఎగిరే అవకాశం ఉందనీ; అక్కడ నేల చదునుగా లేదనీ, మురికి కాల్వల మాన్‌ హోల్స్‌ మీద కప్పులు కూడా లేవనీ ఇదివరకు తెలిసిన విషయాలే. అధ్యయనాలలో, నివేదికలలో రాసినవే. పరిష్కరించాలని సిఫారసులు అందినవే. డీజీసీఏ 2019 నివేదికలోనే అహ్మ దాబాద్‌ విమానాశ్రయం భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలమయిందని వివరంగా రాసింది. అంతకు ముందే 2018లో ‘ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ గుజరాత్‌ ప్రభుత్వానికి సమర్పించిన ఒక విజ్ఞాపనలో రన్‌ వే భద్రత కోసం, 29.79 ఎకరాల అదనపు స్థలం కావాలని కోరింది. దానికి గుజరాత్‌ ప్రభుత్వ ఆమోదం కూడా దొరి కింది. కాని అక్కడ ఉన్న 350 కుటుంబాలను తరలించి, స్థలం ఖాళీ చేయించడంలో రాజకీయాలు అడ్డుపడి ఏడు సంవత్సరాలు గడిచినా ఆ పని జరగలేదు.ప్రస్తుత విమానాశ్రయం మీద ఒత్తిడి తగ్గించే పరి ష్కారంగా ధోలేరాలో పదివేల ఎకరాలలో రెండో విమా నాశ్రయాన్ని 2022లో ప్రకటించారు. అది 2025 కల్లా ప్రారంభమవుతుందన్నారు. దాని ప్రచార కార్యక్రమం నడిచినంతగా నిర్మాణ కార్యకలాపాలు సాగలేదు.విజయ్‌ రూపానీ ఐదు సంవత్సరాల పాటు 2016 నుంచి 2021 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రమా దాల హెచ్చరికలన్నీ ఉన్నాయి. వాటిని నివారించే అవకాశాలూ ఉన్నాయి. కాని నిర్లక్ష్యమే రాజ్యమేలింది. ప్రస్తుత విమాన ప్రమాదంలో రూపానీ విషాదకర మరణానికి ఆ నిర్లక్ష్యమూ కారణమే! ఎన్‌. వేణుగోపాల్‌ వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్‌

Supreme Court: No restriction on Kamal Haasan Thug Life9
కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. సినిమాను, స్టాండప్‌ కామెడీని ఆపలేం

న్యూఢిల్లీ: కమల్‌ హాసన్‌ స్టారర్‌ ‘థగ్‌ లైఫ్‌’సినిమా విడుదలను అడ్డుకునే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయనే కారణంతో సినిమా, స్టాండప్‌ కామెడీ లేదా కవితా గోష్టి వంటి వాటిని ఆపలేమని స్పష్టం చేసింది. ‘మన దేశంలో మనోభావాలను దెబ్బతీసే ఘటనలకు ముగింపు కనిపించడం లేదు. స్టాండప్‌ కమెడియన్‌ ఏదో అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని, విధ్వంసం, నిరసనలకు దిగుతున్నారు. ఎటు వెళ్తున్నాం మనం? ఏంటి దీనర్థం? నిరసనలు చేపట్టారనే కారణంతో సినిమా, స్టాండప్‌ కామెడీ షో, కవితా గోష్టి వంటి వాటిని ఆపేయాలా?’అంటూ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ మన్మోహన్‌ల ధర్మాసనం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. కమల్‌ హాసన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో విడుదల ఆగిన ‘థగ్‌ లైఫ్‌’ను కర్ణాటకలో ప్రదర్శించేందుకు ఆదేశాలివ్వాలంటూ మహేశ్‌ రెడ్డి వేసిన పిల్‌పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన సమయంలో తగు భద్రత కల్పిస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీకి ధర్మాసనం అంగీకరించింది. ఏ వ్యక్తి గానీ, సమూహం గానీ సినిమా ప్రదర్శనకు అవరోధం కల్పించినా, నష్టపరిచినా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నామంది. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలంటూ కమల్‌ హాసన్‌ను కర్ణాటక ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(కేఎఫ్‌సీసీ) కోరడంపై ధర్మాసనం..‘దీనికి మేం అస్సలు అంగీకరించం. ఒక అభిప్రాయం కారణంగా సినిమాను అడ్డుకుంటారా? స్టాండప్‌ కామెడీని, కవితా పఠాన్ని ఆపేస్తారా?’అని ప్రశ్నించింది. అయితే, తమకు కొన్ని సమూహాల నుంచి బెదిరింపులు వచ్చినందునే కమల్‌ను క్షమాపణ చెప్పాలని ఒక లేఖ ద్వారానే కోరామని, అంతే తప్ప కమల్‌ను బెదిరించలేదని కేఎఫ్‌సీసీ వివరించింది. బెదిరింపుల విషయాన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని కేఎఫ్‌సీసీని ధర్మాసనం ప్రశ్నించింది. సినిమా విడుదల చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వచ్చిన బెదిరింపుల విషయం తెలపగా కేఎఫ్‌సీసీ స్పందించలేదని మహేశ్‌ రెడ్డి తర ఫు లాయర్‌ తెలిపారు. బెదిరించిన వారిపై చర్యలు తప్పక తీసుకుంటామని రాష్ట్ర ప్రభు త్వ లాయర్‌ హామీ ఇచ్చారు. కన్నడ సాహిత్య పరిషత్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ నూలి వాదనలు వినిపించారు. కమల్‌ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కమల్‌ క్షమాపణ చెబితేనే రాష్ట్రంలో ఆ సినిమా ప్రదర్శన వీలవుతుందని, లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘అంటే..థగ్‌ లైఫ్‌ అనధికార బ్యాన్‌ను, థియేటర్లను బుగ్గిపాలు చేసేందుకు మీరు మద్దతిస్తున్నారా?’అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘క్షమాపణ చెప్పడం ఏమిటి? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. మనోభావాలు గాయపడితే పరువునష్టం కేసు వేయండి..!’అని ధర్మాసనం పేర్కొంది. హింసకు పాల్పడే వారిని తాము ప్రోత్సహించమంటూ కన్నడ సంస్థ తరఫు లాయర్‌ పేర్కొనగా ‘సినిమా విడుదలను కూడా మీరు అడ్డుకోరాదు’అని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది.

India vs England first Test match from today10
భారత్‌ ‘పరీక్ష’ మొదలు

భారత టెస్టు క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి తెర లేస్తోంది. సుదీర్ఘ కాలం జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, అశ్విన్‌ల రిటైర్మెంట్‌ తర్వాత జట్టు తొలి సిరీస్‌ బరిలోకి దిగుతోంది. టెస్టు ఫార్మాట్‌లో కొత్త సారథిగా బాధ్యతలు తీసుకున్న శుబ్‌మన్‌ గిల్‌కు తొలి సిరీస్‌లో కఠిన పరీక్ష ఎదురవుతోంది.ప్రత్యర్థి గడ్డపై ఇప్పటి వరకు మన రికార్డు, ప్రస్తుత యువ జట్టు అనుభవాన్ని చూస్తే ఇది పెద్ద సవాల్‌. టీమ్‌ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో పాటు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా గిల్‌ తనను తాను నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. అయితే గతంలోనూ పాత చరిత్రను మార్చిసంచలనాలు సృష్టించిన భారత బృందం మరోసారి అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తే అనూహ్య ఫలితాలు ఖాయం. లీడ్స్‌: భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ పోరుకు సైరన్‌ మోగింది. ‘అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య హెడింగ్లీ మైదానంలో నేటి నుంచి తొలి టెస్టు జరగనుంది. ఏడాది క్రితం భారత గడ్డపై జరిగిన టెస్టు పోరులో టీమిండియా 4–1తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు తమ సొంత మైదానంలో దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని స్టోక్స్‌ బృందం భావిస్తుండగా... అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబర్చి పైచేయి సాధించాలని భారత్‌ పట్టుదలగా ఉంది. టెస్టుల్లో భారత్‌కు 37వ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన గిల్‌కు ఇది కీలక సిరీస్‌ కానుండగా... బ్యాటర్‌గా ఇంగ్లండ్‌ గడ్డపై పేలవ రికార్డు ఉన్న హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా గెలుపుపై గురి పెట్టాడు. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్‌కు స్వదేశంలో మంచి ఫలితాలు అందించిన ‘బజ్‌బాల్‌’ శైలి ఆట ఈసారి ఎలాంటి ఫలితాలు అందిస్తుందనేది ఆసక్తికరం. ఆరో స్థానంలో ఎవరు? తొలి టెస్టులో భారత తుది జట్టు దాదాపుగా ఖాయమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్‌ ఆడనుండగా మూడో స్థానంలో కరుణ్‌ నాయర్‌ బరిలోకి దిగుతాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆకట్టుకున్న జైస్వాల్‌తో పాటు రాహుల్‌ కూడా రాణిస్తే జట్టుకు శుభారంభం లభిస్తుంది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ ఆడనున్న కరుణ్‌ నాయర్‌ తన ఇటీవలి దేశవాళీ ఫామ్‌ను కొనసాగించడంతో పాటు జట్టులో స్థానం కాపాడుకునే ఒత్తిడిని కూడా అధిగమించాల్సి ఉంటుంది. నాలుగో స్థానంలో ఆడనున్న గిల్‌ తన బ్యాటింగ్‌తో అంచనాలు అందుకోవడం కీలకం. ఆసీస్‌ గడ్డపై విఫలమైన పంత్‌ మరింత బాధ్యతగా ఆడాల్సిన తరుణమిది. భారత జట్టు విజయావకాశాలు పేసర్‌ బుమ్రాపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. సొంత మైదానంలో అయినా సరే ఇంగ్లండ్‌ బ్యాటర్లు అతడిని సమర్థంగా ఎదుర్కోవడం అంత సులువు కాదు. సిరాజ్‌ కూడా స్వింగ్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు. మూడో పేసర్‌గా ప్రసిధ్‌ కృష్ణ ఆడటం కూడా దాదాపు ఖాయమే. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ తన సత్తాను ఈ సిరీస్‌లో నిరూపించుకోవాల్సి ఉంది. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా స్థానానికి ఢోకా లేదు. అయితే మిగిలిన ఆరో స్థానం కోసమే జట్టులో గట్టి పోటీ ఉంది. ఇక్కడా రెగ్యులర్‌ బ్యాటర్‌ను ఆడిస్తారా లేక ఆల్‌రౌండర్‌కు అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బ్యాటర్‌ అయితే సాయి సుదర్శన్‌ అరంగేట్రం చేయవచ్చు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కావాలంటే శార్దుల్‌ ఠాకూర్‌ లేదా నితీశ్‌ కుమార్‌ రెడ్డిలలో ఒకరికి చాన్స్‌ దక్కుతుంది. లేదా స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ రూపంలో ప్రత్యామ్నాయం ఉంది. బౌలింగ్‌లో అనుభవలేమి... దాదాపు రెండు దశాబ్దాల పాటు అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్‌ బలంపైనే ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆధారపడుతూ వచి్చంది. వీరిద్దరు కలిసి ప్రత్యర్థులను కుప్పకూలుస్తూ ఎన్నో విజయాలు అందించారు. అయితే ఇప్పటి పేస్‌ బృందానికి చాలా తక్కువ అనుభవం ఉంది. ఈ బౌలింగ్‌ దళం ప్రత్యర్థిని ఏమాత్రం భయపెట్టించేలా లేదు. కార్స్‌ 5, టంగ్‌ 3 టెస్టులు ఆడగా...అనుభవజ్ఞుడే అయినా అండర్సన్, బ్రాడ్‌లతో పోలిస్తే క్రిస్‌ వోక్స్‌ స్థాయి తక్కువ. భారత బ్యాటర్ల కోణంలో చూస్తే స్పిన్నర్‌ బషీర్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. అందుకే ఇంగ్లండ్‌ ఈ సిరీస్‌లో తమ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. 13 వేలకు పైగా టెస్టు పరుగులు సాధించిన రూట్‌ మరోసారి బ్యాటింగ్‌ బాధ్యత మోస్తున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది కీలకం. ‘బజ్‌బాల్‌’ వచ్చాక ఎన్నో శుభారంభాలు అందించిన క్రాలీ, డకెట్‌ నుంచి మరో సారి జట్టు అదే ఆటను ఆశిస్తోంది. పోప్‌తో పాటు ప్రతిభావంతుడైన బ్రూక్‌పై జట్టు బ్యాటింగ్‌ భారం ఉంది. కెప్టెన్‌ స్టోక్స్‌ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడి చాలా కాలమైంది. గత మూడేళ్లుగా అతను సెంచరీనే చేయలేదు. భారత గడ్డపై ఆడిన ఐదు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమైన స్టోక్స్‌ ఎలాంటి ప్రభావం చూపించగలడనేది కీలకం. 3 ఇంగ్లండ్‌ గడ్డపై భారత్‌ 19 టెస్టు సిరీస్‌లు ఆడింది. ఇందులో 3 సిరీస్‌లను (1971లో, 1986లో, 2007లో) సొంతం చేసుకుంది. 14 సిరీస్‌లను చేజార్చుకుంది. మరో 2 సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి.67 ఇప్పటి వరకు ఇంగ్లండ్‌ గడ్డపై ఇంగ్లండ్‌ జట్టుతో భారత్‌ 67 టెస్టులు ఆడింది. 9 టెస్టుల్లో గెలిచిన భారత్‌ 36 టెస్టుల్లో ఓడిపోయింది. మరో 22 టెస్టులను టీమిండియా ‘డ్రా’ చేసుకుంది.7 హెడింగ్లీ మైదానంలో భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మొత్తం 7 టెస్టులు జరిగాయి. 2 టెస్టుల్లో భారత్, 4 టెస్టుల్లో ఇంగ్లండ్‌ గెలుపొందాయి. 1 టెస్టు ‘డ్రా’గా ముగిసింది. పిచ్, వాతావరణం హెడింగ్లీ మైదానంలో తొలిసారి ఆరంభంలో పేసర్లకు కాస్త అవకాశం ఉన్నా ఆట సాగిన కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలం కావొచ్చు. ఇంగ్లండ్‌ కూడా పూర్తిగా బౌలింగ్‌ పిచ్‌ను ఎంచుకునే సాహసం చేయడం లేదు. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్ష సూచన లేదు. తుది జట్లు ఇంగ్లండ్‌: స్టోక్స్‌ (కెప్టెన్‌), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, కార్స్, టంగ్, బషీర్‌. భారత్‌ (అంచనా): గిల్‌(కెప్టెన్‌), జైస్వాల్, రాహుల్, కరుణ్‌ నాయర్, పంత్, సుదర్శన్‌/నితీశ్‌ రెడ్డి, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, కుల్దీప్‌.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement