ధర లేక దిగాలు | Kharif rains at the beginning of this year | Sakshi

ధర లేక దిగాలు

Oct 23 2013 2:56 AM | Updated on Oct 8 2018 5:04 PM

ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు అనుకూలించడం, చీడపీడలు పెద్దగా ఆశించకపోవడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా మొక్కజొన్న అధిక దిగుబడి వచ్చింది.

మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి : ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు అనుకూలించడం, చీడపీడలు పెద్దగా ఆశించకపోవడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా మొక్కజొన్న అధిక దిగుబడి వచ్చింది. అయితే ఈ సారి క్వింటాలుకు రూ.1310 మద్దతు ధరగా నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో సిరులపంట పండిందని రైతులు సంతోషించారు. అధికారులు అంతలోనే వారి ఆశలపై నీళ్లుచల్లారు.
 
 రైతులు మొక్కజొన్నను మార్కెట్‌యార్డుకు తీసుకెళ్తే దళారులు రంగప్రవేశం చేయడంతో క్వింటాలుకు వెయ్యి రూపాయలకు మించి ధర పలకడం లేదు. వ్యాపారులు తేమశాతం పేరుతో నిలువునా మోసం చేస్తున్నారు.
 
 ఈ ఏడాది దాదాపు 42లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, నవాబ్‌పేట, బాదేపల్లి,నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్ మార్కెట్‌యార్డుల్లో మొక్కజొన్నను విక్రయించేందుకు వెళ్లగా అక్కడ  వ్యాపారులు రింగ్‌గా ఏర్పడి వారు నిర్ణయించిందే ధర అనేరీతిలో వ్యవహరిస్తున్నారు.
 
 ఈ వ్యవహారంపై రైతులు పెద్దఎత్తున ఆందోళన చేయడంతో జిల్లా యంత్రాంగం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు మార్కెట్ యార్డుల్లో కౌంటర్లను ఏర్పాటుచేసింది. అయితే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు అంత ఉత్సాహం కనబరచడం లేదు. హమాలీల కొరత తీవ్రంగా ఉందని అందుకోసమే మొక్కజొన్న కొనుగోలు చేయడానికి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రెండురోజుల క్రితం ఏడుచోట్ల మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కౌంటర్లు ఏర్పాటు చేసినా ఇప్పటివరకు కేవలం 616 క్వింటాళ్ల మొక్కజొన్నను మాత్రమే కొనుగోలుచేశారు.
 

 రైతన్నకు దక్కని మద్దతు
 ఇదిలాఉండగా మంగళవారం వ్యాపారులు మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డులో 513 క్వింటాళ్లు, బాదేపల్లి మార్కెట్లో 4746, అచ్చంపేటలో 572 మొత్తం 5831 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. ఆయా మార్కెట్లలో ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు ఒక్కరైతుకు కూడా మద్దతుధర చెల్లించలేదు. వనపర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, నవాబ్‌పేట మార్కెట్లలో కొనుగోళ్లు జరగలేదు.

బాదేపల్లి వ్యవసాయమార్కెట్ యార్డులో సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 4,69,668 క్వింటాళ్ల మొక్కజొన్నను వ్యాపారులు కొనుగోలు చేసినా ఒక్క రైతుకు కూడా మద్దతుధర దక్కలేదు. మద్దతు ధర కోసం మొక్కజొన్నను మార్కెట్‌లోనే ఉంచిన రైతులకు వరుణుడి దెబ్బ తగిలింది. అకాలవర్షం కురియడంతో కష్టమంతా వర్షార్పణమైంది. దాదాపు 80వేల బస్తాలు వర్షపు నీటిలో తడిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. మద్దతుధర కోసం ఎదురుచూస్తే తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 తేమ పేరుతో దోపిడీ
 మొక్కజొన్నకు తేమ ఎక్కువ గా ఉందనే సాకు చూపి వ్యా పారులు దోపిడీ చేస్తున్నారు. దోపిడీ గురించి నిలదీసిన రై తుల మొక్క జొన్నను కొనుగోలు చేయడం లేదు. మొన్నటి దాకా వ్యాపారస్తులు కొనకుండా వది లేస్తే మార్క్‌ఫెడ్ అధికారులైనా కొనుగోలు చేస్తారనుకున్నాం. తేమ పేరుతో వాళ్లూ కొనుగోలు చే యడం మానేశారు. దీంతో పది రోజులుగా ధా న్యంతో మార్కెట్లోనే మగ్గుతున్నాం. ఇన్నాళ్లూ మంచి ధర కోసం వేచి చూశాం. చివరకు ధర రా కపోగా ప్రస్తుతం ఎవరూ కొనే పరిస్థితి లేదు.
 - నర్సింహులు, రైతు,
 రుక్కంపల్లి, నవాబ్‌పేట మండలం
 
 ధర రావడం లేదు
 మార్క్‌ఫెడ్ వాళ్లు తేమ ఎక్కువగా ఉందని వదిలేయడం తో వ్యాపారులు ఈ ధాన్యా న్ని మరింత తక్కువకు అడుగుతున్నారు. దీంతో గిట్టుబాటు ధర అటుంచితే మామూలు ధర కూడా వచ్చే పరిస్థితి కనిపించ డం లేదు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలి యడం లేదు.  
 - రాంచందర్, ఇప్పటూరు, నవాబ్‌పేట మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement