
నెల్లూరు : టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. కనీసం జీతభత్యాకు కూడా వేస్ అండ్ మీన్స్ కింద అప్పు తీసుకొచ్చి చెల్లించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచంలో తానే గొప్ప ఆర్థికవేత్తగా చెప్పుకునే చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని నిప్పులు చెరిగారు.
ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘అభివృద్ధి తానే చేశానని చెప్పే బాబు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఉన్నతాధికారులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారు. తమ అనుచరులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కొత్త రకం దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు పెరగక పోగా అప్పులు పెరిగాయి. ఎన్నికలు పూర్తయిన తరువాత తన అనునాయులకు నిధులు కట్టబెట్టేందుకు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఆర్థిక శాఖ ద్వారా ఏదైనా జీఓ వస్తే దాన్ని వెబ్ సైట్లో పెట్టాలి. రహస్య జీఓల పేరుతో ఉత్తర్వులు ఇచ్చి నిధులను కొల్లగొడుతున్నారు. ఈ జీవోలను బయట పెట్టాలని గవర్నర్ నరసింహాన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డిమాండ్ చేస్తున్నాము. దీనిపై విచారణ చేసి కుట్రదారులను బయట పెట్టాలి. పోలవరం పేరుతో 11 వేల కోట్ల రూపాయల మేర నిధులను కట్టబెడుతున్నారు. సమీక్షల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకునేందుకు చంద్రబాబు పని చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఇచ్చిన జీఓలపై విచారణ చేయాలి. దీనిపై తక్షణం ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment