
పురిటిలోనే బిడ్డ చనిపోవడంతో చికిత్స పొందుతున్న రామలక్ష్మి
రాజవొమ్మంగి (రంపచోడవరం): మండలం శరభవరం గ్రామానికి చెందిన బేరా రామలక్ష్మి రాజవొమ్మంగి పీహెచ్సీకి పురిటికి రాగా ఆడబిడ్డ పురిట్లోనే చనిపోయింది. పేగు మెడలో చుట్టుకోవడం వల్ల బిడ్డ కడుపులోనే చనిపోయిందని పురుడు పోసిన స్థానిక వైద్యులు వంశీ, మోనీషా వివరణ ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన స్థానిక వైద్యులు గోప్యత పాటించడంతో ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. రామలక్ష్మికి వైద్యులు పురుడు తేదీ జూన్ 20గా వెల్లడించారు.
మూడురోజులుగా ఆమెకు పురిటినొప్పులు వస్తుండడంతో శరభవరంలో గల ఏఎన్ఎంకు రామలక్ష్మి తెలిపింది. అయితే 20వ తేదీ వరకు భయంలేదని ఏఎన్ఎం చెప్పిందని రామలక్ష్మి తెలిపింది. శనివారం నొప్పులు మరీ ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు 108 సహాయంతో రాజవొమ్మంగి పీహెచ్సీకి తరలించగా మృతశిశువు జన్మనిచ్చింది. రామలక్ష్మి పీహెచ్సీకి వచ్చిన సమయంలో ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యనిపుణుల సమక్షంలో ‘ప్రధానమంత్రి సురక్షత మాతృత్వ అభియాన్’ వైద్య శిబిరం జరుగుతోంది. అయినా రామలక్ష్మికి మెరుగైన ప్రసూతి సేవలు లభించకపోవడంతో ఆమెకు గర్భశోకం తప్పలేదు.