
మంత్రి డీకే అరుణ భర్తపై కేసు నమోదు
ఇటిక్యాల(మహబూబ్నగర్ జిల్లా): రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ భర్త, గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డిపై ఎట్టకేలకు పోలీసు కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ నాయకుడు, ఇటిక్యాల మాజీ ఎంపీపీ జి.ఖగనాథరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై షేకుపల్లి సర్పంచ్ రవీందర్రెడ్డి గత నెలలో కోదండాపురం పోలీస్స్టేషన్లో భరతసింహారెడ్డిపై ఫిర్యాదు చేశారు.
పోలీసులు స్పందించకపోవడంతో వైఎస్సార్ సీపీ నాయకుడు ఖగనాథరెడ్డి ఇటీవల భరతసింహారెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ గద్వాల కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు భరతసింహారెడ్డి, ఇటిక్యాల మండలానికి చెందిన జింకలపల్లి భీమేశ్వర్రెడ్డి, వీరాపురానికి చెందిన దండల రాముడు, మన్నెగౌడ్లపై 504, 506, 448, 307, ఐపీసీ రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్సై గౌసుద్దీన్ తెలిపారు. గురువారం ఎఫ్ఐఆర్ కాపీలను గద్వాల కోర్టుకు సమర్పించామన్నారు.