రోడ్డెక్కిన ఆటో | Auto strike ended | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన ఆటో

Published Wed, Jan 22 2014 1:31 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

Auto strike ended

 సాక్షి, హైదరాబాద్ : ఆటో సమ్మె ముగిసింది. కార్మిక సంఘాలు అధికారులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఆటో కనీస చార్జీ ని రూ.16 నుంచి రూ.20 కి పెంచుతూ రవాణా శాఖ మంగళవారం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆమోదం అనంతరం ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త ఆటోచార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సంయుక్త రవాణా కమిషనర్ బి. వెంకటేశ్వర్లు తెలిపారు.

 చార్జీల పెంపుతోపాటు, పలు సమస్యలపై నాలుగు రోజులుగా సమ్మె కొనసాగిస్తున్న ఆటోసంఘాల ప్రతినిధులతో రవాణా శాఖ కమిషనర్ జి.అనంతరామ్, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి చర్చలు జరిపారు. చార్జీల పెంపు, ట్రాఫిక్ చలానాలను పెంచుతూ విడుదల చేసిన 108 జీవో రద్దు, కార్మికుల సంక్షేమ బోర్డు తదితర అంశాలపై చర్చలు సానుకూలంగా ముగిశాయి.

 ఈ చర్చల్లో రవాణా కమిషనర్ అనంతరామ్‌తో పాటు, అదనపు రవాణా కమిషనర్ శ్రీనివాస్, సంయుక్త రవాణా కమిషనర్ బి.వెంకటేశ్వర్లు, ఆటోసంఘాల జేఏసీ ప్రతినిధులు వెంకటేశ్ , నరేందర్, సత్తిరెడ్డి, కిరణ్, అమానుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ చలానాల పెంపును కొంతమేరకు ఉపసంహరించుకోనున్నట్లు అధికారులు చెప్పారు.

అలాగే ప్రయాణికుల భద్రత, ఈ చలానాలు తదితర అంశాలపై జంట కమిషనరేట్ల పోలీసు ఉన్నతాధికారులు, ఆటోసంఘాలతో కలిపి ఈ నెల 25వ తేదీన  ఒక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై రవాణాశాఖ మొదటి నుంచి సముఖంగానే ఉందని, దీనిపై కార్మిక శాఖ నిర్ణయం తీసుకోవలసి ఉందని వివరించారు. ఈ అంశంపై  కార్మిక శాఖ అధికారులతో త్వరలో సమావేశం కానున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచే క్రమంగా రోడ్డెక్కిన ఆటోలు... సాయంత్రం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో పూర్తిస్థాయిలో రోడ్లపైకి వచ్చాయి.
 
     ఇక కనీస చార్జీ రూ.20     కార్మిక సంఘాల డిమాండ్లకు రవాణా శాఖ ఓకే  ఫిబ్రవరిలో కొత్తచార్జీలు అమల్లోకి!
 
 మరికొన్ని నిర్ణయాలు
     హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో తిరిగే ఆటోలన్నీ విధిగా మీటర్ చార్జీలనే ప్రయాణికుల నుంచి వసూలు చేయాలి.

      చార్జీలు పెంచిన తరువాత 3 నెలల్లోపు ఆటోడ్రైవర్లు మీటర్లను సవరించుకోవాలి
      {పతి ఆటోలో విధిగా ఆటోయజమాని, డ్రైవర్ వివరాలను తెలిపే చార్ట్‌ను ఏర్పాటు చేయాలని డాక్యుమెంట్‌లు కూడా ఆటోలో  ఉండాలి.

     ఈ చలానాలు, ట్రాఫిక్ చలానాల తగ్గింపు, తదితర అంశాలపై త్వరలో  నిర్ణయం తీసుకుంటారు.
     కాగా చార్జీల పెంపు నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రీపెయిడ్ బూత్‌ల చార్జీలు కూడా సవరించాలని ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement