
అసలు విశాఖలో ఏం జరుగుతోంది?
విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని బొత్స సత్యరాయణ డిమాండ్ చేశారు.
విశాఖపట్నం: విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యరాయణ డిమాండ్ చేశారు. రికార్డుల టాంపరింగ్ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసలు విశాఖలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. 3 లక్షల అడంగల్ కాపీలు కనిపించడం లేదని, వాటి గురించి అడిగితే హుద్హుద్ తుపానులో కొట్టుకుపోయారని అంటున్నారని తెలిపారు.
ఇంత పెద్ద కుంభకోణం ఎప్పుడూ చూడలేదన్నారు. భూస్కామ్తో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. వేల ఎకరాల భూములను దోచేస్తున్నారని, ప్రభుత్వ భూములను కాపాడుకోలేని పరిస్థితి ఉందని వాపోయారు. ఏం జరుగుతుందో చెప్పాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రమేయం లేకుండా జరగదని మంత్రులే అంటున్నారని తెలిపారు. ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోరు? ఎవర్ని కాపాడేందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ ఆధ్వర్యంలోనే భూస్కామ్ జరుగుతోందని ఆరోపించారు. సమ్మిట్ల పేరుతో విశాఖ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని బొత్స సత్యరాయణ విమర్శించారు.