
సాక్షి, అమరావతి: విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. సీఎంవో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఇద్దరు మరణించారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఒకరు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. రియాక్టర్ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగిందని, తమ దృష్టికి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ ప్రాంతానికి జిల్లా కలెక్టర్, సీపీ చేరుకున్నారని వివరించారు.
ముందు జాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్డౌన్ చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్ ఉన్న విభాగానికి పరిమితమని ఎలాంటి ఆందోళన అవసరంలేదని అధికారులు నివేదించారు. బాధితులను కలెక్టర్ వినయచంద్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మీనా పరామర్శించారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కూడా చేయిస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. (విశాఖలో విషాదం.. మరో గ్యాస్ లీక్..)
Comments
Please login to add a commentAdd a comment