
రాజధాని ప్రాంతంలో కాంటూరు సర్వే
* మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు వీలుగా సర్వే
* ఇప్పటికే పలు గ్రామాల్లో డీజీపీఎస్ సర్వే పూర్తి
* తాజాగా ఈటీఎస్ సర్వే చేసేందుకు అధికారుల సన్నాహాలు
* భూములెన్ని, రైతులెందరు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు వంటి వివరాలు తెలుసుకునే ందుకు సర్వే దోహదం
* ఫిబ్రవరి 15కల్లా పూర్తి చేయాలని నిర్ణయం
సాక్షి, గుంటూరు: రాష్ట్ర రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు వీలుగా కాంటూరు సర్వే చేసేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై జిల్లా సర్వే ఏడీ కిజియా కుమారి ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతోంది. భూమి ఎత్తుపల్లాలను కొలవడానికి ఈ సర్వే ఉద్దేశించింది. దీని ద్వారా ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న భూమి ఎత్తు పల్లాలను తెలుసుకోవచ్చు. దీనిని బట్టి సింగపూర్ బృందం ‘రాజధాని’ మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తుంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే రాజధాని ప్రాంత గ్రామాల్లో డీజీపీఎస్(డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) విధానం ద్వారా ఒక్కో గ్రామానికి రెండు నుంచి 4 పాయింట్లను గుర్తించి హద్దులను నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఉన్న భూములు, రైతుల వివరాలను సమగ్రంగా తెలుసుకునేందుకు వీలుగా ‘ఎంజాయ్మెంట్’ సర్వేను ఈటీఎస్(ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) విధానంలో చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. గ్రామాల్లో ఉన్న భూములెన్ని.. సదరు భూమి ఎవరి స్వాధీనంలో ఉంది... ఏ సర్వే నంబర్లో ఎంతమంది రైతులున్నారు.. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నదీ.. స్పష్టంగా తెలుసుకునేందుకు ఈటీఎస్ సర్వే తోడ్పడుతుంది.
ఈ సర్వే ద్వారా ఒక అంగుళం తేడా లేకుండా భూములను సర్వే చేయవచ్చు. ఇందుకోసం అన్ని జిల్లాల నుంచి 29 ఈటీఎస్ మెషీన్లను తెప్పించారు. ఇందులో 12 మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఔట్సోర్సింగ్ విధానంలో ఈ మెషీన్లు సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సర్వేలను ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్వే ఏడీ కిజియా కుమారి, గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. సర్వేకు సంబంధించి.. ప్రతిరోజూ సర్వే సిబ్బందితో సమీక్షిస్తున్నట్లు వారు తెలిపారు. ఇంతకుముందు సర్వే బృందం రోజుకు 30 ఎకరాలు సర్వే చేస్తుండగా దానిని 60 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వారు వివరించారు.
పీడిస్తున్న సిబ్బంది కొరత...
ఇదిలా ఉండగా రాజధాని ప్రాంతంలో భూముల సర్వేకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలనుంచి నియమించిన ఎనిమిది మంది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సిబ్బంది రాకపోవడంతో నవులూరులోని రెండు యూనిట్లు, కురగల్లు, నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి కాంపిటెంట్ ఆథారిటీ కార్యాలయానికి ఇంకా సర్వే సిబ్బందిని కేటారుుంచలేదు. సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని గుంటూరు జిల్లాలో రెవెన్యూ డివిజన్కు ఒక సర్వేయర్ను మినహాయించి మిగతా సిబ్బందిని అంతా రాజధాని ప్రాంతంలో భూముల సర్వేకు వినియోగిస్తున్నారు.
దీంతో జిల్లాలోని మిగతా ప్రాంత ప్రజలకు సర్వే కష్టాలు తప్పడంలేదు. ఒక్కో యూనిట్కు ఇద్దరు చైన్మన్లను నియమించుకోవాలని డిప్యూటీ కలెక్టర్లను గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే ఆ నియూమకాలు ఇప్పటికీ పూర్తికాలేదు. దీనికితోడు రాజధాని ప్రాంత గ్రామాల్లో సర్వే సిబ్బందికి రైతుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సర్వే బృందాలకు రైతుల పేర్లతోపాటు వారి గట్లను చూపించాలి. అయితే ఇందుకు రైతులు సహకరించనట్లు సమాచారం.