‘హెలెన్’ హడల్
Published Thu, Nov 21 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
అమలాపురం, న్యూస్లైన్ :బంగాళాఖాతం అన్నదాతల పాలిట ఆగర్భ శత్రువులా మారుతోంది. వ్యవసాయం ప్రకృతితో పాచికలాటలా తయారైంది. కష్టఫలితం చేతికి వచ్చే తరుణంలో వాతావ‘రణభేరి’ మోగుతోంది. నోటికాడికొచ్చిన కూడు లాక్కున్నట్టు... స్వేదం చిందించి పండించిన పంట కోతకు వచ్చిన వేళ గాలీవాన రూపంలో దాడి చేసి రైతుల ఆశలను నేలమట్టం చేస్తోంది. వారికి నష్టాలనే మిగుల్చుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బ తినగా మిగిలిన కొద్దిపాటి పంటను దక్కించుకుంటున్న సమయంలో ‘హెలెన్’గా పేరు పెట్టిన తుపాను పొంచి ఉండడం జిల్లా రైతులను కలవరానికి గురిచేస్తోంది.
జిల్లాలో ఖరీఫ్ కోతలు జోరుగా సాగుతున్నాయి. గత నెల 21 నుంచి 28 వరకు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాల వల్ల ఆలస్యమైన కోతలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. తూర్పు డెల్టాలో ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట సబ్ డివిజన్ల పరిధిలో 60 శాతం, అనపర్తి, పి.గన్నవరం సబ్డివిజన్ల పరిధిలో 35 శాతం, మధ్య డెల్టాలోని అమలాపురం, ముమ్మిడివరం, మెట్టలోని తుని, జగ్గంపేట, పిఠాపురం సబ్డివిజన్ల పరిధిలో 20 శాతం కోతలు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కోతలు జోరందుకుంటున్నాయి.
ధర ఆశించినంతగా లేకపోవడంతో రైతులు ధాన్యం అమ్మకాలు పెద్దగా చేపట్టడంలేదు. కోతలు పూర్తయిన చోట పంట ధాన్యంగా కళ్లాల్లో, పనలుగా పొలాల్లోనే ఉంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం హెలెన్ తుపానుగా మారిందన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల ను భీతావహులను చేస్తోంది. తుపాను ఒంగోలు, కావలి మధ్య తీరం దాటుతుందని, దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. గత నెలలో సంభవించిన పై-లీన్ తుపాను జిల్లా రైతులనూ కలవర పరిచినా.. దాని ప్రభావం శ్రీకాకుళం జిల్లాకు పరిమితమవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అంతలోనే మళ్లీ వాయుగుండం,
Advertisement
Advertisement