పూటకో మాట | Dengue case registered in department of microbiology | Sakshi
Sakshi News home page

పూటకో మాట

Published Tue, Jul 22 2014 4:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Dengue case registered in department of microbiology

అనంతపురం అర్బన్ : డెంగీ కేసులకు సంబంధించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (డీఎంఅండ్‌హెచ్‌ఓ) రామసుబ్బారావు రోజుకో రీతిలో ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. జిల్లాలో అసలు డెంగీ కేసులే లేవని మొన్న ప్రకటించిన ఆయన.. ఇప్పుడు మాత్రం 15 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో కేసులను నిర్ధారించారని అంటున్నారు.

ఇదే విషయాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.నీరజ వద్ద ప్రస్తావిస్తే.. తమ పరిధిలో ఇప్పటి వరకు  10 కేసులు మాత్రమే పాజిటివ్‌గా గుర్తించామన్నారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా లిఖిత పూర్వకంగా అందజేశారు. మలేరియా విభాగం, ఆస్పత్రి నుంచి వచ్చిన 149 రక్తపూతలను పరీక్షించగా.. 10 మందికి డెంగీ సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. కాగా.. డెంగీ కేసులకు సంబంధించి ఎలీసా రీడర్ ద్వారా పరీక్షించిన వాటినే పరిగణనలోకి తీసుకోవాలని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. గత నెలలో నలుగురు  చనిపోతే అవి డెంగీ కేసులుగా నిర్ధారించారు. ఎలీసా రీడర్ ద్వారా పరీక్షించని కేసులను ఏవిధంగా డెంగీగా నిర్ధారించారో అర్థం కావడం లేదు. ఇది వైద్య,ఆరోగ్య శాఖాధికారుల పనితీరును తేటతెల్లం చేస్తోంది.

 ఎలీసా కిట్స్ కొరత
 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎలీసా కిట్స్ కొరత ఉంది. ఒక కిట్ ద్వారా 50 మందికి డెంగీ పరీక్షలు నిర్వహించవచ్చు. ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.10 వేలు ఉంటుంది. ఎక్కువ కేసులొస్తే కిట్‌లు ఎక్కడి నుంచి తెస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్  నీరజ మాత్రం కిట్లను వైద్య ఆరోగ్యశాఖాధికారులే ఇవ్వాలని అంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement