
మంత్రి మండలి ఉపసంఘంతో భేటీ అయిన ఉద్యోగసంఘాల నేతలు
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను మంత్రి వర్గానికి తెలియజేశాయి. ఉద్యోగుల కనీస వేతనం రూ. 15 వేలుగా నిర్ధారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఒక్కో కుటుంబంలోని నలుగురు సభ్యులను ఒక్కో యూనిట్ గా గుర్తించాలని కోరాయి.
ఉద్యోగుల ఇంక్రిమెంట్ రేటు 3 శాతానికి పెంచాలని డిమాండ్ చేశాయి. అయితే సంబంధిత శాఖకు చెందిన నలుగురు మంత్రులు సమావేశానికి హాజరు కాలేదు. వారు వచ్చిన తరువాత డిమాండ్లపై చర్చిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.