employees union
-
మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు ముగిశాయి. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. పీఆర్సీని పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. పీఆర్సీ ఆలస్యమైతే.. ఐఆర్ కోసం ఆలోచిస్తామని చెప్పాం. చలో విజయవాడను విరమించుకోమని కోరామని మంత్రి బొత్స తెలిపారు. -
ఉద్యోగ సంఘాలతో ముగిసిన భేటీ.. బొత్స కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ ముగిసింది. జీపీఎస్ విధానాలపై ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. భేటీ అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయి. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాం అని అన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ గేట్లు తెరవాలని తిరుగుతున్నాడు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడు. ఉగాది తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుచూపుమేరలో కనపడదు. చంద్రబాబు మతిపోయి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ముసలి జిత్తులమారి నక్క. చంద్రబాబు సంయమనంతో మాట్లాడాలి. మాజీ సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడాలి. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది. చంద్రబాబు వంటి దుష్టశక్తులు రాష్ట్ర అభివృద్ధిన అడ్డుకుంటున్నారు. ఒంటరిగా పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తాం. చంద్రబాబు ఎవరితో కలుస్తారో మాకు అనవసరం. ఎన్టీఆర్ చావుకు కారణం చంద్రబాబు కాదా?. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ పథకాల వల్లే ధైర్యంగా ఈ విషయం చెబుతున్నాం అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాక్.. -
ఉద్యోగుల సంతోషం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం: సీఎం జగన్
-
ఉద్యోగులు బాగుండాలి.. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్ నిర్ణయాలు, జీపీఎస్పై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి ప్రతి కార్యక్రమం మనసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తన మనసు ఎప్పుడూ ఉద్యోగులకు మంచి చేయడం కోసమే ఉంటుందని.. రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్పినా వాటిని విశ్వసించనవసరం లేదని సూచించారు. ఉద్యోగులు బాగుండాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు. తొలిసారి ప్రభుత్వం సమస్యలను సమస్యలుగా వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దాని వల్ల ఉద్యోగులకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ మంచి జరగాలని ఆలోచన చేశామన్నారు. జీపీఎస్ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేశామని సీఎం జగన్ వివరించారు. ‘ఉభయ ప్రయోజకరంగా ఉండే విధంగా జీపీఎస్ను రూపొందించాం. 2003లో ప్రభుత్వాలు ఇది అయ్యేపని కాదని చేతులు ఎత్తేశాయి. ఆ పరిస్థితి కూడా రాకూడదు, ఉద్యోగులు రోడ్డుమీదకు రాకూడనే ఉద్దేశ్యంతో ఎంతో ఆలోచన చేశాం. మీరు ఈ రోజు తీసుకుంటున్న జీతం బేసిక్లో కనీసం 50 శాతం పెన్షన్గా వచ్చేలా ఏర్పాటు చేశాం. ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్లు జీపీఎస్లో ఇస్తున్నాం. రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలు స్ధిరంగా మెయింటైన్ కావడానికి తగినట్టుగా గ్యారంటీ పెన్షన్ స్కీంను తీసుకువచ్చాం. 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను నియమించాం. వీళ్లందరూ భవిష్యత్తులో జగన్ నాకు మంచి చేశాడన్న మాట రావాలే తప్ప.. మరో మాట రాకూడదని, ఉద్యోగులకు మంచి జరగాలని చేశాం. ఇంత సిన్సియర్గా ఒక పరిష్కారం వెదికిన పరిస్ధితి రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. భవిష్యత్లో జీపీఎస్ అనేది దేశానికే రోల్ మోడల్ అవుతుంది. ఈ పథకం ఉద్యోగులకు మేలు చేస్తుంది. మీకు అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మీది. మిమ్నల్ని పూర్తిగా భాగస్వామ్యులు చేసుకున్నాం. మీ మొహంలో చిరునవ్వు ఉంటేనే మీరు బాగా చేయగలుగుతారు. ప్రజలు సంతోషంగా ఉంటారు. రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. అదే విధంగా ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, డైలీ వేజెస్ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. చదవండి: అమిత్ షా, జేపీ నడ్డా మాటల్లో నిజమెంత? -
సీఎం జగన్ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం కలిశారు. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు సీఎం అండగా ఉంటానని స్పష్టం చేశారని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరం: బండి శ్రీనివాసరావు ‘‘12వ పీఆర్సీ ప్రకటించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు. ఉద్యోగులకు కావాల్సిన రాయితీలను ప్రకటించారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగస్వామ్యమేనన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరం. చాలావరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారు’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు. 16 శాతం హెచ్ఆర్ఏ ప్రకటించినందుకు ధన్యవాదాలు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నా’’ అని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతం: శివారెడ్డి ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ, పీఆర్సీ కమిషన్ వేసినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘టీడీపీ హయాంలో పీఆర్సీ కమిషన్ అడిగినందుకు గుర్రాలతో తొక్కించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు. ఇచ్చిన మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చినట్టే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వస్తాయి. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవి’’ అని శివారెడ్డి అన్నారు. చదవండి: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి -
ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం కీలక భేటీ!
అమరావతి: ఉద్యోగ సంఘాలతో ఈరోజు(సోమవారం) సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. నేటి సాయంత్రం గం. 4.30ని.లకు మంత్రుల కమిటీ సమావేశం అవ్వనుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మార్చి 7వ తేదీన జరిగిన సమావేశంలో నిర్ణయాలు ఇప్పటికే ప్రభుత్వం అమలు చేయగా, ఈరోజు మరికనని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మేరకు 13 ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. -
సీఎం జగన్ను కలిసిన పలు ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలు ఉద్యోగ సంఘాల నేతలు గురువారం కలిశారు. టీడీపీ హయాంలో తొలగించిన 500 మంది మండల సమన్వయకర్తలకు స్వచ్చాంధ్ర కార్పొరేషన్లో అవకాశం కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున సుమారు 11 వేల మంది గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2 సర్వేయర్లుగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన ఏపీ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్.. కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఎస్ దివాకర్, సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. చిరంజీవిరావు వారి వెంట ఉన్నారు. చదవండి: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన -
ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. భేటీ అనంతరం.. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలతో పెండింగ్ సమస్యలపై చర్చించామన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమని, ఉద్యోగుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని పేర్కొన్నారు. సుమారు రూ.3 వేల కోట్ల మేర చెల్లింపులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని నిర్ణయించామని సజ్జల వెల్లడించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఉద్యోగులకు చెందిన పెండింగ్ క్లెయిమ్స్ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తాం. ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 లోపల చెల్లిస్తాం. అందరి ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులు చేస్తాం. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, మెడికల్ ఎరియర్స్ అన్నీ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. చదవండి: APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు -
విప్రోకు ఎదురుదెబ్బ: ఫ్రెషర్ల జీతం కోత అన్యాయమంటూ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఐటీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఒక ప్రోగ్రామ్ కింద ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు జీతాల ఆఫర్లను దాదాపు 50 శాతం తగ్గించే విప్రో చర్య అన్యాయం, అంగీకార యోగ్యం కాదని ఐటీ ఉద్యోగ సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది. కంపెనీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేసింది. కార్మిక శాఖకు ఫిర్యాదు అంతేకాదు ఈమేరకు ప్రోపై కార్మిక మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదు చేసింది. విప్రో ఫ్రెషర్ల జీతాన్ని అనైతికంగా తగ్గిస్తోంది, ఇది ఆఫర్ లెటర్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘన అని ఫిర్యాదు చేసింది. దీన్ని ఆమోదిస్తే ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగుల దోపిడీకి చఉద్యోగ భద్రత లోపానికి దారి తీస్తుందనినైట్స్ ఫిర్యాదులో పేర్కొంది. మరి తాజా పరిణామంపై విప్రో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా విప్రో రూ. 6.5 లక్షల (LPA) ఆఫర్తో ఫ్రెషర్లకు ఉద్యోగాల్లోకి తీసుకుంది. అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కాస్ట్ కటింగ్ లాంటి సాకులతో వార్షిక వేతనం సగానికి కోత విధించేందుకు నిర్ణయించింది. 3.5 లక్షలకు పనిచేస్తారా అని ఈ మెయిల్ద్వారా వారిని కోరడం వివాదానికి తీసింది.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్లో విప్రో పేర్కొంది. ఈ ఆఫర్కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. అయితే దీనిపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నైట్స్ స్పందించింది. ఇది అన్యాయమని, ఆమోదించదగ్గ చర్య కాదంటూ తప్పుబట్టింది. ఆన్బోర్డ్ కోసం వేచి ఉన్న ఫ్రెషర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారానికి యూనియన్తో అర్థవంతమైన చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. -
ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ
విజయవాడ: జీపీఎస్ అంశంపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల కమిటీ బుధవారం సాయంత్రం భేటీ అయ్యింది. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘జీపీఎస్ పై పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చించాం.ఫైనల్ డ్రాఫ్ట్ ను ఉద్యోగులకు వివరించాం. రిటైర్ అయ్యాక గ్యారంటీగా కనీసం రూ.10 వేలు పెన్షన్ ఉండేలా చూస్తాం. పెన్షనర్ చనిపోతే భార్య లేదా భర్తకు పెన్షన్ ఇస్తాం. పెన్షనర్లకు హెల్త్ కార్ఫ్ కూడా పెట్టాం. పెన్షనర్ చనిపోతే ఎక్సగ్రేషియా ఇచ్చేలా చర్యలు. ఉద్యోగులతో మరోసారి చర్చలు జరుపుతాం. జీపీఎస్ ఫైనల్ అయ్యాక. చట్ట బద్ధత కల్పిస్తాం. జీపీఎస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి’ అని తెలిపారు. సీపీఎస్పై ఉద్యోగులు ఆలోచించాలి: సజ్జల సీపీఎస్పై ఉద్యోగులు ఆలోచించాలన్నారుప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఉద్యోగులకు సజ్జల విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలను ఉద్యోగులు పరిశీలించాలన్నారు. తమ చిత్తశుద్ధిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలన్నారు సజ్జల -
ఉద్యమ కార్యాచరణ సమ్మెను విరమించుకుంటున్నాం: ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: దాదాపు7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. సమావేశం అనంతరం పీఆర్సీ సాధన సమితి సభ్యులు ఈ అంశాలపై మాట్లాడారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం మాకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో గ్రహించిందని అందుకే అన్ని విషయాలు కూలంకషంగా చర్చించిందని తెలిపారు. తాము అడక్కుండానే 27శాతం ఐఆర్ ఇచ్చారని ,పలువురి జీతాలు పెంచారన్నారు. ముఖ్యమంత్రి గారిని ఆవేదనలో ఏదైనా ఎవరైనా మాట్లాడి ఉంటే అన్యదా భవించవద్దని చెప్పారు. తాము ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ సమ్మెను విరమించుకుంటున్నట్లు తెలిపారు. వెంకట్రామిరెడ్డి, పీఆర్సీ సాధన సమితి ...ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏ 24 శాతం ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని చెప్పారు. సీసీఎని పునరుద్ధరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ కాగానే కొత్త స్కేల్ అమలవుతుందని చెప్పారు. తాము మాట తప్పి ఏదైనా మాట్లాడి ఉంటే హృదయ పూర్వక క్షమాపణలను తెలిపారు. -
దయచేసి ఉద్యోగులు సమ్మె విరమించాలి: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఏపీ సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు. చర్చలు జరపకపోతే సమస్యలెలా తీరుతాయని ప్రశ్నించారు. నిరసనలు, ఆందోళనలతో ఉపయోగం ఉండదని, ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కావాల్సింది ఏంటో చెబితే కూర్చొని మాట్లాడతామని తెలిపారు. ఐఆర్ అంటే ముందస్తు సర్దుబాటు అని, పీఆర్సీ ఆలస్యం అయితే ఇస్తారని పేర్కొన్నారు. దయచేసి ఉద్యోగులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.10 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని, డీఏ మాత్రమే పెంచితే 10 వేల కోట్లు మిగిలేవని సీఎస్ తెలిపారు. కొత్త పీఆర్సీ వల్ల ఎవరి జీతాలు తగ్లేదని, ఐఆర్తో కొత్త పీఆర్సీని పోల్చి చూడటం సరికాదన్నారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చి చూడాలన్నారు. ఉద్యోగులకు సమస్యలు ఉంటే మంత్రుల కమిటీ ఉందని, ఏదైనా రిపోర్ట్ తయారు చేసి పరిష్కారం ఆలోచిద్దామని సూచించారు. చదవండి: సమస్యను మరింత జఠిలం చేసేలా ఉద్యోగుల తీరు: సజ్జల ఎవ్వరికీ జీతం తగ్గలేదు: ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉద్యోగుల జీతం తగ్గిందని ఓ పత్రిక రాసిందని, వాస్తవానికి ఎవ్వరికీ జీతం తగ్గలేదని ప్రిన్సిపాల్ సెక్రెటరీ శశిభూషన్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ వస్తుంది. దాని వలన 3 శాతం పెరుగుతుంది. ఐఆర్ కలిపినా, కలపకపోయిన జీతం పెరుగుతుంది. ఐఆర్ కేవలం తాత్కాలిక ప్రయోజనం. ఇప్పటి వరకు అన్ని పీఆర్సీల కంటే అత్యధిక ఐఆర్ ఈ ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా అత్యధికంగా 30 నెలలు ఐఆర్ ఇచ్చారు.’’ అని ప్రిన్సిపాల్ సెక్రెటరీ వివరించారు. చదవండి: ‘ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా.. చంద్రబాబు బిల్డప్’ -
చర్చలతోనే పరిష్కారం
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఆహ్వానించారు. గురువారం తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి్త చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి సమస్యను పక్కదారి పట్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉద్యోగులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పీఆర్సీ వల్ల ఏ ఒక్క ఉద్యోగి వేతనమూ తగ్గలేదన్నారు. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని కోరారు. ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో జమ అయిన జీతాలను పరిశీలించుకుంటే తగ్గాయో పెరిగాయో వారికే అర్థమవుతుందన్నారు. మిగతావాటిపై ముందుకు రావాలి.. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం చర్చించినట్లు సజ్జల తెలిపారు. మూడు డిమాండ్లపైనే పట్టుబట్టడం సరి కాదని, మిగతా అంశాల పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. ఆ 3 డిమాండ్లకు కాలం చెల్లిందన్నారు. ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేశామని, మిగతా రెండు డిమాండ్లు నెరవేర్చడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. పీఆర్సీ నివేదికను ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. వైషమ్యాలతో సాధించేదేముంది? అసలు సమస్యలపై చర్చించేందుకు రావాలని, ఉద్యోగ సంఘాల కార్యాచరణ వాయిదా వేసుకోవాలని కోరితే ఇప్పటివరకూ ఎలాంటి లేదని సజ్జల పేర్కొన్నారు. సమ్మెకు దిగక ముందే చలో విజయవాడ పేరుతో రోడ్డెక్కడం సరి కాదన్నారు. ఆ పేరుతో చేసేది బలప్రదర్శనే మినహా మరొకటి కాదన్నారు. సామరస్యంగా పరిష్కరించుకుందామని, ఉద్యమాల ద్వారా సమస్యను జఠిలం చేసుకోవద్దని హితవు పలికారు. సీపీఎస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఒక పట్టాన తెగేవి కాదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై అభిమానంతోనే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని సజ్జల తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను సమ్మెలోకి దించి బస్సులు ఆపి బల ప్రదర్శన చేయాలని చూస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యతని, కరోనా నేపథ్యంలో ఆందోళనలకు అనుమతి లేదన్నారు. ఉద్యోగులపై చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవదన్నారు. కరోనా వల్ల ఆదాయం తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పలుదఫాలు చెప్పామని, ఇది ఉద్యోగ సంఘాలకు తెలియంది కాదన్నారు. రాజధానిపై... ఇప్పుడు వెలగపూడి నుంచే పరిపాలన సాగుతోందని, సాంకేతికంగా పాలన ఎక్కడినుంచి జరుగుతుందో అదే ప్రస్తుత రాజధాని అవుతుందని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలనను వికేంద్రీకరించాలని నిర్ణయించామని, అందులో భాగంగానే 3 రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిర్ణయం మేరకు భవిష్యత్తులో రాజధాని మార్పు ఉంటుందన్నారు. బడ్జెట్లో కేంద్రం ఏటా రాష్ట్రానికి అన్యాయమే చేస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు. -
27న చర్చిద్దాం.. అందరూ కలిసి రండి
సాక్షి, అమరావతి: పీఆర్సీపై చర్చించడానికి స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ కలిసి 27వ తేదీన చర్చలకు రావాలని కోరినట్లు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా జీతం తగ్గకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ సచివాలయంలో వరుసగా రెండో రోజు మంగళవారమూ సమావేశమైంది. అంతకు ముందే సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ మధ్యాహ్నం 12 గంటలకు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీని చర్చలకు ఆహ్వానించారు. స్టీరింగ్ కమిటీ విజయవాడలో సమావేశమై.. నాలుగు జేఏసీల నుంచి తొమ్మిది మందితో కూడిన ప్రతినిధుల బృందాన్ని పంపింది. ఆలస్యంగా వచ్చిన ప్రతినిధుల బృందం మంత్రుల కమిటీతో గంటన్నరకు పైగా భేటీ అయింది. తాము చర్చలకు రాలేదని, ప్రభుత్వం ప్రధానమైన మూడు డిమాండ్లపై స్పష్టత ఇస్తేనే చర్చలకొస్తామని చెప్పింది. 24న సీఎస్కు ఇచ్చిన సమ్మె నోటీసులోని అంశాలనే మరోసారి పేర్కొంది. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను బయటపెట్టాలని, కొత్త పీఆర్సీ జీవోలను అబయన్స్లో ఉంచాలని, పాత పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించాలంటూ లిఖితపూర్వక వినతిని సమర్పించింది. సమస్యల పరిష్కారం కోసమే మంత్రుల కమిటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ పని చేస్తోందన్నారు. తమ పరిధిలో లేని అంశాలపై ఉన్నత స్థాయిలో చర్చించి సానుకూలంగా పరిస్థితి చక్కబెడతామని చెప్పారు. ఒకసారి జారీ చేసిన జీవోలను ఆపమనడం సరికాదని హితవు పలికారు. ‘ఇది మీ ప్రభుత్వం. ఫ్రెండ్లీ ప్రభుత్వం. అడిగినా, అడక్కపోయినా చేయగలిగినంత చేస్తోంది. ఇప్పుడు కూడా అపోహలు తొలగించడానికి, నష్టం జరుగుతుంటే సరిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. ఇంత కాలం జరిగిన దానిని తిరగదోడమనడం సమంజసం కాదు. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడకపోతే బాధపడాలి. ప్రజా సంక్షేమంతో పాటుగానే ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. అతి తక్కువ వేతనాలున్న అంగన్వాడీలకు జీతాలు పెంచారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. వారికి ప్రొబేషన్ ఖరారు చేయాలని ఆదేశించారు. ఇలా ఎన్నో అంశాలపై సుదీర్ఘంగా కసరత్తు చేసి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు వాటిని వద్దంటే ఎలా? ఉద్యోగులు విశాల దృక్పథంతో ఆలోచించాలని ప్రతినిధుల బృందానికి చెప్పాం. ఇదే విధంగా అన్ని స్థాయిల్లోని ఉద్యోగులను కోరుతున్నాం. ఉద్యోగ సంఘాలతో అంతుకు ముందు చర్చించిన అంశాలపై ఇప్పుడు ఆందోళన జరుగుతోంది. వీటిల్లో కొన్ని విషయాలు వారికి తెలియదంటున్నారు. వాటిని నివృత్తి చేసేందుకు మళ్లీ పిలిచాము’ అని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఫిట్మెంట్ సమస్య కాదు పీఆర్సీ ఎప్పటికైనా ఇవ్వక తప్పదని, కొత్త పీఆర్సీ వచ్చిన తర్వాత పాత వేతనం ఇవ్వాలని ఉద్యోగులు అడగడానికి లేదన్నారు. ఈ విషయం అందరికీ తెలుసునని విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఇప్పడు ఫిట్మెంట్ సమస్య కాదని, ఇతర అంశాలుంటే కూలంకషంగా చర్చించి సానుకూలంగా పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రుల కమిటీ ఉదయం 11.30 గంటలకే సచివాలయానికి చేరుకుని ఉద్యోగ సంఘాల ప్రతినిధుల కోసం వేచిచూసిందన్నారు. కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఉన్నారు. చర్చలకు వ్యతిరేకం కాదు : స్టీరింగ్ కమిటీ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు కమిటీ వేయడం శుభ పరిణామమని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యుడు జి.ఆస్కార్ రావు అన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రుల కమిటీతో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్ట్రగుల్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి ప్రభుత్వంతో చర్చలకు మూడు ప్రధాన డిమాండ్లను నివేదించామన్నారు. వీటిని అంగీకరిస్తేనే చర్చల్లో పాల్గొంటామని చెప్పడానికే వచ్చామన్నారు. షరతులకు అంగీకరిస్తే జేఏసీల చైర్మన్ల స్థాయిలో స్టీరింగ్ కమిటీ సభ్యులు అందరం కలిసి చర్చలకు వస్తామని చెప్పారు. తాము చర్చలకు వ్యతిరేకం కాదన్నారు. మరో సభ్యుడు వైవీ రావు మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో తాము ఒకే స్టాండ్పై ఉన్నామన్నారు. ప్రభుత్వం స్టీరింగ్ కమిటీ డిమాండ్లను అంగీకరించాల్సిందేనన్నారు. కేవీ శివారెడ్డి, కె.రాజేష్, జె.హృదయరాజ్, అరవపాల్, వీవీ మరళీకృష్ణ నాయుడు, ఎం.కృష్ణయ్య, సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు కూడా ప్రతినిధుల బృందంలో ఉన్నారు. -
పీఆర్సీపై పిటిషన్.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు
Latest Updates: పీఆర్సీపై దాఖలైన పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, అదే సమయంలో విభజన చట్టానికి సంబంధించిన పిటిషన్ కూడా కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగత సర్వీస్కు సంబంధించిన మేటర్ కాబట్టి ఈ కోర్టులో విచారించలేమని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ను వేరొకరికి రిఫర్ చేయాలంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ భానుమతి తెలిపారు. హైకోర్టులో మళ్లీ ప్రారంభమైన వాదనలు పీఆర్సీ పిటిషన్పై హైకోర్టులో వాదనలు మధ్యాహ్నం 2:15కి తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తికి రూ.28 వేల జీతం పెరిగిందన్నారు. ప్రభుత్వంపై రూ.10,860 కోట్ల భారం పడుతుందని పేర్కొన్నారు. 2018లో ఉద్యోగుల జీతాల కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు ఆ ఖర్చు రూ.68 వేల కోట్లకు చేరిందన్నారు. ఉద్యోగులకు ఇవ్వకూడదన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, పునర్విభజన చట్టంలో హెచ్ఆర్ఏ ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని పేర్కొనలేదని పేర్కొన్నారు. పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారించింది. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పండని పిటిషన్ దారులను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారం లేకుండా పిటిషన్ ఎలా వేస్తారని, అయినా పీఆర్సీని సవాల్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. ఉద్యోగ సంఘాల నేతలు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అంతకుముందు కోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. విభజన చట్టం ప్రకారం పీఆర్సీ ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం హెచ్ఆర్ఏ ఇవ్వలేదని అన్నారు. ఇక ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పీఆర్సీపై ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా బెదిస్తారని వాదించారు. సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరించడమే కాకుండా కోర్టులో రిట్ పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఏజీ కోర్టుకు దృష్టికి తెచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని, అయితే, చర్చలను రాబోమని చెప్తున్నారని కోర్టుకు తెలిపారు. (చదవండి: ‘మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్లైన్లో చూపుతోంది.. మేమేం చేయలేం’ ) -
ఉద్యోగుల భద్రతలో సీఎం రెండడుగుల ముందే ఉంటారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో విధానాల అమలును తమ భుజస్కంధాలపై వేసుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోవడాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహించరని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలో సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఉద్యోగుల భద్రతలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండడుగుల ముందే ఉంటారని తెలిపారు. ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సుధీర్ఘంగా ఉన్న ఆర్టీసీ డిమాండ్లను సీఎం జగన్ నెరవేర్చారన్నారు. చదవండి: ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం రెండేళ్లుగా కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందని, దీంతో కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని, పీఆర్సీ వంటి సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్ హామీ సీఎం జగన్ నెరవేర్చారని గుర్తుచేశారు. పీఆర్సీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, మిగిలిన విషయాలను కూడా క్రమ పద్ధతిలో చేస్తామని భరోసానిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటివి ఎన్నో కార్యక్రమాలను చేశామని తెలిపారు. చదవండి: బయటి కన్నా ఇంట్లోని కాలుష్యంతోనే అధిక ముప్పు ‘ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదు. అపోహలు వద్దు. ఎవరేం చెప్పినా నమ్మొద్దు. జీతాల విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులను మరింత ఆప్యాయంగా సీఎం చూసుకుంటారు. మిగిలిన సమస్యలు నవంబర్లోగా తీరుస్తాం. ఏ ఉద్యోగుల సంఘాలు వచ్చినా, ఉద్యోగులు వచ్చినా మేము స్పందిస్తాం. ఇది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. దాంట్లో దాపరికం ఏమీ లేదు. అది రహస్యమైతే బండి శ్రీనివాస్ (ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు) పక్కకి వెళ్లి మాట్లాడే వారు కదా.’ అని సజ్జల ప్రశ్నించారు. చదవండి: గుంటూరు నడిబొడ్డున రూ.130 కోట్లతో నాయుడు కాంప్లెక్స్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, డిమాండ్లను కూడా ఇచ్చామని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు పెద్దలతో చర్చలు జరిపినట్లు, నెలలోపు పీఆర్సీ అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో జాయింట్ స్టాఫ్ మీటింగ్ జరగబోతోందని, దాంట్లో మిగతా సమస్యలు చర్చిస్తామని పేర్కొన్నారు. ఇందుకు తాము సీఎం జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ప్రభుత్వానికి మంగళవారమే మెమోరాండం ఇచ్చామని, ఈ రోజు చర్చలు జరిగాయని ఉద్యోగ సంఘాల జఘేసీ బొప్పరాజు అన్నారు. తాము 10 సమస్యలను మేము వివరించాము. సీఎంఓ అధికారులతో సజ్జల సమావేశం పెట్టారని, ఈ సందర్భంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకే రోజు జీతం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అందరికీ 1వ తేదీన జీతాలు వేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు. -
10,12 తేదీల్లో హైకోర్టుకు సెలవు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుధవారం(10వ తేదీ) హైకోర్టుకు సెలవు దినంగా ప్రకటించారు. అలాగే హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, లీగల్ సర్వీసెస్ కమిటీ, మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్లకు కూడా సెలవు ప్రక టించారు. దీనికి బదులుగా మే 1(శని వారం)ని పనిదినంగా నిర్ణయించారు. అలాగే శివరాత్రి మరుసటి రోజు సెలవు కావాలంటూ హైకోర్టు ఉద్యోగుల సంఘం పెట్టుకున్న వినతిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం 12వ తేదీన కూడా సెలవు ఇచ్చింది. దీనికి బదులు ఈనెల 20వ తేదీ(శనివారం)ని పనిదినంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ భానుమతి మంగళవారం తెలియజేశారు. -
‘గత ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వం అప్పటి ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యోగులని మోసం చేశారని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులను మోసం చేసిన నాటి ప్రభుత్వం దిగిపోవాలని అంతా కోరుకున్నామన్నారు. కరోనా ప్రభావం ఉద్యోగుల ఆర్థిక అంశాలపై కూడా తీవ్రంగా చూపిస్తోంది. కరోనా కారణంగా నిలిపిన మార్చి, ఏప్రిల్ నెలల జీతాల బాకాయిలను ఒక నెల పెన్షన్ను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. పెండింగ్లో ఉన్న 5 డీఏలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. కనీసం మూడు డీఏలు విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించే డీఏకి.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డీఏకి సంబంధం లేదు, కానీ ఆర్థిక శాఖాధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పీఆర్సీ కమీషన్ గడువు పెంచకుండా వెంటనే రిపోర్టు తెప్పించుకుని ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణ అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పదవీ విరమణ పోందిన ఉద్యోగులకు కూడా వెంటనే చెల్లింపులు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ఏడాది కాలంగా ప్రజల ముంగిటకి ప్రభుత్వ సేవలు అందాయన్నారు. పరీక్ష ద్వారా ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయ కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్య వేతన వ్యత్యాసాలను తొలగించాలని, అన్ని ప్రభుత్వం శాఖలలో మినిమం టైం స్కేల్ అమలు చేయాలన్నారు. ఉద్యోగులు సమస్యలపై ఈ వారంలో సీఎం వైఎస్ జగన్ కలవడానికి అపాయింట్ మెంట్ అడిగామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని, తమ ఆర్థిక పరమైన డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు రాజకీయ ఉచ్చులో పడోద్దని ఆయన హెచ్చారించారు -
‘మరో చింతమనేనిలా మారాడు’
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూన రవికుమార్ మరో చింతమనేని ప్రభాకర్లా మారాడని.. ఉద్యోగులను భయబ్రాంతులను గురిచేసిన రవికుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రవికుమార్ వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కూన రవికుమార్ను టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినప్పుడే చింతమనేనిపై చంద్రబాబు చర్యలు తీసుకుని ఉంటే ఉద్యోగులపై టీడీపీ నేతల దాడులు జరిగేవి కావన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యోగులంతా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా విధులు నిర్వహిస్తే ఉద్యోగులపై దాడులు చేస్తారా అంటూ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి: రాష్ట్ర్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వ అధికారులపై బెదిరింపులకు పాల్పడిన టీడీపీ నేత కూన రవికుమార్పై రాష్ట్ర్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రవికుమార్పై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్ర్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య కోరారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ అధినేత వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో బుధవారం సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడిన వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని వెల్లడించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పేవరకు ఉద్యోగులు ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ ప్రసారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం పునర్నిర్మాణానికి పని గంటలతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉద్యోగులపై రాధాకృష్ణ వ్యాఖ్యలు అభ్యంతరకరంగానూ, అవమానకరంగానూ ఉన్నాయన్నారు. అనంతరం శ్రీలంకలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. -
మేమొస్తే.. ఐఆర్, పీఆర్సీ ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకున్న సొంత రాష్ట్రంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్కు గుర్తింపు లేకపోవడం దారుణమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన తెలంగాణ ఎంప్లాయీస్ యూని యన్ 17వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఎంప్లా యిస్ యూనియన్కు కనీసం గుర్తింపు ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యూనియన్లో కొం దరు నేతలు పదవుల ప్రలోభాలకు లోనయ్యారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఎన్నో ధర్నా లు, సమ్మెలు, నిరసనలు చేసి, జీతాలు కోల్పోయి తెలంగాణ సాధిస్తే.. ఆ పునాదులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్, ఉద్యోగులనే విస్మరించారని తీవ్రంగా మండిపడ్డారు. కనీస డిమాండ్లయిన వేతన సవరణ, మధ్యంతర భృతిని చెల్లించకపోవడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి అహర్నిశలు శ్రమిస్తోన్న ఉద్యోగులకు వేతన సవరణ చేయకపోగా, కొత్త జిల్లాలు ఏర్పడినప్పటి నుంచి హెచ్ఆర్ను 20 నుంచి 12.5 శాతానికి ఎలా తగ్గిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త పోస్టులు భర్తీ చేయకుండా ఉద్యోగులపై పనిఒత్తిడి పెంచడాన్ని ఆక్షేపించారు. సీపీఎస్పై అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూటమి’ద్వారా తాము అధికారంలోకి వస్తే వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని, వేతన సవరణ, మధ్యంతర భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రలో పని చేస్తోన్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు తీసుకొస్తామన్నారు. ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదు... అపాయింట్మెంట్లు ఇవ్వని సీఎంను తన రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదని ఉత్తమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలు, ఉద్యోగులను కలవని సీఎం గా పేరు తెచ్చుకున్న ఘనత కేసీఆర్దే అని చురకలంటించారు. 9 ఎకరాల్లో నగరం నడిబొడ్డున రూ.100 కోట్లతో ఇల్లు కట్టుకున్నారని. కుటుంబమంతా చార్టెర్డ్ విమానంలో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. ఈ రోజు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజల కోసం కాకుండా కొందరి కోసం పనిచేస్తే.. భవిష్యత్లో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్ని వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని పాలిస్తున్న కేసీఆర్ను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. వారిని వెనక్కి తీసుకురావాలి.... ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగులు అభద్రతాభావం, ఆందోళన, ఒత్తిడి నడుమ పనిచేయాల్సిన దుస్థితి దాపురించిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఉద్యోగి, ఉద్యోగ సంఘ నాయకుడు స్వేచ్ఛగా ఫోన్లోనైనా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు. అందుకే, ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్సీ, ఐఆర్ ఇవ్వలేకపోయారన్నారు. ఈ వాస్తవాలు బయటపడతాయన్న భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లాడని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ ఇలాగే కొనసాగితే.. భవిష్యతు తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రలో పనిచేసే ఉద్యోగులను వెంటనే వెనక్కి తీసుకురావాలన్న తమ డిమాండ్ను కేసీఆర్ నాలుగేళ్లుగా తన టేబుల్పైనే ఉంచుకున్నారన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ రెగ్యులరైజ్, ఖాళీల భర్తీ, ఉద్యోగులకు ఇళ్లస్థలాల పంపిణీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగులంతా విస్తృతంగా ప్రచారం చేసి, ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. భజనపరుల తెలంగాణ... 1953 ముల్కీ ఉద్యమం నుంచి 2014 ఉద్యమం దాకా ఎందరో పాల్గొన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. కానీ, ఈ రోజు కేసీఆర్ కుటుంబమే ఆ ఫలాలను అనుభవిస్తోందని ఆరోపించారు. నిజాం నుంచి నిన్నటి ఆంధ్ర పాలకుల దాకా అన్ని వర్గాల మీద పోరాడిన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. అసలైన తెలంగాణ ఉద్యమ కారులను పక్కనబెట్టి, భజనపరులకు పదవులు కట్టబెట్టి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. ధర్నా చౌక్ను ఎత్తేసి తెలంగాణలో నిరసన స్వరాన్ని తొక్కిపెట్టారని, హైకోర్టు తీర్పు కేసీఆర్కు చెంపపెట్టు లాంటిదని అన్నారు. సచివాలయానికి రాని సీఎం ఉద్యోగుల ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో వారిని పట్టించుకోకపోవడం అన్యాయమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అటెండర్ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్ల దాకా సభ్యులుగా ఉన్న ఈ సంఘానికి నేటికీ గుర్తింపు రాకపోవడం అప్రజాస్వామికం అని దుయ్యబట్టారు. నాలుగేళ్లు కేసీఆర్ నియంతృత్వ ధోరణిలో పాలన సాగించాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు కనీస గుర్తింపు లేదని, కేబినెట్లో స్థానం కల్పించకపోవడమే దీనికి నిదర్శనం అని మండిపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ యువశక్తి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణీరుద్రమ, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, నేతలు సంపత్కుమార్, నిర్మల, భుజంగరావు తదితరులు ప్రసంగించారు. -
విజయకేతనం
సాక్షి కడప : ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. గురువారం జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా...పలుచోట్ల ఎన్ఎంయూ, ఇంకొన్నిచోట్ల ఎంప్లాయీస్ యూనియన్ ఐక్యకూటమి విజయకేతనం ఎగురవేశాయి. పది రోజులు గా ఆర్టీసీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు, మంతనాలతో హడావుడిగా కనిపించిన కార్మిక నేతలు ఈ విజయంతో ఎక్కడికక్కడ సంబరాల్లో మునిగిపోయారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎన్నికల పోలింగ్ జరగ్గా, సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన కౌంటింగ్తో ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో ఐదుచోట్ల నేషనల్ మజ్దూర్ యూనియన్ విజయకేతనం ఎగుర వేయగా, మూడు డిపోలతోపాటు వర్క్షాప్లో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి భారీ మెజార్టీతో గెలుపును కైవసం చేసుకుంది. భారీగా పోలింగ్ జిల్లాలో ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి అన్నిచోట్ల భారీగా పోలింగ్ నమోదైంది. జమ్మలమడుగు డిపో పరిధిలో 100 శాతం ఓటింగ్నమోదు కాగా, మైదుకూరు, రాయచోటి, రాజంపేట, బద్వేలులో కూడా 98 నుంచి 99 శాతం ఓటింగ్ నమోదైంది. అంతేకాకుండా పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, వర్క్షాప్లో కూడా కార్మికులందరూ ఓటుహక్కు వినియోగించుకున్నారు. డ్యూటీలకు వెళుతున్న డ్రైవర్లు, కండక్లర్లు, ఇతర కార్మికులు గురువారం తెల్లవారుజామునే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం కూడా కొంతమంది క్యూలైన్లలో ఉండి ఓటుహక్కును వినియోగించుకున్నారు. కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు కావడంతో ఎక్కడికక్కడ డిపోల పరిధిలో సందడి వాతావరణం నెలకొంది. కడపలో ఈయూ ఐక్యకూటమి విజయం కడపలో ఈయూ ఐక్య కూటమి విజయకేతనం ఎగురవేసింది. అందులోనూ జిల్లాలోని ప్రొద్దుటూరు, రాజంపేట, కడప డిపో, వర్క్షాప్లలో ఈయూకు భారీ మెజార్టీని కార్మికులు అందించారు. కడప డిపోతో పాటు వర్క్షాప్లోనూ ఈయూ కూటమి గెలుపును అందుకుంది. రాజంపేట, ప్రొద్దుటూరుల్లో కూటమికి విజయం లభించింది. ఐదుచోట్ల ఎన్ఎంయూ గెలుపు జిల్లాలో నేషనల్ మజ్దూర్ యూనియన్ పలుచోట్ల విజయం సాధించింది. రాయచోటి, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, పులివెందులలో గెలుపుబాటలో పయనించింది. జిల్లాలోని పలు డిపోల పరిధిలో జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్ఎంయూ హవా కనిపించింది. ఆ ఐదు డిపోల పరిధిలో ఎన్ఎంయూకు రాష్ట్రస్థాయిలో కార్మికులు మెజార్టీని అందించారు. బద్వేలులో ఉత్కంఠ బద్వేలు డిపో పరిధిలో కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. రెండు యూనియన్లకు సంబంధించి ఓట్ల కౌంటింగ్లో సరిసమానంగా వస్తుండడంతో ఉత్కంఠం నెలకొంది. అయితే డిపో పరిధిలో 292 ఓట్లు ఉండగా, 290 ఓట్లు పోలయ్యాయి. డిపో పరిధిలో ఎన్ఎంయూకు 147 ఓట్లు రాగా, ఈయూ ఐక్య కూటమికి 142 ఓట్లు వచ్చాయి. మరో ఓటు చెల్లుబాటు కాలేదు. దీంతో ఎన్ఎంయూకు కేవలం ఐదు ఓట్ల మెజార్టీ మాత్రమే లభించింది. రాష్ట్రానికి సంబంధించి కూడా ఎన్ఎంయూకు బద్వేలు డిపో పరిధిలో 150 ఓట్లు వస్తే, ఈయూ కూటమికి 140 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం 9 ఓట్ల స్వల్ప మెజార్టీ మాత్రమే లభించింది. ఐక్య కూటమికి పట్టం కట్టిన కార్మికులు జిల్లాలో ఈయూ ఐక్య కూటమికీ ఆర్టీసీ కార్మికులు పట్టం కట్టారు. ఎంప్లాయీస్ యూనియన్, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్, ఎస్డబ్ల్యూఎఫ్ ఐక్యంగా పోటీకి తలపడడంతో కార్మికులు ఆ కూటమికి అండగా నిలిచారు. ఐక్య కూటమి తరఫున కడప రీజనల్ వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్కు కేటాయించారు. ఎన్నికల్లో ఎన్ఎంయూ కాగడా గుర్తు, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ టేబుల్ ఫ్యాను గుర్తుపై తలపడ్డారు. కాగా ఆర్టీసీ కార్మికులు ఆత్మప్రభోదానుసారం ఓటు వేసుకోవాలని ఆ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు. కార్మికులకు అండగా ఐక్య కూటమి నిలుస్తోందని భావించిన ఓటర్లు పట్టం కట్టారు. జిల్లావ్యాప్తంగా ఎన్ఎంయూ కంటే ఎంప్లాయీస్ ఐక్య కూటమికీ 172 ఓట్లు ఆధిక్యత లభించింది. వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ నాయకులు పారదర్శక పిలుపుతో ఈయూ ఐక్య కూటమికి కార్మికులు అండగా నిలవడం విశేషం. ఇక పోస్టల్ బ్యాలెట్లు 59 ఉన్నాయి. వీటిని 13న లెక్కించనున్నారు. వీటిలో కేవలం 30 ఓట్లు లభిస్తే ఈయూ ఐక్య కూటమి కడప రీజియన్ను కైవసం చేసుకోనుంది. -
దూసుకెళ్లిన ఈయూ
తిరుపతి సిటీ: ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఐక్య కూటమి మద్దతిచ్చిన ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) విజ య కేతనం ఎగువేసింది. ఎస్డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఓస్వాలు ఈయూను బలపర్చిన విషయం తెలిసిందే. జిల్లా గుర్తింపు యూనియన్గా (క్లాస్–6) 231 ఓట్ల మెజార్టీ సాధించింది. రాష్ట్రకమిటీ ఎంప్లాయిస్ యూనియన్ (క్లాస్–3)లోను 321 ఓట్ల మెజార్టీ సాధించింది. జిల్లాలో మొట్టమొదటి సారిగా ఎంప్లాయిస్ యూ నియన్ ఈ గుర్తింపు పొందగలిగింది. జిల్లాలో 14 డిపోలతోపాటు ఆర్ఎం కార్యాలయం, రీజినల్ వర్క్షాపులలో గురువారం జరిగిన పోలింగ్లో 6,838 ఓట్లకు గాను 6,735 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు గుర్తింపు సంఘంగా ఉన్న ఎన్ఎంయూ ఏడు చోట్ల గెలుపొందింది. ఎంప్లాయిస్యూనియన్ ఏడు చోట్ల గెలుపొందడంతోపాటు ఓట్లను ఎన్ఎంయూ కంటే 231 ఓట్ల మెజారిటీ సాధించింది. ఒక్క మదనపల్లె–2 డిపోలో రాష్ట్రానికి సంబంధించిన క్లాస్–3లో ఎంప్లాయిస్ యూనియన్ 15 ఓట్లు మెజారిటీ సాధించగా, జిల్లాకు సంబందించిన క్లాస్–6లో ఎన్ఎంయూ 8 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈయూ గెలుపొందిన డిపోలు అలిపిరి, మంగళం, శ్రీకాళహస్తి, చిత్తూరు–1, పలమనేరు, కుప్పం, తిరుపతి, ఆర్ఎం కార్యాలయాల్లో ఈయూ గెలుపొందింది. ఎన్ఎంయూ గెలుపొందిన స్థానాలు తిరుమల, పుత్తూరు, సత్యవేడు, చిత్తూరు–2, మదనపల్లె–1, పీలేరులో గెలుపొందింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 64 ఓట్లు ఏకపక్షంగా ఎన్ఎంయూకు పడినా జిల్లా గుర్తింపు కష్టమేనని తెలుస్తోంది. పోలైన ఓట్లలో రాష్ట్ర కమిటీ (క్లాస్–3)కి ఎంప్లాయస్ యూనియన్ 3,488 ఓట్లు పోలు కాగా, నేషనల్ మజ్దూర్ యూనియన్గా 3,167 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర కమిటీ ఈయూ కు 321 ఓట్లు మెజారిటీ సాధించింది. రీజియన్లో ఎంప్లాయిస్ యూనియన్ (క్లాస్–6)కు 3,437 ఓట్లు వచ్చాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్ (క్లాస్–6)కు 3,206 ఓట్లు పోలయ్యాయి. ఎంప్లాయిస్ యూనియన్ 231 ఓట్లు మెజారిటీ సాధించింది. రీజియన్ పరిధిలో ఐక్య కూటమి బలపరిచిన ఎంప్లాయిస్ యూనియన్ మెజారిటీ సాధించింది. రాష్ట్ర, ఇటు జిల్లాల్లో ఈయూ మెజారిటీ సాధించగలిగింది. రాత్రి ఫలితాలు వెలువడగానే డిపోల ఎదుట ఐక్యకూటమి కార్మిక సంఘాలకు చెందిన నాయకులు, కార్మికులు సం బరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండులో ఈయూ నాయకులు అవుల ప్రభాకర్ యాదవ్, సత్యనారాయణ, ప్రకాష్, జీఆర్ చంద్ర, వెంకటేశ్వరులు, ఎస్డబ్ల్యూఎఫ్ నేత భాస్కర్, కార్మికపరిషత్ నేతలు, కార్మికులు వేడుకల్లో పాల్గొన్నారు. -
ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ ఐక్యకూటమి గెలుపు
సాక్షి, అమరావతి: హోరాహోరీగా జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) ఐక్యకూటమి గెలుపొందింది. 2,399 ఓట్ల మెజార్టీతో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ)పై ఈయూ ఐక్యకూటమి విజయం సాధించింది. విపక్షాలు మద్దతు ఇచ్చిన ఈయూ ఐక్యకూటమి విజయ కేతనం ఎగురవేయగా టీడీపీ మద్దతిచ్చిన ఎన్ఎంయూ పరాజయం పాలైంది. ఈయూ ఐక్యకూటమి కింద ఎంప్లాయిస్ యూనియన్, వైఎస్సార్ సీపీ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్లు కలిసి పోటీ చేశాయి. చెల్లిన ఓట్లు 49,430 గురువారం ఉదయం 5 గంటలకే మొదలైన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు బ్యాలెట్ విధానంలో సాయంత్రం 6 గంటల వరకు జరిగాయి. మొత్తం 50,213 ఓట్లకుగానూ 49,682 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ 98.12 శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయి గుర్తింపులో 49,430 ఓట్లు చెల్లినట్లు గుర్తించారు. వీటిలో ఎంప్లాయిస్ యూనియన్ ఐక్య కూటమికి 25,771 ఓట్లు రాగా, నేషనల్ మజ్దూర్ యూనియన్కు 23,372 ఓట్లు దక్కాయి. రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం పోటీ చేసిన బహుజన్ వర్కర్స్ యూనియన్కు 208 ఓట్లు, కార్మిక సంఘ్కు 34 ఓట్లు, ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ యూనియన్కు 45 ఓట్లు వచ్చాయి. జిల్లా ఫలితాల్లోనూ ఈయూ ఐక్య కూటమిదే హవా... ఆర్టీసీ కార్మికులు జిల్లా గుర్తింపు, రాష్ట్ర గుర్తింపు ఎన్నికలకు గాను ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు వినియోగించుకున్నారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు ఎన్నికల్లో ఈయూ ఐక్య కూటమి 2,399 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించగా, జిల్లా స్థాయి గుర్తింపు ఎన్నికల్లోనూ ఈయూ ఐక్య కూటమి హవా చాటింది. విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో నేషనల్ మజ్దూర్ యూనియన(ఎన్ఎంయూ) గెలుపొందగా, మిగిలిన పది జిల్లాల్లోనూ ఈయూ ఐక్య కూటమి విజయం సాధించింది. రెండేళ్ల క్రితం జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఎన్ఎంయూ 709 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా ఈదఫా ఈయూ ఐక్య కూటమి 2,399 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం గమనార్హం. ఎన్ఎంయూ సర్కారు తొత్తులా వ్యవహరించింది: ఈయూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరించిందని ఈయూ ఐక్య కూటమి నేతలు విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల తరఫున పోరాడకుండా సీఎం చంద్రబాబు, రవాణా మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్యలకు సన్మానాలతో సరిపెట్టిందని ధ్వజమెత్తారు. ఐక్య కూటమిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన కుట్రలను భగ్నం చేసి కార్మికులు తమ కూటమికి పట్టం కట్టారని ఈయూ ఐక్య కూటమి నేతలు వైవీ రావు, పద్మాకర్, దామోదరరావు, సుందరయ్య, వి.వి.నాయుడులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు రంగంలోకి దిగినా తప్పని ఓటమి ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు అధికార టీడీపీకి చెంపపెట్టులా మారాయి. ఎన్ఎంయూ తరపున మంత్రులు రంగంలోకి దిగి ప్రచారం చేసినా ఓటమి తప్పలేదు. రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య తిరుపతిలో పర్యటించి ఎన్ఎంయూని గెలిపించాలని ప్రచారం చేశారు. వీరి ప్రచారాన్ని ఆర్టీసీ కార్మికులు ఏ మాత్రం పట్టించుకోలేదనేందుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే అధికార పార్టీ కుట్రలను అడ్డుకునేందుకు కార్మికులంతా కలిసికట్టుగా ఎన్ఎంయూని ఓడించారు. తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ కార్మికుల్లో ప్రభావం చూపిందని ఆర్టీసీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. -
సీపీఎస్ విధానం దుర్మార్గపు చర్య