
రుతుపవనాల ప్రభావం వల్లే భారీ వర్షాలు
రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లా సహా పలు తీరప్రాంత జిల్లాల్లో భోరున వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో రికార్డు స్థాయిలో 34 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఇక రాయల సీమ జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది మాత్రం రుతుపవనాలు వస్తూనే వర్షాలను వెంటతెచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు రుతుపవనాల ప్రభావం వల్లే. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం గురువారం సాయంత్రానికి తేలికపడనుంది. కాగా ఈశాన్య రుతుపవనాల ప్రభావం మరో మూడు నెలల పాటు ఉంటుంది.
(భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇరుక్కుపోయిన బస్సు, ప్రయాణికుల కష్టాలు
-నరసరావు పేట నుంచి అమరేష్ గుప్తా )
ఈ నెల 15న నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయి ఈశాన్య రుతుపవనాలు వచ్చాయి. ఉత్తరాది గాలుల ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. నైరుతి రుతుపవనాల వల్ల ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. సాధారణ స్థాయి కంటే 33 శాతం లోటు ఏర్పడింది. కాగా ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షాలు పడనున్నాయి. అయితే అకాల వర్షాల వల్ల రైతులకు నష్టమే ఎక్కువ జరిగే అవకాశముంది. వరి, చెరకు వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చు.