వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నెల్లూరులోని ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
చెన్నై: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నెల్లూరులోని ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా జగన్ రాకతో చెన్నై జనసంద్రంగా మారింది. నగరంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడవునా వేలాదిమంది అభిమానులను పలకరిస్తూ జగన్ ముందుకు కదిలారు. దాంతో ఏడు కిలోమీటర్ల ప్రయాణానికి ఆయనకు సుమారు రెండు గంటల సమయం పట్టింది.
ఇక పార్టీలో చేరిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో పాటు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, తమిళనాడు విభాగం నేతలు శరత్కుమార్, శరవణన్, జాకీర్ హుస్సేన్ తదితరులు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తమిళ ప్రజలు కొద్దిసేపు వాటి ముందు నిలబడి మరీ వీక్షిస్తున్నారు. విమానాశ్రయం నుంచి గిండీ, ఆళ్లారుపేట, మైలాపూరు, రాధాకృష్ణన్శాలై, సచివాలయం మీదుగా జగన్ పయనించే మార్గమంతా వెలిసిన ఫ్లెక్సీలు, కటౌట్లు, వాల్పోస్టర్లు వెలిశాయి. కోడంబాక్కం పరిధిలో వందలాదిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతాకాలు రెపరెపలాడుతున్నాయి.