
నాగార్జున వర్సిటీలో నూతన వీసీ ఉదయలక్ష్మి
నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ కొత్త ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఉదయలక్ష్మి గురువారం మధ్యాహ్నం వర్సిటీలో పర్యటించారు. ముందుగా ఆమె డీన్లు, వివిధ విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. వర్సిటీ గురించి వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్యపై ఆమె ఆరా తీయగా.. అధికారులెవరూ స్పష్టంగా చెప్పలేకపోవటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందుగా ఆ వివరాలన్నీ కంప్యూటరీకరించాలని ఆదేశించారు. అనంతరం ఆమె విద్యార్థినీ, విద్యార్థుల వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల హాస్టళ్లలో పురుష సిబ్బంది పనిచేస్తుండటాన్ని గమనించారు. వారిని వెంటనే బదిలీ చేయాలని చెప్పారు. కొందరు విద్యార్థినులు హాస్టళ్లలో ఉన్న సమస్యలు ఏకరువు పెట్టడంతో అందుకు కారకులైన సిబ్బందికి మెమోలు ఇవ్వాలని ఆదేశించారు.