మోర్తాడ్, న్యూస్లైన్: ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) ఇచ్చిన సమయసారిణి ప్రకారం విద్యుత్ ఉప కేంద్రాలు, ప్రత్యేక ఫీడర్లు లేని గ్రామాల లో 12 గంటల పాటు నిరాటంకంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. లోడ్ కారణంగా అర్ధరాత్రి మరో రెండు గంటలపాటు కోతలు విధిస్తున్నారు. దీంతో పల్లెలకు రోజులో కేవలం 10 గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. నెల రోజుల కింద విద్యుత్ కోతల వేళలను ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు ప్రకటించారు. అధికారులు ప్రక టిం చిన సమయాలలోనే కాకుండా, ఇతర సమయాలలో కూడా సరఫరా నిలచిపోతుండటంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి
పట్టణాలలో నాలుగు గంటలు, మండల కేంద్రాలలో ఆరు గంటలు, విద్యుత్ ఉప కేంద్రాలు ఉన్న గ్రామాలలో ఎనిమిది గంటలపాటు కోతలను అమలు చేస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు గతంలో ప్రకటించారు. పల్లెలలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిరాటంకంగా విద్యుత్ను సరఫరా చేయబోమని స్పష్టం చేశారు. దీని ప్రకారం కోతలను అమలవుతుండగానే, ఇన్కమింగ్ పేరుతో రోజుకు మరో రెండు గంటల సరఫరాను నిలిపివేస్తున్నారు.
ఉపాధికి గ్రహణం
జిల్లాలో 718 గ్రామ పంచాయతీలకుగాను 250 గ్రామాలలో విద్యుత్ ఉప కేంద్రాలు ఉన్నాయి. వీరితోపాటు మిగిలిన 468 గ్రామాలలో విద్యుత్ కోతలు ప్రజలను వేధి స్తున్నాయి. పగటి పూట పూర్తి స్థాయిలో సరఫరా లేక పోవడంతో గ్రామాలలో ఉన్న ఉన్న చిన్న చిన్న రైసుమిల్లులు, పిండి గిర్నీలు తదితర పరిశ్రమలు మూతపడే దశ లో ఉన్నాయి. శీతలపానీయాలు, సోడాలు అమ్ముకునే చిరు వ్యాపారులు కోతలతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. విద్యుత్ ఆధారంగా నడిచే పరిశ్రమలు మూత ప డే దశకు చేరుకున్నాయి. వాటి నిర్వాహకులు ఉపాధి కోల్పోయి రొడ్డున పడే ప్రమాదం నెలకొంది.
తాగునీటికీ తిప్పలే
విద్యుత్ సరఫరా ఉండక పోవడంతో గ్రామాలలోని రక్షిత మంచినీటి ట్యాంకులలో నీటిని నింపలేకపోతున్నారు. దీంతో రాత్రి పూట నల్లాల ద్వారా నీరు సరఫరా కావడం లేదు. తెల్లవారు జామున కూడా నీటి సరఫరా అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పట్ణణం, పల్లె అనే తే డా లేకుండా నిరంతరం విద్యుత్ను సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆయన మరణం తరువాత విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించేవారు కరువయ్యారు.
వ్యయ సాయానికి తొమ్మిది గంటలపాటు విద్యుత్ను సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఉత్తర్వులను జారీ చేసినా, వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఎలా ఉన్నా పల్లెల్లోని ప్రజలకు మాత్రం పగటి పూట కరెంటు సరఫరా అందని ద్రాక్షలాగా మారింది. వేసవి ఆరంభానికి ముందుగానే పరిస్థితి ఇలా ఉంటే, రానురాను పరిస్థితి మరింత భయానకంగా ఉంటుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పల్లెకు పది గంటలే
Published Mon, Feb 17 2014 2:47 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement