
మాట్లాడుతున్న కొల్లేరు సంఘ జిల్లా అధ్యక్షుడు రాంబాబు
సాక్షి, కైకలూరు(కృష్ణా) : జిల్లాలో కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డిపై పూర్తి నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నారని కొల్లేరు సంఘ జిల్లా అధ్యక్షుడు నబిగారి రాంబాబు స్పష్టం చేశారు. కొల్లేరులో చెరువుల సాగు ఇకపై చేయనివ్వబోమని, భయపెట్టిన కారణంగా వైఎస్సార్ సీపీలో అక్కడ ప్రజలు చేరుతున్నారంటూ టీడీపీ నేతలు ఆదివారం చేసిన వ్యాఖ్య లను కొల్లేరు పెద్దలు ఖండించారు. కైకలూరులోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం సంఘ నాయకుడు రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు జరిపిన పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్రెడ్డి రెగ్యులేటర్ నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు.
ఇటీవల అసెంబ్లీలో స్థానిక పార్టీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) కొల్లేరు సమస్యలను ప్రస్తావించారన్నారు. పార్టీ చేరికలపై మాపై ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. మా ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడి పల్లకీ మోస్తే మాకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆ నాయకుడు వైఎస్సార్ సీపీపై లేనిపోని ఆరోపణలు మానుకోవాలని సూచించారు. వివిధ కొల్లేరు సంఘ నాయకులు జల్లూరి వెంకన్న, బలే చిరంజీవి, జయమంగళ కాసులు, సైదు ఆనందబాబు, ఘంటసాల సీతారామాంజనేయులు, జయమంగళ వీర్రాజు పాల్గొన్నారు.
కొల్లేరులో టీడీపీ, బీజేపీ బంధం
రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్న కొల్లేరులో మాత్రం కలసి పనిచేస్తున్నాయని కొల్లేరు సంఘ అధ్యక్షుడు రాంబాబు ఆరోపించారు. బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని టీడీపీ నాయకులు కొల్లేరు ప్రజలకు చెప్పడం మైత్రికి నిదర్శనమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment