తిరుమల: తిరుమలలో చిరుతల సంచారంతో శ్రీవారి భక్తులు, స్థానికుల్లో తీవ్ర ఆందోళన పెరిగింది. దీనిపై వరుస కథనాలు, చిరుతల లైవ్ చిత్రాలతో సమస్య తీవ్రతను సాక్షి ఎత్తిచూపింది. దీనిపై టీటీడీ యాజమాన్యం స్పందించింది. చిరుతల్ని బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేశారు. ఎవ్వరూ భయపడవద్దని, రక్షణ చర్యలు వేగవంతం చేశామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు భరోసా ఇచ్చారు. గోగర్భం డ్యాము నుంచి బాలాజీనగర్ మీదుగా జీఎన్సీ టోల్గేట్ వరకు సంచరిస్తున్న నాలుగు చిరుతల్ని బంధించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. వైల్డ్లైఫ్ విభాగంతో సంప్రదింపు జరిపించింది. అనుమతి రావంతో రెండు బోన్లు తెప్పించారు. బాలాజీ నగర్ శ్మశాన అటవీప్రాంతం, మరొకటి తూర్పు బాలాజీనగర్లో అమర్చారు.
రాకుండా కట్టడి చేస్తాం
చిరుతలు సాధారణంగా దాడి చేయవు. ఆహారన్వేషణలో దారి తప్పి సంచరిస్తుంటాయి. పరిస్థితి తీవ్రంగా కావటంతో బోన్లు ఏర్పాటు చేశాం. వాటిని బంధించటం కంటే, జనావాసాల్లో రాకుండా కట్టడి చేస్తాం. ఫారెస్ట్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. - ఎన్వీ శివరామ్ప్రసాద్, డీఎఫ్వో, టీటీడీ
భద్రతా సిబ్బందితో గస్తీ బృందాలు
చిరుతల సంచారంపై టీటీడీ విజిలెన్స్ పరంగా చర్యలు తీసుకున్నాం. శివారు ప్రాంతాల్లో విజిలెన్స్ బృందాలతో గస్తీ పెంచాం. మొబైల్ వాహనాలతో గాలింపు చర్యలు చేపట్టాం. - రవీంద్రారెడ్డి, వీఎస్వో , టీటీడీ