
సమరదీక్షకు సన్నద్ధం
♦ మంగళగిరి వై జంక్షన్ వద్ద దీక్షాస్థలిలో భూమిపూజ
♦ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శివిజయసాయిరెడ్డి పర్యవేక్షణ
♦ జిల్లా నేతల ఆధ్వర్యంలో ఏర్పాట్లు
♦ నియోజకవర్గ నేతల విసృ్తత సమావేశాలు
♦ పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : మంగళగిరి వై జంక్షన్ వద్ద ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చేనెల 3, 4 తేదీల్లో చేపట్టనున్న సమరదీక్షను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శనివారం సాయంత్రం సమరదీక్ష చేపట్టనున్న స్థలంలో భూమిపూజ చేశారు. మంగళగిరి వై జంక్షన్ వద్ద దీక్షాస్థలిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యనేతలంతా హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించిన విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలని నేతలు ప్రతినబూనారు.
ముమ్మరంగా ఏర్పాట్లు..
సమరదీక్షను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐదు ప్రధాన అంశాల్లో బాబు ప్రజల్ని మోసగించిన విధానాన్ని వివరిస్తున్నారు. రాజధాని పేరుతో బాబు నిర్వహిస్తున్న రియల్ వ్యాపార చిదంబర రహస్యాన్ని పేర్కొంటున్నారు. పార్టీనేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛందంగా దీక్షకు తరలివచ్చే ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకునేపనిలో నేతలు నిమగ్నమయ్యారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతుండగా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సూచనల మేరకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, జిల్లా పరిషత్, మండల పరిషత్లకు చెందిన ప్రతినిధులు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర నేతలు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సరిహద్దునే ఉన్న కృష్ణాజిల్లా నేతలు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతల్లో భాగస్వాములవుతున్నారు.
భూమిపూజ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కన్వీనరు తలశిల రఘురామ్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్, ఎస్సీసెల్ కన్వీనర్లు పూనూరు గౌతంరెడ్డి, మేరుగ నాగార్జున ,రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, తాడికొండ ఇన్చార్జి కత్తెర సురేష్కుమార్, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, యూత్, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్లు కావటి మనోహర్ నాయుడు, బండారు సాయిబాబు, మొగిలి మధు, ఎంపీటీసీలు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నే శేషారావు, కౌన్సిలర్ బుర్రముక్క వేణగోపాలరెడ్డి, జిల్లా కార్యదర్శి మాచర్ల సుధాకర్, నాయకులు మున్నంగి గోపిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, చిల్లపల్లి మోహన్రావు, మునగాల మల్లేశ్వరావు, పచ్చల శ్యాంబాబు, మల్లవరపు సుధారాణి, కొల్లి ఇందిరాకుమారి తదితరులు పాల్గొన్నారు.