
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కేవలం పది రోజుల్లో అవి మంజూరయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో సేవలకు సంబంధించి ఈ నెల 9న సీఎం వెబ్పోర్టల్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత మొత్తం 1,28,281 మంది గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి అర్హతలు పరిశీలించగా మొత్తం 96,568 మందిని అర్హులుగా తేల్చారు. పది రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం వీరికి పింఛన్లు మంజూరు చేసింది. వీరందరికీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్).. జిల్లాల్లో డీఆర్డీఏ అధికారులు కలిసి శనివారం పింఛను కార్డుల పంపిణీ చేస్తారని సెర్ప్ సీఈఓ రాజాబాబు తెలిపారు. వీరందరికీ పింఛను మంజూరు పత్రంతో పాటు పింఛను కార్డు, పింఛను పుస్తకం, లబ్ధిదారునికి సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయనున్నారు.
మొన్ననే 1.10 లక్షల మందికి.. ఇప్పుడు మరో 96 వేలు
ఇదిలా ఉంటే.. మొన్న మే నెలాఖరు నాటికి ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న 1,30,487 పింఛను దరఖాస్తులను జూన్ మొదటి వారంలో పరిశీలించి అందులో 1,10,104 మందికి పింఛను మంజూరు చేసిన విషయం తెలిసిందే. వాటికి ఇప్పుడు తాజాగా మరో 96,568 కూడా కలిపితే ఒక్క జూన్లోనే రాష్ట్ర ప్రభుత్వం 2,06,672 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లయింది. అలాగే, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక గతంలో మంజూరు చేసిన 7.38 లక్షల పింఛన్లు, ఈ జూన్ నెలలో మంజూరు చేసిన 2.06 లక్షల పింఛన్లు కలిపితే గడిచిన ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 9.44లక్షల మందికి పింఛను మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment