
సాక్షి, నల్గొండ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని సతీష్ అనే యువకుడు హైదరాబాద్ నుంచి విజయవాడ కనక దుర్గమ్మ గుడికి పాదయాత్రగా బయలుదేరారు. వైఎస్ జగన్ నివాసమైన లోటస్పాండ్ నుంచి మంగళవారం పాదయాత్రగా బయలుదేరి నార్కెట్ పల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్లో నివాసముంటున్న సతీష్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు ఉపయోగపడుతున్నాయని సతీష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయడం లేదని, ఎక్కడ చూసినా అవినీతి ఎక్కువైపోయిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, పేదలకు పెన్షన్లు, ఇళ్లు వస్తాయని, అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు.