
నెల్లూరు(అర్బన్): కేంద్రం ప్రకటించిన కరోనా కేసుల నమోదుతో హాట్స్పాట్లో నెల్లూరు జిల్లా ఉందని, అధికారులు మరింత కఠినంగా లాక్డౌన్ను అమలు చేయాలని కలెక్టర్ శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి ఆయన జెడ్పీ ఆవరణలోని ఎమర్జెన్సీ కేంద్రం నుంచి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి కంటైన్మెంట్ జోన్లు (రెడ్జోన్లు)లో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలు వివరించారు. పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగిందన్నా రు.
ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ సడలింపుల పై ముందస్తు జాగ్రత్తగా మైక్రో ప్లాన్ సిద్ధం చేసుకుని అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. డివిజన్, నియోజకవర్గ స్థాయిలోనే మరిన్ని క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని వసతులు కల్పించాలన్నారు. ఇప్పటికే అన్ని ఆస్పత్రులకు ఎన్–95 మాస్క్ లు పంపించామన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి, 60 ఏళ్లు కన్నా తక్కువ ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలున్న వారికి ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించాలన్నా రు. స్వాబ్ తీసుకునేటప్పుడు ఆధార్కార్డుతో పాటు ఆ వ్యక్తి వివరాలు తీసుకోవాలన్నారు. తద్వారా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని తక్షణమే ఐసొలేషన్ చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో జేసీ వినోద్కుమార్, వైద్యశాఖ జేడీ డాక్టర్ రాజేంద్రప్రసాద్, నుడా వైస్ చైర్మన్ బాపిరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment